యాత్రానుభవాలు లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు
యాత్రానుభవాలు లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు

15, జులై 2019, సోమవారం

భద్రాచలం, హేమాచలం.8.01.18.

భద్రాచల యాత్ర.

  హైదరాబాద్ నుండి మణుగూరు ఎక్స్ప్రెస్ ట్రైన్ లో 8.01.2018న,రా.11.30కు మా బావగారు శేషగిరిరావు గారు, చెల్లి ఉదయ, ఇందిర,నేను బయలదేరి ఉ.7.30కి మణుగూరు చేరాము. 9.01.18న స్టేషన్ నుండి బయలుదేరి అల్పాహారం తరువాత ఆటోలో  "మల్లూరు" " హేమాచల నృసింహస్వామి" దర్శనానికి వెళ్ళాము. (మణుగూరునుండి మల్లూరు 50.కి.మీ.మల్లూరు వెళ్ళేటప్పుడు వీలుచేసుకొని అరటి,జామ మొ.లగు పండ్లు తీసికొని వెళితే వానరాల ఆకలి కొంతవరకు తీర్చవచ్చును)అచట ఆర్చికి కుడివైపున మెట్ల ప్రక్కన కొద్ది దూరంలో స్వయం భవునిగా వెలసిన హనుమ గుడి చెంత  కాలకృత్యాలు తీర్చుకోవడానికి, స్నానాలు చేయడానికి (స్వల్పరుసుముతో)చక్కని ఏర్పాట్లు చేశారు. ఎంతో అభినందనీయులు. అచటికి వచ్చే నీరు పరమ పవిత్రము, స్వచ్ఛము, అవ్యక్త మూలికాసంస్పర్శిత రోగ నిర్మూలనము,అమృతతుల్యము,సమతులోష్ణము,సజీవగంగావతరణము. ఆ స్నానానంతరము మనజన్మ పునీతమైన అనుభూతి కలుగుతుంది. నేను కూడ అచట స్నానం చేయగలగటం మహద్భాగ్యమే. అక్కడనుండి షుమారు 50సోపానాలు (మెట్లు)దాటితే నరసింహ దర్శనం లభిస్తుంది. స్వామి స్వయం భువుగా చెబుతారు.   
               ఈ స్వామిని దర్శించిన మహమ్మదీయ చక్రవర్తి కొండ, ఆలయము అర్థచంద్రాకృతిలో ఉండుటవలన తమదైవ చిహ్నమని భావించి భక్తి తో కొంత బంగారాన్ని కానుకగా సమర్పించారట. తదుపరి ఆబంగారమును అమ్మి వచ్చిన ధనమును బ్యాంకు లో వేసి వచ్చే వడ్డీ తో అర్చకులు మొ.లగు వారు మనుగడ సాగిస్తున్నారట. ఆ కారణముననే ఆ స్వామి"హేమాచల నృసింహస్వామి" పిలవబడుతున్నాడట.                                               ప్రపంచంలో ఎక్కడా లేని ప్రత్యేకత ఏమిటంటే స్వామికి కంఠం క్రింద భాగమంతా శిల కాక మానవశరీరంలాగా ఉంటుంది. నొక్కి చూస్తే చర్మం లోనికి వెళ్ళి కొద్దిసేపటి పూర్వపుస్థితికి వస్తుంది. పూర్వం త్రవ్వకాల కారణంగా స్వామి నాభి(బొడ్డు)దగ్గర గాయం యేర్పడి అచట రక్తము కారుచున్న కారణంగా అచట చందనం ఉంచుతారు. స్వామి నిజరూపదర్శనం శుక్ర,శని,ఆదివారాలు (మ.12.వరకు) ఉంటుంది. స్వామి వారి నాభిదగ్గర ఉండే చందనాన్ని పాలలో కలుపుకొని త్రాగితే పెండ్లి కాని వారికి వివాహము, సంతాన హీనులకు సంతానము తప్పక కలుగుతుందను నమ్మకం ఇటీవలి కాలంలో ఎక్కువమందికి కలుగుతున్నది. ఈవిషయాన్ని ఫలితం పొందినవారివలన, ఆటోలవారివలన కూడ వినటం జరిగింది. నమ్మకం,ఆత్మ విశ్వాసం ఎన్ని సమస్యలనైనా తీర్చగలవు.ఎంత ఉన్నతినైనా కలిగించగలవు.
         9వతేది మధ్యాహ్నం మణుగూరునుండి బయల్దేరి 2.30.లకు భద్రాచలం లోని "అంబా అన్నసత్రం"లో భోజనంచేసి దగ్గరున్న గదిలో విశ్రాంతి తీసికొని ఆటోలో బయల్దేరి "జటాయువు గుడి,(జటాయువు కాలు తెగిపడినచోటు)(సమీప పొలంలో రెక్క తెగిపడినదని సమాచారం) దుమ్ముగూడెంగ్రామదేవత, సీతారాములపర్ణశాల"(భద్రాచలంనుండి 30.కి.మీ.)చూచి వచ్చాము.
     10వ తేది. ఉ.8.00లకు మేము భద్రాచల రామదర్శనం చేసుకొని, శేషగిరిరావు గారి దంపతులు చేయించుకొనిన       కల్యాణమును కనులారా చూచుకొని, అన్నసత్రములో రామప్రసాదమును స్వీకరించి విశ్రాంతి తరువాత గోదావరి స్నానం ముగించి గదికి చేరాము. సాయంత్రం7.గం. లకు బస్సు లో కొత్తగూడెం చేరి అచట సికింద్రాబాద్ మణుగూరు ఎక్స్ప్రెస్ లో రాత్రి.10.45కి ఎక్కి 11వ తేది ఉ.6.గం.లకు ఇండ్లకు చేరాము.

 కం.హేమాచల నరసింహుని
      నేమానవుడేనిభక్తి నీమముతోడన్
      సేమంబుగోరిమ్రొక్కిన
      కామంబులుదీరితాను కాంచునుసుఖముల్.
కం. మల్లూరు నారసింహుని
      యుల్లంబునవెల్లువెత్తు యుత్సాహమునన్
      కల్లా కపటములెరుగక
      చల్లంగనుమ్రొక్కినాము సౌమ్యతదనరన్.

 కం.ప్రాతఃస్మరణముజేయుచు
      పూతాత్ములభంగిభద్రు ముంగిటవాలన్
      సీతారాముల కరుణయె
      చేతంబులురంజిలంగ చేరెను మాకున్.

14, జులై 2019, ఆదివారం

నేలపట్టు...పక్షులు.

నేలపట్టు. ప్రకృతి నాస్వాదిస్తు కొన్ని చిత్రాలు. ఇతర దేశాలనుండి పక్షులు ఇచటి చెరువు దగ్గరకు వలసవస్తుండేవట. ఇది ఒకరైతు పొలమట. దీనిని ఆనాడు బ్రటీషువారు గమనించి ఆభూమిని ప్రభుత్వం స్వాధీన పరచుకొని వాటి అభివృద్ధికి మరికొన్ని వనరులు కలిగించినదట. అవి ఈప్రాంతానికి వచ్చి చక్కని అనువైన ఆహారాన్ని పొంది సంతానాభివృద్ది చేసుకుని సంతాన సమేతంగా స్వస్థానాలకు చేరుతాయట. ఇచట వాటిని మరింత దగ్గరగా చూచేందుకు "బైనాక్లర్స్" ఇస్తారు. దానిద్వారా ఆ పక్షులను చూస్తే వాటి కూనలతో సహా కనిపించి మైమరపిస్తాయి. మనం ఎన్ని చిత్రాలు తీసినా అసంతృప్తే. మామూలు కెమెరా తో తీసిన చిత్రాలు కొంతకాలానికి కనుమరుగౌతాయి. మన కన్నులనే కెమేరాతో తీసినవి మనం బ్రతికి ఉన్నంతవరకు ఉంటాయి. మధురానుభూతిని కలిగిస్తుంటాయి.

 ప్రకృతి జీవుల కెయ్యడ ప్రాణమగును,   
 ప్రేమ పెంచుచు పంచుచు ప్రియముగూర్చి,                                           
 మధురభావాల నిలయమై మానవాళి,  
 మనసుదోచును సతతంబు మాన్యమగును.

 కరుణరస నిర్భర నరుని
 పరమహృదయమెయ్యెడ గన భాసుర మౌగా
 పరమాత్మ తుల్యమగుచును
 ధరవెల్గును శాశ్వతముగ ధన్యంబగుచున్.

చెట్టు చేమలు ఖేచర జీవతతిని
కావవలయును సతతంబు కరుణతోడ
 మహిత సద్గుణశోభిత మనుజుడెపుడు
పరమపూజిత దైవాంశ వరదుడగును.

12, మార్చి 2019, మంగళవారం

కేరళ పర్యటన. మార్చి.1నుండి 10వరకు.13.03.19.

కేరళ పర్యటన.

  

  రమ్మభినందనా!భరత రత్నమ!వీరకిశోరమై తగన్
  దమ్మును జూపి పాకునకు దర్పమడంచిన నుక్కుమానిసీ
  ఇమ్మహి భారతీయుడొకడేకద శాంతియుశౌర్యదర్పముల్
  చిమ్మెడు ధైర్య శాలి,ఘన శ్రేయము గూర్చిన నీవెయాతడౌ.
(శబరి ఎక్స్ప్రెస్ లో ఉండగా అభినందన్  ను పట్టుకొని
మరల విడుదలై భారత్ వస్తున్నాడని తెలసి,దానికి స్పందన.)

 ది.1.03.19న  మ.11.45.కి *శబరి ఎక్స్ప్రెస్ *లో మా కేరళ ప్రయాణం. మహాయోధుడు, భరతమాత ముద్దుబిడ్డ అయిన అభినందన్ స్వదేశానికి చేరుతున్నాడన్న శుభవార్త తో ప్రారంభమై , చేరాడన్న వార్త తో ముగిసింది. ఎంత సంతోషాన్ని అనుభవించింది భరతజాతి!!జై భారత్. !
 ది.2.03.19. :కణ్ణగి(అంబ)ఆలయం,రామాలయం కొడంగలూర్: లోచి చూచి ఆ రాత్రికి గురువాయూర్ లో బసచేశాము.




(కణ్ణగి దేవతయైన కథ: కోవలన్,కణ్ణగి ప్రేయసీ ప్రియులు. కావేరి పట్టణపు ధనికుని కుమారుడు కోవలన్ అందాలరాశియైన కణ్ణగిని ప్రేమించి పెళ్ళిచేసికొని,కొంతకాలానికి మాధవి అనే వేశ్యా వ్యామోహంలో పడి, సర్వంకోల్పోయి మరల భార్యను వెదుకుతు వచ్చి, ఇంటనే ఉంటు వ్యాపారంచేసే నిమిత్తం భార్య ఇష్టప్రకారం
ఆమె ముత్యాల కాలియందె అమ్మే ప్రయత్నం చేయగా, అదే సమయంలో మహారాణి ఒక కాలి (ఇలాంటి దే)పోగా , దానికై వెదకు భటులీతనిని దొంగని భావించి రాజుదగ్గరకు తీసికొని పోగా రాజు ఇతనికి మరణశిక్ష వేస్తాడు. విషయం తెలిసిన వెంటనే కణ్ణగి రాజ సభకేగి తన భర్త నిరపరాధి యని, రాణిగారి అందెకు తన అందెకు కల భేదం నిరూపిస్తుంది. రాజదంపతులవమానభారంతో మరణిస్తారు. కోపోద్రిక్తురాలైన కణ్ణగి తన ఒక స్తనం కోసి మధురై లో విసరి ఆపట్టణం భస్మం కవాలని శపిస్తుంది. వెంటనే దేవతలు దిగి వచ్చి కణ్ణిగిని ఓదార్చి ఆమెను స్వర్గానికి పంపుతారు. ఆమే కొడంగలూర్ లో ఉన్న కణ్ణగి అమ్మవారు.)
 ది.303.19న *గురువాయూర్*లో ఉ.6.00లకు వెళితే మ.1.30.కి దర్శనం అయింది. (కురువాయ్..అనగా సముద్రతీరం, ఊరు, కలసి కురువాయూర్,అయిందని, గురువు బృహస్పతి పాతాళశిలతో ఏర్పడ్డ శ్రీమహావిష్ణువు విగ్రహాన్ని వాయువు సహకారంతో త్రిశూర్ కు 30.కి.మీ దూరంలో గల గురువాయూర్ లో ఉంచారని కధనం, అచట ఉన్నది విష్ణురూపం, కృష్ణుని గా పూజిస్తారు ఆయనే గురువాయూరప్పన్.)






సీనియర్ సిటిజన్స్ కి ఉ.9.నుండి ప్రవేశమున్నది.
మాకావిషయం తెలియక ఆ ప్రయత్నమే చేయలేదు.ఇక నుండి తప్పక ఏ గుడికి వెళ్లినా ఒక చేసంచిలో ఆధార్ , బిస్కెట్లు, మంచి నీళ్ళు తీసుకుని వెళ్ళాలి. వచ్చిన భాషలోనే సెక్యూరిటీని వివరాలడగాలి. ఇది స్వానుభవము.భోజనానంతరం కాలడి, శంకరాచార్యుల పాదుకలున్న స్థలం, కనధారా స్తోత్రము చదివిన స్థలము , లక్ష్మీ దేవాలయము చూచి చోటానిక్కర కు చేరాము. చోటా నిక్కర అను ఊరిలో రాజరాజేశ్వరి దేవిని, భగవతి అమ్మవారిని చూచి, ఇచటే మకాం చేశాము.














  వేదంబు నాదరూపిగ
  ఖేదంబులుబాపుభూమి కేరళయిదియే
  వాదాంతమయ్యెనిచ్చట
  మోదంబంతామాదే మున్నార్ లోనన్.1.
  పేదరాలైన ప్రమదయె ఖేదమంది
   ఉసిరి కాయను భిక్షగా నుంచుమనగ
   నాదిశంకరులంతట నమ్మనడిగి
   స్వర్ణ వర్షమ్ము గురియించె పూర్ణకృపను.4.
ది.4.03.19.మహాశివరాత్రి. ఉ.7.గం.లకు*చోటానిక్కర్ *లో  బయలుదేరి *వైకాం*లోని శివుని దర్శనం చేసుకున్నాము.11.గం.లకు *అలెప్పీ *చేరాము. అచటినుండి *మున్నార్ *కి బయలుదేరి రాత్రి 8కి చేరాము.
ది.5.3.19.ఉ.9.గం.లకు బయలుదేరి తేయాకు తోటలు చూచి  భోజనం చేసి హోటల్ రూంకు వచ్చాము.

















      ఎన్నో సుందర తరువులు
      మిన్నున్  కరమంటజూచు మేల్భళి యనగా
      చెన్నౌ తేయాకుగుబురు
      లెన్నన్ మున్నారునందు నెలవైయుండెన్.2.

 దేవభూమియనెడు ధీరత్వగరిమచే
 మిన్ను నంటజూచు మన్నునుండి
 చిన్న బీజమైన చిగురులుతొడుగునుచె
 కరము ముదముతోడ శరమువోలె.3.
  ది.6.3.19.ఉ.7.గం.లకి మున్నార్ లో బయల్దేరి *ఎట్టుమనూర్* శివాలయం 12.40.కి చేరాము. ఆలయం మూశారు.(మున్నార్ నుండి ఎట్టుమనూర్ 130కి.మీ) సా.5.30.లకు *తిరువనంతపురం*  రాత్రికి 7.15కి చేరి వెంటనే దర్శనం చేసుకున్నాము.

ది.7.3.19.న శ్రీపద్మనాభస్వామి దర్శనం రెండవసారి అయింది.
  పద్మనాభుని దర్శనంబదియొకింత
  పుణ్యమో భవ బంధ విమోచనమ్మొ
  తెలియరాదది యెప్పుడున్ ధీరమతికి
  నైన, పరమవిజ్ఞాని మహాత్ముకైన.5.

 నాభిన సృష్టి కర్త,చరణాబ్జములందుపవిత్రగంగనిన్
 శోభదలిర్పగా సిరిని సుందర డెందమునందునిల్పి సం
 క్షోభములెన్నిరేగినను కోపముజెందని చిద్విలాసతన్
 ప్రాభవముల్వెలార్చుసురవందితునంబుజనాభుగొల్చెదన్.6.

      దైవదూషణంబు,ధనగర్వముండుటన్
      మహిషుడౌను గాదె మానవుండు
      పద్మనాభ! నిన్ను పలుమార్లు ధ్యానింప
      పుణ్యహృదయుడగుచు మోక్షమందు.7.

   పద్మనాభుని దర్శనం రెండవసారి అయిన పిదప ఉ.10.00లకు బయలుదేరాము.మ.1.00కి * పండలమ్ *లో భోజనం పూర్తి అయింది. *అర్నాముల*పార్థసారథి* దేవాలయములో
సా.5.00.లకు కృష్ణ దర్శనం అయింది. *చెంగనూర్*లో సా.6లకు. ఈశ్వర దర్శనం అయినది. ఎట్టుమన్నూర్ లో ,రాత్రికి బస.
ది.8.3.19. ఎట్టుమన్నూర్ లో శివదర్శనమైనది.

 శివశివ యంచునామమును చిత్తము నందనిశంబుదల్చినన్
 భవభవ యంచుపాపములుభగ్గున మండుచుబూదియౌనుగా
 అవనత శీర్షతన్ భవుని హ్లాదముతోడుత నంజలించినన్
 నవవిధ భక్తిభావములనాట్యముజేయుహృదంతరాళముల్.8.

   అమ్మ పార్వతి సద్దయనందుకొనిన
   కమ్మనైనట్టి కైతలు కళలవెన్నొ
   చిమ్ముకొనివచ్చు నిరతంబు చేతమందు
   అమ్మదనమున నున్నదే కమ్మదనము.9.

    విఘ్నరాజైన గణపతి వీక్షసేయ
    సర్వకార్యాలు సిద్ధించి సౌఖ్యమబ్బి
    వాంఛితంబులు ఫలియించి వైభవాన
    మాన నీయుడై వెలుగొందు మానవుండు.10.

    కార్తికేయుని దర్శింప నార్తిదీరి
    సంతు లేదను దుఃఖంబు సమసిపోవు
    పూర్వజన్మంపు కర్మముల్ ముగిసిపోవు
    భావిజీవితమంతయు భవ్యమగును.11.

  ఎట్టుమన్నూరు పరమేశు నెట్టులైన
  కాంచగల్గిన భాగ్యంపు కాంక్షదీరు
  సర్వమంగళ దర్శన సారమనిన
  జన్మ సార్ధక్యమందును జగతిలోన.12.
వడక్కనాథన్ ఆలయం త్రిశూర్ లో సా 6.00.లకు చూచాము.

 

  

8, జనవరి 2019, మంగళవారం

అమరారామము. అమరేశ్వరస్వామి దర్శనము.ది.8.1.2018.

 పంచారామాలలో మొదటి సుప్రసిద్ధ క్షేత్రం అమరారామం. (అమరావతి.) 2వది,కొమరారామం(కొమరవోలు)3వది, భీమారామం(భీమవరం)4వది,క్షీరారామం(పాలకొల్లు) 5వది,దక్షారామం.
నా జన్మస్థలానికి (పొన్నెకల్లు.)కూతవేటుదూరంలో పవిత్ర కృష్ణానదీతీరంలో ఉన్న అమరావతిలోని అమరేశ్వర స్వామిదర్శనం మా సోదరుని కుటుంబంతో ఈనాడు నాకెంతో పరమానందాన్ని కలిగించింది. నదీ ప్రాధాన్యమే ఉంటే అది తీర్థం,ఆలయ ప్రాధాన్యం ఉంటే క్షేత్రం. రెండు ప్రాధాన్యాల కలయిక  దీనికుంది. ఆ కారణముచేత ఇది తీర్థక్షేత్రం రాజం. కాశీ మున్నగు వానివలె.
      ఈశ్వరో అభిషేక ప్రియః ., విష్ణోః అలంకార ప్రియః ., సూర్యో నమస్కార ప్రియః ., బ్రాహ్మణో బహుజన ప్రియః. 
(భోజనప్రియః కాదు). మాకు ఈశ్వరాభిషేకం చేయించే అవకాశం దొరకలేదు. కాని మానసికంగా అభిషేకం చేసినట్లు భావించి  దర్శించి తత్ఫలాన్ని పొందినట్లు భావింంచాను. శారీరకంగా చేయలేని పనులను మానసికంగా చేసి ఫలితం పొందటం ఒక మార్గం. ఈ మార్గం నిష్కల్మష , భావనాబలంతోనే సాధ్యం. 
     మా అమ్మా, నాన్నగారు సజీవులుగా ఉండగా అంటే షుమారు 50 సంవత్సరముల క్రితం అమరేశ్వరునికి అందరం అభిషేకం స్వయంగా చేసిన జ్ఞాపకాలను నెమరువేసికొన్నాను. ఇది చిరకాల దర్శనం. కాని కృష్ణమ్మ జలాల క్రుంకులిడి , వానితో స్వామినభిషేకించుట ఒక వరమే. ఈనాటి కృష్ణానది స్థితి, కనీసం శిరస్సుపై నీటిని చల్లుకోలేని దుస్థితి. ఆపని కూడ మానసిక చర్యే అయింది. ఏదిఏమైనా సద్యస్కాల సదాలోచనతో పరమేశ్వర దర్శనం ఈనాడు లభ్యమైనది. అచటి ఆంజనేయ స్వామి , బుద్ధుని మహోన్నత విగ్రహాలు ప్రత్యేక ఆకర్షణలు.  ఈ సందర్భంగా తీసిన కొన్ని చిత్రాలు.

3, ఫిబ్రవరి 2018, శనివారం

శ్రీహరి కోట . మన యశోవైభవ మూట.2.02.2018.

   నిన్న మేము( పొన్నెకంటి సూర్యనారాయణ రావు, ఇందిరా దేవి, అచ్యుతన కాళీజగన్నాథ్, సీత ) కలసి సూళ్ళూరుపేట కు 18కి.మీ దూరములోనున్న శ్రీహరి కోటకు దానిలో పనిచేసి రిటైరైన డ్రైవర్ గారి సహాయంతో పర్మిషన్ తీసికొని వెళ్ళి చూచి వచ్చాము. దానిని చూస్తున్నంతసేపు మైమరచిపోయాము. మన దేశ అంతరిక్ష శాస్త్రవేత్తలనిరంతర కృషి, ప్రతిభ,దేశభక్తి,త్యాగము మనకు అణువణువున కనబడుతుంది. ప్రయోగానికి ముందు ఏఏ పరికరం ఎలా ఉపయోగపడుతుందో, ఏఏరసాయనాలు వారు ఉపయోగిస్తారో చక్కగా వివరించారు. కాని ఆ విషయంలో కొంతైనా తెలిసిఉంటే మరికొంత అవగాహన చేసుకోవచ్చును. అయినా మాకిలాంటి విషయాలను గూర్చి తెలిసికోవాలనే ఆకాంక్ష, అధికం కనుక వారుచెప్పే ప్రతివిషయం శ్రద్ధగా విన్నాము. దానిని గూర్చి నేను సొంతంగా ఒక్క ముక్కకూడ వ్రాయలేను, అయినా ఎక్కువ మందికి దీనివివరాలు ఇవ్వాలి. అందుకే అంతర్జాలం లో తెలిసిన వారు వ్రాసిపెట్టినదానిని(వారి పరోక్ష అనుమతితో )పంచుతున్నాను. క్షమార్హుడను. అచట బయట తీసిన కొన్ని చిత్రాలతో...                                    
 (ఆంగ్లం : Sriharikotaనెల్లూరు జిల్లాలోని ఒక తీరప్రాంతపు ద్వీపము, ఆంధ్రప్రదేశ్ లోని కోరమాండల్ తీరంలో గలదు. ఇచ్చట సతీష్ ధావన్ అంతరిక్ష కేంద్రం గలదు, ఈ కేంద్రాన్ని ఇస్రో వారు నిర్వహిస్తున్నారు. ఇక్కడి నుండి భారతదేశం తన రాకెట్లను ప్రయోగిస్తుంది. దీనికి దగ్గరలోని పట్టణం సూళ్ళూరుపేట.

నేపథ్యంసవరించు

శ్రీరాముడు ఈదీవిలో అరకోటి లింగాలను ప్రతిష్ఠించి, ఇక్కడ రాక్షస ప్రభావాన్ని తొలగించాడనీ అందువల్లనే ఈ ప్రాంతానికి శ్రీ అరకోటై గా పేరు వచ్చి కాలక్రమంలో ఈ పేరు ప్రజల నోళ్ళలో నాని, శ్రీహరికోటగా మారిందిన అక్కడి ప్రజలు భావిస్తారు. రాకెట్ ప్రయోగ కేంద్రం స్థాపించక మునుపు ఈ ప్రాంతం నాగరికతకు ఎంతో దూరం. అమాయకులైన గిరిజన తెగలు నివసించే ప్రాంతం. 1970వరకూ అంతరిక్ష పరిశోధనలకు కేరళ లోని తిరువనంతపురం పరిసర ప్రాంతాల్లో ఉన్న తుంబాఅంతరిక్ష కేంద్రాన్ని ఉపయోగించేవారు. కానీ దీని చుట్టూ జనసంచారం ఎక్కువగా ఉండేది. పైగా ఆ కేంద్రం మినీ రాకెట్ ప్రయోగాలకే పరిమితం. భవిష్యత్తులో చేయబోయే భారీ రాకెట్ ప్రయోగాల దృష్ట్యా భారత అంతరిక్ష పరిశోధనా కేంద్రం మరోచోట రాకెట్ కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. ఈ నేపథ్యంలో డాక్టర్ విక్రమ్ సారాభాయ్ నేతృత్వంలో అనువైన రాకెట్ ప్రయోగ కేంద్ర స్థలం కోసం అన్వేషణలో భాగంగా దేశంలో అన్ని ప్రాంతాలనూ పరిశీలిస్తూ రాగా ఈ దీవి కంటపడింది. భూమధ్యరేఖకు దగ్గరగా ఉన్న ఈ దీవి రాకెట్ ప్రయోగాలకు అత్యంత అనువైనదిగా భావించిన సారాభాయ్ బృందం ఆ విషయాన్ని ఇస్రోకు తెలిపింది. శ్రీహరికోటలో రాకెట్ ప్రయోగ కేంద్ర ఏర్పాటుకు కేంద్ర ప్రభుత్వం అనుమతులివ్వగా, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వేల ఎకరాల స్థలాన్ని ఉచితంగా ఇచ్చింది.

అనుకూలాంశాలుసవరించు

పులికాట్ సరస్సుబంగాళా ఖాతం, మధ్య శ్రీహరికోట ద్వీపంలా ఉంది. తూర్పు తీరాన సముద్రం ఉండటం, భూమధ్యరేఖకు సమీపంగా ఉండటం, నిర్జీవ పులికాట్ సరస్సు మరో వైపు ఉన్నాయి. రాకెట్ ప్రయోగ దిశలో భూభాగాలేవీ లేకపోవడం లాంటి కారణాలు కూడా కలిసి రావడం దీని ప్రత్యేకతగా చెప్పుకోవచ్చు. ఒకవేళ ప్రయోగమేదైనా విఫలమైనా రాకెట్ శకలాలు సముద్రంలో పడిపోయేందుకు వీలుంది. మరో విశిష్టత, ఈ కేంద్రం భూమధ్యరేఖకు 13 డిగ్రీల అక్షాంశంలో ఉంది. ఇలా భూమధ్య రేఖకు దగ్గరగా ఉండటం వలన రాకెట్ భూమ్యాకర్షణ శక్తిని తేలిగ్గా అధిగమించి అంతరిక్షంలోకి అనుకున్న విధంగా పంపవచ్చు.
భౌగోళికంగా, సాంకేతికంగా, ప్రపంచంలోనే ప్రథమ స్థానంలో ఉన్న ఫ్రెంచి గయానాలోని కౌరు రాకెట్ ప్రయోగ కేంద్రం భూమధ్య రేఖకు కేవలం ఏడు డిగ్రీల అక్షాంశంలో ఉండగా శ్రీహరికోట కేంద్రం రెండో స్థానంలో కొనసాగుతోంది. ఎంతో గొప్పదిగా చెప్పుకునే అమెరికాలోని కేఫ్ కెన్నెడీ రాకెట్ ప్రయోగ కేంద్రం భూమధ్య రేఖకు 28 డిగ్రీల అక్షాంశంలోనూ, రష్యాలోని రాకెట్ ప్రయోగ కేంద్రం భూమధ్య రేఖకు 55 డిగ్రీల అక్షాంశంలోనూ ఉన్నాయి. శ్రీహరికోట అంతరిక్ష కేంద్రం మొత్తం 43,360 ఎకరాల్లో విస్తరించి ఉంది.[1]

ప్రయోగాలుసవరించు

రాకెట్ కేంద్రంగా గుర్తింపు పొందిన తర్వాత మొదట షార్ నుంచి సౌండింగ్ రాకెట్ల ప్రయోగాలు ప్రారంభమయ్యాయి. 1971అక్టోబర్ 9న రోహిణి-125 సౌండింగ్ రాకెట్ ను ప్రయోగాత్మకంగా పరీక్షించారు. అది మొదలు, ఇప్పుడు చంద్రయాన్-1 దాకా శ్రీహరికోట ఎన్నో కీలక ప్రయోగాలకు వేదికైంది. ఇంతటి విశిష్టత కలిగిన శ్రీహరికోట అంతరిక్ష కేంద్రం పేరును ఇస్రో మాజీ ఛైర్మన్ సతీష్ ధావన్ జ్ఞాపకార్థం 2002సెప్టెంబర్ 5న సతీష్ ధవన్ స్పేస్ సెంటర్ గా మార్చారు.

30, జనవరి 2018, మంగళవారం

సురుటువల్లి. 27.01.2018.

సూళ్లూరుపేట నుండి పుత్తూరు వెళ్ళే మార్గంలో గల "సురుటుపల్లి" లో  ఈ "పల్లికోటేశ్వర స్వామి" వేంచేసియున్నారు. ఇచటి అమ్మవారు " మరగతాంబ" (పార్వతీదేవి) . పాలసముద్ర మథనానంతరం ముందుగా హాలాహలం పుట్టింది. దాని వలన పదునాలుగు లోకాలకు ప్రాణ ప్రమాదమని దేవదానవులు భయపడుచుండ ప్రేమస్వరూపిణి,మాతృమూర్తి అయిన  "జగదంబ" ఈ గరళమును ఉండగాజేసి తినుడని పతిని కోరినది. భార్య ప్రేమతో కోరిన ఏ భర్త కాదనును? (అది ఎటువంటి కోరికైనను). పవిత్రప్రేమకు అంతటి మహత్తర శక్తి కలదు. ఈ స్థితికి దశరథ  శ్రీ రామాదులును లొంగినవారే. స్త్రీలు స్వార్థపరులై అడిగే కోరికలనే తీర్చగల భర్తలు లోక కల్యాణము కొరకు తీర్చకుందురా? భగవంతుడే అట్లయిన అల్పమానవుల సంగతి చెప్పనేల?  పరమశివుడు హాలాహలమును రేగుపండంత పరిమాణముజేసి కంఠమున దాచి (లోకరక్షణార్థం) "గరళకంఠుడు"గా ప్రసిద్థిగాంచెను. ఆ భుక్తాయాసముతో ఈ తావున  అమ్మవారి యొడిలో కొంతసమయము  విశ్రాంతి తీసికొని మహదానందము చెందినాడట." పరోపకారార్థమిదం శరీరం" అనుదానిని ప్రత్యక్షంగా చేసి చూపారు పరమాత్మ. ఈ సందర్భంలో నే "సహజకవి పోతన్నగారు" భాగవతంలో                " మ్రింగుమనె సర్వమంగళ , మంగళ సూత్రమ్మునెంత మది నమ్మినదో "అంటారు. ఆత్మ విశ్వాసం ఎంతగొప్పదో దీని ద్వారా తెలిపారు.
          ఇచటి శివుని దర్శించుటకు సురలోకమంత తరలి రావటం చేత "సురలపల్లి" గా ఉండి కాలక్రమేణ "సురుటుపల్లి" అయిందట. శ్రీరాముడు శివలింగాన్ని ప్రతిష్టించాడట. అచట ఆయనతో వచ్చిన లవకుశుల పాదముద్రికలు కానవస్తాయి. కాని ఆనాటికి వారి పాదాలు అంత చిన్నవి కావేమో అనిపిస్తుంది. వాల్మీకి మహర్షి కూడ అచట దర్శనమిస్తారు.

సురలనాదరించి శోభాయమానుడై, 
సురుటుపల్లిలోన సుందరుండు,
నగజ యొడిని నుండి నయనాలు ముకుళించి
ఆత్మతృప్తుడాయె అంబ మెచ్చ.

         మనం పురాణాలు పాతచింతకాయ, చాదస్తం అని భావించక సమ సమాజానికి అవసరమైన మేరకు ఉపయోగించుకోవాలి.    శుభంభూయాత్!

19, జనవరి 2018, శుక్రవారం

కోటప్పకొండ.

త్రికూటేశ్వరస్వామి దర్శనం.










గుంటూరు జిల్లా నరసరావుపేట కు 17కి.మీ.దూరములోనున్న కోటప్పకొండ అనబడే పుణ్య క్షేత్రం లోని త్రికూటేశ్వరస్వామి దర్శనం అమోఘజ్ఞానసాధనా మార్గం.ఈ పవిత్ర శైవక్షేత్రమే త్రికూటాచలం. అనగా మూడుకొండలసమాహారం. శివాలయం షుమారు 600అడుగుల ఎత్తు, కొండ షుమారు 1587అడుగుల ఎత్తు ఉంటాయట. స్థలపురాణము ననుసరించి దక్షయజ్ఞానంతరము పరమశివుడు పార్వతీసతీ వియోగతప్తుడై ఒక కొండమీద తపస్సుచేశాడట. ఇది గమనించిన బ్రహ్మాదిదేవతలు తమకును జ్ఞాన సంపదను ప్రసాదించమని కోరగా మీరెల్లరును ఇచటకేవచ్చి జ్ఞానం పొందుడని అన్నాడట. అదే ఆనందంగా భావించి బ్రహ్మ , విష్ణువు ఇతరదేవతలతోగూడి త్రికూటాచలం చేరి జ్ఞానం పొందారట. ఒక కొండపై విష్ణువు మరొక కొండపై శివుడు ఉండుటచే శిఖరములందు శివలింగములు వెలిశాయి. మూడవ కొండపై బ్రహ్మదేవుని ప్రార్థనపై శివలింగం వెలసినదట. గొల్లభామ అనే భక్తురాలి గుడి స్వామి వారి గుడికి కొద్దిదూరంలోనే ఉంది.
షుమారు 20 సంవత్సరాల క్రితం వరకు భక్తులు  చాలా గొప్పగా ప్రభలను తయారుచేసి  శివరాత్రికి  శివనామస్మరణ తో తయారుచేసిన ఆ ప్రభలను      4 లేక 6 జతల బహువిధాలంకృతమైన ఎడ్లచే ,కొన్ని ప్రభలకు కొంగ్రొత్త గిత్తలను, మరి కొన్నిటికి గొర్రెలను కట్టి   కొండచేరువకు చేరి "చేదుకో కోటయ్య మమ్మాదుకో కోటయ్య" అంటు అలవోకగా   300మెట్లెక్కి దైవదర్శనం చేసుకొనేవారు. ఆనాటి ప్రభలలో "పూసకూర్పు ప్రభ"(పూసలతోఅలంకరణ చేసినది) ప్రసిద్ధిచెందినది. కాలక్రమేణ ప్రతి గ్రామానికి కరెంట్ వచ్చిన కారణంగా పెద్దప్రభలకు ఆటంకం ఏర్పడి ప్రభలు మాత్రమే చిన్నవైనాయి కాని భక్తి స్థాయి పెద్దగానే  ఉంది. మరల మాట్లాడితే రెండింతలు పెరిగిందనే అనాలి.
నా చిన్ననాటి మరపురాని మధురానుభవాలు.
దాదాపు 1960 వ సం.నుండి 1964 సం.వరకు మా నాన్నగారు నన్ను కోటప్పకొండకు తీసికొని వచ్చేవారు. స్వామికి గుడిలో కొబ్బరికాయ కొట్టి దండంపెట్టడం ఒక సవాల్ అయ్యేది. బలవంతులు (భక్తిలోకాదు) మాత్రమే కొట్టగలిగేవారు. ఆనాడాపనిని చేసి చాలా గొప్పగా భావించేవాడిని. నాన్నగారు సున్నితమైన,పండిన, ఆథ్యాత్మిక శైలిలో "వద్దులేవయ్యా ఆ శివుడు లోపలే కాదు బయట గోడలో కూడ ఉన్నాడు. అక్కడ కొట్టు" అన్నారు. నన్ను మానాన్నగారెప్పుడు "ఏరా" అని సంబోధించగా నేను వినలేదు. ఆ నాటికి నాలో భక్తి కన్నా శక్తే ఎక్కువగా ఉండేది. కనుక సవాలునెదుర్కొనటానికే సిద్ధపడేవాడిని. ఆ విషయం ఇప్పుడు అర్ధమైనది. 
తే.గీ.గర్భ గుడిలోన వెలుపల గాలి లోన,
నీటిలోపల రాతిలో నింగిలోన 
      చెట్టుచేమలు పలువిధ జీవులందు 
              గుట్టుగానుండు మహదేవగురువరుండు.
తే.గీ. ఉన్న భావన గల్గిన నుండునతడు 
                సున్న యనువానికాతడు శూన్యుడెపుడు
     కలడు లేడను వాదంబు కంఠశోష
       తనదు సద్గుణసంపదే దైవమగును.

చెప్పక పోవడమేలా ? శివరాత్రి కి జాతరలో తిరిగితిరిగి మరుసటిరోజు  బడి, ట్యూషను ఎగగొట్టేవాణ్ణి. ఇక తెలిసిన విషయమే. ఆనాలుగు అక్షతలు మాష్టార్ల వంతు, ఆతిట్లకు అశ్రునయనపూరిత మౌనం నావంతు. గురువులు శిష్యుల భావిజీవితాన్ని ఆలోచిస్తారు. లఘువులు గురువుల కాఠిన్యాన్ని ద్వేషిస్తారు అజ్ఞానాంధకారంలో.

ఈనాటికి ఆనాటికి ఎంతతేడానో దేవాలయ అభివృద్ధిలో మన మనసులలో... కోటప్పకొండను మంచి పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తరఫున మంచి కృషి జరుగుతున్నది.  సరోవరాలు, బోట్ షికార్లు, పిల్లలకు ఆహ్లాదకర విహారాలు తయారవుతున్నాయి. ముందుముందు మిక్కిలి సుప్రసిద్ధ పర్యాటక క్షేత్రస్థాయినందుకోగలదు.
శివరాత్రి పర్వదినాలలో తప్ప కొండపైన భోజన వసతి లేదని చెప్పారు. చక్కని రోడ్లు వేయటంవలన భక్తులకు మరింత సౌకర్యం పెరిగింది. కొండపైన కూడ నిరంతర అన్నదానం (కూర,చారు,మజ్జిగ) ఉంటే భోంచేసిన భక్తులు తిరిగి విరాళాలు ఇవ్వటం వలన వృద్ధిచెందుతుంది. ఏదో ఒక సారి ఆ ప్రాంతం వెళ్ళినపుడు తప్పనిసరిగ కోటయ్యను చూచివద్దాము. 
శుభంభూయాత్!



5, డిసెంబర్ 2017, మంగళవారం

నిర్మల్ విహారయాత్రానుభవాలు. జలపాతాల దృశ్యానుభూతులు.

నిర్మల్ విహారయాత్రానుభవాలు. జలపాతాల దృశ్యానుభూతులు.

 నిరంతరం శ్రమపడే మానవ  మేథస్సునకు ప్రకృతి సందర్శనాన్ని మించిన ఆనందం ఉత్తేజం ఏముంటుంది చెప్పండి. అందుకే  నిర్మల్ లోని హస్త కళా సౌందర్యాలు, సమీపంలోని జలపాతాల పరవళ్ళు, అందాలు ఆస్వాదించే కోరికతో ది.2.12.2017.న ఉ.7గం.లకు హైదరాబాద్ లో  మా బావగారైన శ్రీ పులిజాల సత్యనారాయణ(రిటైర్డ్ ఆర్కియాలజీ సూపరింటెండెంట్) గారి ఆధ్వర్యంలో  నేను( పొన్నెకంటి సూర్యనారాయణ రావు) నా శ్రీమతి ఇందిరాదేవి, పెద్దచెల్లి అరుణ, చిన్నచెల్లి పద్మ జారాణి, మేనకోడలు సంథ్యారాణి, పిల్లలు ఆదిత్య,లలిత, మిత్రుడు గోవింద్ తలిదండ్రులు బయలుదేరి(NH44) జాతీయ రహదారిలో  210 కి.మీ. దూరాన ఉన్న నిర్మల్ కు మధ్యాహ్నం చేరి, అచట హోటల్ లో విశ్రాంతి , భోజనానంతరం నిర్మల్ కు 38 కి.మీ. దూరంలో గల పొచ్చెర జలపాత సందర్శనానికి వెళ్ళాము.

   ముందుగా నిర్మల్ బొమ్మలు..కళాకారుల.,తయారీ విషయాలు...

 అత్యంత మృదువుగా, తేలికగా ఉండే "పునికి" కర్రతో చేయబడే ఈ బొమ్మలకు 400సంవత్సరాల చరిత్ర ఉంది. కళాకారులు "నకాషీ" కులానికి చెందిన కళాకారులు. వీరు "మరట్వాడ" ప్రాంతీయులు. నిర్మల్ సంస్థానాధిపతి "నిమ్మనాయుడు" దేశం నలుమూలలనుండి కళాకారులను రప్పించి హస్త కళలను పోషించి వృద్ధిచేశాడు.
                                 తయారీ విధానం.
       ముందుగా చేయదలచుకొన్న బొమ్మకు దగిన ఆకారపు ముక్కలు తీసికొని, చింతగింజలు నానబెట్టి జిగురువచ్చువరకు రుబ్బి  పేస్ట్ చేసుకొని, దానిని కొయ్యపొడిలో కలిపి కావలసిన బొమ్మ చేసి దానిని ఎండబెట్టి నునుపు చేసి తగిన రంగులు వేస్తారు. ఆరంగుల తయారీలో చెట్ల ఆకురసాలు, పూల రసాలు వాడతారు. ఈ రంగులలో బంగారురంగు తయారీకి చాలా ఎక్కువసమయం శ్రమ పడుతుంది. ఈ రంగులు అత్యంత మనోహరంగా, మన్నికగా ఉంటాయి. బొమ్మలన్నీ సజీవకళతో ఉట్టిపడుతుంటాయి. ఈ బొమ్మల కళాకారుల సహకారసంఘం 1955 లో స్థాపించబడినది. ఈ నిర్మల్ పంచపాత్రలకును ప్రఖ్యాతి చెందినది.

     సువర్ణ పుష్పాభిషేకంతో  నిజాం నవాబు, అవాక్కు.

       ఒకసారి నిజాం నవాబు నిర్మల్ పట్టణానికి వచ్చిన సందర్భంగా
వారికి ఇచటి కళాకారుల చేత బంగారు(చెక్క)పూలు చేయించి వాటితో సువర్ణ పుష్పాభిషేకం చేశారు. కొద్ది సేపటికి నిజం తెలుసుకొని నవాబు గారు అవాక్కయ్యారట. ఇది నిజమైన భగవద్దత్తకళ. శిల్పకళవంటిదే దారుకళ. దారువు అంటే కర్ర.

   దారుకళాధురీణా!నిర్మలవాసా! దండంబులందుకోవయ్యా!
     
   1. కడుపునిండిన నిండక కలతపడక
       భరతజాతికి కీర్తికి బాటవేసి
       నలువ రూపంబు ధరియించి నవ్యరూపు
       సృష్టిచేసితివయ్యరో చెలువుమీర

   2. నిర్మల వాసివౌ సత్కళా నిర్మ లాత్మ!
       త్యాగపరిపూర్ణ సద్భావ యోగివర్య!
       వందనంబులు నీకెపుడు వందవేలు
       జాతి మరువదు నీదు విఖ్యాతి యెపుడు.

   3. "పునికి" కర్రకు నిపుణత పురుడుబోసి
        పూర్ణ రూపాలు సృష్టించు పుణ్యులార!
        రంగురంగుల యందాలు రహినినిలుపు
        మీకు శుభములుకలుగుత మిగులశోభ!

                          పొచ్చెర జలపాతం.

    ఎక్కడో పుట్టిన అప్సరసల వంటి నదీ కన్నెలు తమ చెలికత్తెల వంటి ఉపనదులతో గూడి చిలిపి వలపులతో రసికులనూరిస్తూ, చిత్రకారుల కుంచెలకు పనిచెబుతు, కవుల మస్తిష్కాల ఊహలకు ఉయ్యాలలూపుతు, సంగీతజ్ఞుల సరిగమలకు సాయంపడుతూ తమ ప్రత్యేకతలను చాటుకుంటు భూమాతపాదకమలాలను స్పృశించాలని తపనపడేవే జలపాతాలు. మన పౌరాణిక ఆధారాన్ని అనుసరించి భగీరథుని దయ వలన భువికి దిగినదే గంగారూపి జలపాతం. ఇలా ఎన్నో నదులు ఎన్నో దేశాలలో జలపాతాలై మధుర మనోజ్ఞ దరహాస చంద్రికలను, రమణీయ కర్ణపేయ సంగీత నాదాలను వినిపిస్తు ప్రకృతి ప్రియులను అలరిస్తున్నాయి.
       పొచ్చర జలపాతం నిర్మల్ కు 38 కి.మీ. దూరంలో ఉంది.
ఎన్నో ఓషథీ గుణాలను సంతరించుకొని అతి స్వచ్ఛమైన పరవళ్ళు త్రొక్కే నీటితో తన దరిజేరిన వారికి అమితానందాన్నిస్తుంది.
మేము ఆ ఆనందాన్ని ఎంత సేపు అనుభవించామో! రకరకాలుగా ఛాయాచిత్రాలు తీసుకొని పదిలపరచుకున్నాము. ఇచటికి మా బావగారు కూడ రాగలుగుతారనే ఉద్దేశంతో నే ముందుగా దీనికి వచ్చాము. ఇచటి అందాలను వృత్తిపరమైన ఛాయాగ్రాహకులైతే ఎంత ఒడుపుగా బంధిస్తారో! నాకు మదిలో అత్యుత్తమ ఛాయాగ్రాహకుడైన నా బావ మరది కీ.శే. గంగరాజు వాసుదేవమూర్తి మెదిలాడు.

     పొచ్చెర జలపాతంబది
     యచ్చెరువగుగాదె మనకు హ్లాదినియగుచున్
     చెచ్చెరదూకగముందుకు
     చిచ్చరపిడుగయ్యెమనకు సిరులనుగూర్చన్.

      జలపాత దర్శనానంతరం నిర్మల్ బొమ్మల తయారీ, పూర్తిగా తయారయి అమ్మకానికి సిద్ధంగా ఉన్నవి , ఆయిల్ పెయింటింగ్స్ చూచాము. అవి సజీవ దారు శిల్పాలు. మన భారతీయుల కీర్తి కిరీటాలు. స్వచ్ఛ విజృంభమాణసృజనలు. అభివృద్ధి వారి కళాకౌశలాలలో కనపడుతున్నదే కాని వారి జీవితాలలో కాదని ఆ కళాకారులను చూచినపుడు అవగతమౌతుంది. దానికి మనం స్పందించాల్సిన విధానం ఒక్కటే. వారి వస్తువులను మనం కొని ప్రోత్సహించటం. అందుకే మేము కొన్ని బొమ్మలను కొన్నాము.

         ది.3.12.2017. న.   కుంతాల జలపాతం.

 ఈ జలపాతం ఆదిలాబాద్ జిల్లా, నేరడిగొండ మండలం "కుంటాల"గ్రామంలో ఉంది. దీని ఎత్తు 147అడుగులు. హైదరాబాద్ నుండి 237కి.మీ. నిర్మల్ నుండి షుమారు35 కి.మీ. వెళ్ళి నేరడిగొండ నుండి కుడివైపునకు తిరిగి 13కి.మీ వెళితే "కుంటాల" జలపాతం వస్తుంది. దుష్యంతుని భార్య శకుంతల ఇచటికి వచ్చి స్నానంచేసి వెళ్ళేదట. ఆమె పేరు మీద ఈ జలపాతానికి "కుంతల"జలపాతం అని పేరు వచ్చిందట. భూమట్టం నుండి క్రిందకు 408 మెట్లు ఉన్నాయి. కాని చాల విశాలంగా ఉండి ఎక్కువ శ్రమలేకుండ దిగి ఎక్కగలిగేలా ఉంటాయి. కొంత మధ్యలో విశ్రాంతి తీసుకుంటు వెళ్ళిరావటం శ్రేయస్కరం. అత్యంత మనోహరదృశ్యం. వర్ణనాతీతం. కాని నీరుపారే ప్రాంతమంతా పాచి ఉండి ప్రమాదానీకి హేతువౌతుంది. మిక్కిలి జాగ్రత్త అవసరం.
 
  కుంతల జలపాతంబిది
  ఎంతయు ఘనమైనలోతు ఏమామలుపుల్
  వింతకు వింతై తోచు,శ
  కుంతలపేరన్ బరగుచు కూర్మిన్ గూర్చున్.

                                  ముఖ్య విషయం.

   అచటికి వెళ్ళేముందే మనం దారిలో మనకోసం ఎంతో ప్రేమగా, ఆశగా ఎదురుచూచే వానరాల కొరకు కొన్ని ఫలాలను తీసికొని వెళ్ళటం మరచిపోరాదు. మనం తిన్నది మట్టిపాలు. పరులకు పెట్టేది పరమాత్మ పాలు. పరమాత్మ అనుగ్రహిస్తే వరాలు. ఆగ్రహిస్తే శాపాలు. మనం జీవకారుణ్యాన్ని పాటించుదాం, తోటివారికి సాయపడదాం.  కళాకారుల జీవితాలలో వెలుగులు నింపే ప్రయత్నం చేద్దాం.  ఇలాంటి కార్యక్రమాలు అక్రమార్జనాపరులు చేస్తే వారి పాపాలన్నీ పటాపంచలైపోతాయి. అందుకే వారిందులోకి రారేమో!  ప్రభుత్వాలు కూడ కుటీర పరిశ్రమలకు ఎక్కువ చేయూత నివ్వాలి. వారి జీవితాలలో కాంతులు నింపాలి.

              మేరా భారత్ మహాన్.  జై భారత్. జైజై భారత్.




 

 


     
     



16, జులై 2017, ఆదివారం

అమర్నాథ్ యాత్ర...నా అనుభూతి.



  **గోల్డెన్ టెంపుల్ గూర్చి.**

      శిక్కులదేవాలయమది
      అక్కజమౌస్వర్ణమయము హ్లాదముగూర్చెన్.
      మిక్కుటమౌఆజ్యమిళిత
      చక్కని పసదనముదొరికెసంతసమొప్పన్.

   శిక్కులపవిత్ర గ్రంథము
   నిక్కపుభక్తిన్జదువుగ నేనటుగంటిన్భఘృ
   అక్కడి సద్గురువర్యుల
   అక్కరుణామూర్తులకివె అంజలులార్యా!

          ధైర్య సాహసాలు తమసొంతమనురీతి
         చిన్నపెద్ధవృద్ధ చేతులందు
         ఛురికలుండెమనకు చోద్యమలర.
         భరతమాత పుత్ర భవ్యచరిత!

** కురుక్షేత్రం గురించి.**
  గీతాచార్యుని నిలయము
  ప్రాతః స్మరణీయమైన ప్రాంతమునంతా
  చూతము రారండిబుధులు
  చేతమ్మున భక్తినింపి క్షేత్రమ్మునకున్.

   ** వైష్ణవీదేవిని గూర్చి.**

   దర్శన భాగ్యమిచ్చెనిట తాత్త్వికరూపిణి వైష్ణవీసతే
   దర్శితనేత్రముల్ మిగుల ధన్యతనందె పవిత్రమై పున
   ర్దర్శనమెప్పుడో యనెడు ధార్మికజీవుల మస్తకంబులన్
   స్పర్శను జేయుచున్ కరము సంతసమిచ్చె కృపాంతరంగయై.

        అమ్మనుజూడగాదలచి ఆర్తుడనై విలపించుచుండ,రా
        రమ్మని సద్దయన్ బిలచి రమ్యకపర్దిని వైష్ణవమ్మయే
        తెమ్మనె నాదుబృందమును తెల్విగకొండకు ప్రాణనాధునిన్
        అమ్మకుమాటయిచ్చిజవనాశ్వమురూపముదాల్చె శంభుడే.

    రాజు నామానబరగెడు రమ్య హయపు
    శిక్షకుడుహమీదనువాడు చెలిమితోడ
    చతుర భాషణాచణుడౌచు సాగివచ్చి
    అమ్మ పాదాలజేర్చెను హ్లాదమొప్ప.

          తాతపేరున బెరిగిన జాతకుండ
          సూర్యనారాయణాఖ్యుండ ‌సూరిబ్రువుడ
          వారినామంపుఫలమేమొ తేరిచూడ
          అశ్వమెక్కెడి యదృష్టమవనికలిగె.

 భైరవరాక్షసుండు నను భర్తగచేకొనుమంచుకాళికన్
 ఘోరతరంబుగాగ కడు కూళత నీచత వెంబడింపగా
 ధీరత రౌద్రరూపమున దిక్కులు సర్వము పిక్కటిల్లగా
 పోరునుసల్పి వానినటు ముచ్చటజేర్చెను కాలుచెంతకున్.

       తప్పు క్షమియింపగల్గిన తరుణిజూచి
       అమ్మ !నాకిటప్రాముఖ్యమమరునట్లు
       వరము నీయుమ కరుణను వాంఛదీర
       యనుచు గోరగ భైరవుననుమతించె.  

  నిన్ను గాంచిన పిదపనే నిశ్చయముగ
  ముక్తి నందును భక్తాళి మోదమలర
  అనుచు వరమిచ్చె ప్రేమతో వైష్ణవమ్మ
  అమ్మతనమును రూపించె నాదిశక్తి.

            **వైష్ణవోదేవి పాట**

  వైష్ణవిమాత వైభవచరిత వరములనీవమ్మా!
  నీపద సన్నిధి జేరినవారిని నెమ్మదిజూడమ్మా!

  మూడు మూర్తుల మోహనరూపివి లక్ష్మీ వాణీ కాళికవు.
  ముల్లోకంబుల భక్తుల బ్రోచెడు కరుణరసాంచిత పాలితవు.॥వై॥
  అష్టలక్ష్మిగా నమ్మినవారిని అందలమిచ్చి కాచెదవు
  నలువరాణిగా కొలిచినవారికి నాలుకపై నడయాడెదవు.   ॥వై ॥
  నామభేదముల నానారీతుల నెలకొనియున్న ఏకరూపివి
  ఎక్కడక్కడచూపుము నాకని పలుకువారికి నిశ్శబ్ద శక్తివి.   ॥వై॥
   బహువిధ మణుల రత్నరాసులను భారీపూజలు చేసినగాని
  శుద్ధభక్తికే పట్టముగట్టెడి సుందరమూర్తివి నీవమ్మా             ॥వై॥

                  **అమరనాధుని అందాలు**
  శ్రీ అమరనాథుని అందమునంతా చూతమురారండి
  గుహలో వెలసిన మంచులింగమును తలచుచురారండి

      కనులకు శిరమది కనబడకుండును
              హిమసౌందర్యంబున దాగియుండును
      కనులకు గంగయు కనబడకుండును
               ప్రవాహరూపిగ పారుచుండును.           ॥అమర॥

     ఉమకై వెదుకగ నుండదచ్చట
                 ఉన్నది శంభుని కూతమిచ్చుచు
     అగ్నినేత్రము కానరాదులే                
                 ఆరెను ఎప్పడొ ఆచలికి                     ॥అమర॥

     నాగాభరణము నామమాత్రమై        
                 మంచుకణములో మాయమైనది
     శూలము,ఢక్కా సృక్కిపోవుచు
                  సుందర హిమమున కరగిపోయెను ॥అమర॥

    మంజీరంబది మౌనముద్రతో
                 మంచునపొంచెను మరిమరిమ్రోగక
    బసవడు సైతము పరవసించుచు
                  కోటికష్టముల గోటద్రుంచుచు
                రారమ్మంచును రంకెవేసెను.             ॥అమర॥


అమరనాథుని యాత్రలో హ్లాదమొప్ప
  పాలుపంచుక నిరతంబు పారమార్థి
  కంబు నెయ్యంపు సమ్మతిన్ కలసినట్టి
  మాన్యసోదరసోదరీమణులనుతింతు.

       పెద్దల గారవించుచును ప్రేమవినిర్మిత మాతృభావనన్
       ముద్దులుమూటగట్టి కడు మోదముగూర్చెడు పల్కుజిల్కుచున్
       హద్దులుదాటనీని చిరు హాస్యము హాసము పంచుచున్సదా
       నిద్దురదూరమున్సలుపు నిర్మలమూర్తుల కంజలింతునే.

        అమరనాథుని యాత్రలో నాతో ప్రయాణం చేసిన వారి గురించి పాట.

ఓ....సోదర,సాదర భక్తశిఖామణులారా!
సరస సహృదయ సోదరీమణులారా!
   వినరండీ యాత్రాఫలం, కనరండీ జ్ఞాన బలం.

       అమరనాధుని అనుగ్రహముతో అంతా సుఖకరమైనది
       అమ్మపార్వతి అనురాగం తో అంతా సుముఖమయైనది.

  తీర్థయాత్రలో తీయని కష్టం త్రినేత్రుడిచ్చే వరమేలే
  సార్థకంబులై జీవితంబులే సంపదాళితో వరలునులే

    హిమాలయంబులు నదీనదంబులు
    పచ్చని చెట్టు పశుపక్ష్యాదులును
         శంభునిరూపం  శాంభవి తేజం.

  మానవజీవన గమ్యం మమతాసమతల రమ్యం
  మానవత్వమే మాధవు సేవకు సోపానం

       అమరనాధుని యాత్రకువెళ్ళే అన్నార్తులకిల అండగనుంటు
       పంచభక్ష్యముల పంచేవారిని పరమాత్మే దయజూచునులే.

                       జై జవాన్!!!

   మంచుకొండలలోన నించుక వెరువక
                    కావలికాయునా ఘనుడెవండు
   తనవారినందరి త్యాగంబు జేయుచు
                      కొండగుహలలోన నుండునెవడు
   శత్రువులకెప్పుడు శరభమై కనిపించి
                      నిద్దుర రానీని నెయ్యమెవడు
  భరతమాతకునెప్డు బంగరు బిడ్డ గా
                        విఖ్యాతిగన్నట్టి వీరుడెవడు
ఎవడు ఎవడని ఇతరత్ర వెదుకవలదు
జైజవానని సత్కీర్తి శాస్త్రి వలన
పొంది యున్నట్టి యరుదైన ముద్దు బిడ్డ
భారతీయులపాలిటి ప్రాణదాత!!

              అమరనాథుని దర్శనం... నా అనుభూతి.

 అమరనాథునిగంటి ఆత్మీయ భక్తుల
             మీనంపునేత్రాల మెరపులందు
 అమరనాథునివింటి నద్భుతస్వరములన్
             భంభంభోలెయనడు భజనలందు
 అమరనాథుని దరహాసచంద్రికలను
              నింపుకొంటినిహృది నిండుదనుక
  శ్రీహిమాలయమున చిత్తంబు భవుపాద
              పద్మాలకర్పించి ప్రణతులిడితి
     ఎన్ని జన్మల పుణ్యమో ఎరుగలేము
     శివుని ఆజ్ఞగ భావించి చేరవచ్చి
     పారమార్థక చింతనన్ పరవశించి
     ఈశునాశీస్సులందితి నిశ్చయముగ.
     
       


24, అక్టోబర్ 2016, సోమవారం

ఆడబోయిన తీర్థము

                  కోదండ రాముని దర్శనం.ది.22.10.2016.

   ఆడబోయిన తీర్థమెదురొచ్చినట్లు,కోరకనే దేవుడు వరమిచ్చినట్లు.....

  "కంటి మొంటిిమిట్ట కనులార యీనాడు
   రాముకరుణ ఝటితి మేము పొంది
   పొత్తమదియ నేడు పూర్ణత్వమొందకే
   రాముపాదమంటె రమ్యముగను.

   రామనామమనగ రసరమ్య భావంబు
   భద్రమిడును నదియె భావియందు
   జిహ్వత్రుప్పుడుల్ల శ్రీరాము చరితము
   చెప్పి పాడుచుండ సేమమగును.

 ఒంటి మిట్ట యందు నొనరంగ కరుణతో
భక్త జనులగావ ప్రభవమంది
దరినిజేరువారు ధన్యత్వమందగ
రక్షసేయువాడె రామ ప్రభువు.


    పలికించరామచంద్రుడె
    పలికితి నేనార్య చిలుక పలుకులవోలెన్
    వెలలేనిసిరుల నిచ్చును
    కలలోననుమరువకండి కల్యాణవిభున్.


 
ఈ రోజెంతో సుదినము. కడప జిల్లాలోని ఒంటిమిట్ట "కోదండరాముని" దర్శన మహాభాగ్యం లభించినది. నేను శ్రీకారంచుట్టిన "సూర్యశ్రీరామం" ( వాల్మీకి రామాయణమునకు స్వేచ్ఛ ఆంధ్రానువాదమును ఉత్తర రామాయణము 3౦ సర్గలు)శ్రీరామ పాదపద్మములచెంత నుంచి , శ్రీవారి ఆశీస్సులు పొంది, అచటి మహోన్నత సాహితీవేత్త,పండిత వర్యులైన శ్రీమాన్ వీణ రాఘవాచార్యుల వారి పరిచయము,ప్రసంగము, ఆశీస్సులతో పులకితమగుట. వారు ఇచట "వాల్మీకి రామాయణమును తెనిగించిన వాసుదాసు గారు, పోతన గార్ల ప్రస్తావన తీసికొని వచ్చి మీరును అటువంటి మహోన్నత కార్యము చేయుచున్నారు కావున ధన్యులని మనసార దీవించుట, త్వరలోనే మిగిలిన భాగమును పూర్తిజేసి స్వామి వారికి సమర్పించి ఇచట నొక సభ ఏర్పాటు నకు ప్రోత్సహించుట నాకు వరము. వారు కొంత తడవు మనకట్టుబాట్లు, మంచి అలవాట్లను గూర్చి ప్రసంగించిరి. వారి ప్రసంగమును, సుమధుర మనోహర సంఘటనను వీడియో రూపముగా భద్రపరచుట జరిగినది.
        ఈ ప్రయత్నములో నా సహాథ్యాయి, "రామాయణ కథా సారము" పరిశోథక గ్రంథకర్త అయిన శ్రీయుతులు తూములూరు దక్షిణామూర్తి గారు నాకు వాల్మీకి రామాయణ మూల గ్రంథముల నిచ్చి వ్రాయ బ్రోత్సహించుట మరువలేను. నా  సహధర్మచారిణి ఇందిరాదేవి వ్రాతప్రతిని కంప్యూటర్ అను యంత్రములో అక్షర బద్ధము చేయుటలోను, నా సహాథ్యాపకుడు జొన్నలగడ్డ జయరామ శర్మ ,విషయమును నిర్దుష్టము చేయుటలోను నిరంతరము శ్రమించున్నారని వారికి తెలుపగా వారమితానందము పొందిరి.
          "ఆడబోయిన తీర్థమెదురొచ్చినట్లు, కోరకనే దేవుడు వర మొసగినట్లు,తెలవారు జాము కల నిజమైనట్లు, 21వ తేదీన నా సోదరీమణి, చరవాణిలో "రేపు ఒంటిమిట్టకు వెళదాము అన్నయ్యా"
అని పిలవటం నిజంగా అమితానందాన్ని కలిగించింది. మధుర మనోహర అనూహ్య సంఘటన."
       ఈ తీర్థయాత్రలోనే పురాతన దేవాలయాలను కొన్నిటిని దర్శించాము. 21న ఒంటిమిట్ట కోదండ రామస్వామి,నందలూరు సౌమ్యనాథుడు,తాళ్లపాక అన్నమయ్య, అత్తిరాల పరశురామాలయము, దేవుని కడప, దర్గా చూచాము.22న పెన్నా నదీ తటమున ఉన్న, రెండవ కాశీగా ప్రసిద్ధి నందిన పుష్పగిరి నిలయుడైన లక్ష్మీ సమేత చెన్నకేశవ స్వామి, సంతాన మల్లికార్జున స్వామిని,పోతులూరి వీరబ్రహ్ర్మేంద్ర స్వామి, మహానందీశుని ఆలయాలు దర్శించుట జరిగినది.
      త్వరలో ఒక్కొక్క క్షేత్ర ప్రాశస్త్యము, చూచిన నా అనుభూతి వ్రాస్తాను.

20, అక్టోబర్ 2016, గురువారం

ఎంత దయో దాసుల పై 21.10.2016

మనము జీవితములో అనుకున్నవి , అనుకోనివి , జరుగుతూ ఉంటాయి, ఏది ఎప్పుడు జరుగుతుందో మనకు జరిగేవరకు తెలియదు. సూర్య శ్రీరామాయణం పూర్తి అయినతరువాత ఒంటి మిట్ట వెళ్లి స్వామి దర్శనం చేసికొని వ్రాసిన సూర్య శ్రీరామాయణం రాముని పాదాల చెంత ఉంచి తీసికొని వద్దామని అనుకొన్నాను . కాని  నా మీద దయతో ముందే అనుగ్రహించి రప్పించుకొంటున్నాడు స్వామి ఒంటి మిట్టకి. రామా నీకెంత దయో దాసులపై .... 
   ఈరోజు రాత్రికి బయలుదేరి 22.10.2016 న ఉదయం  స్వామిని దర్శించుకొని అచటి అర్చకాచార్యుల సలహాతో నేను 2014 న ప్రారంభించిన సూర్యశ్రీరామం వ్రాత ప్రతి వారికి చూపి దానిని స్వామి పాదాలచెంత కొంత తడవుంచి అచట ఈ సంఘటన వీడియో తీయించుకొని రావాలని సంకల్పం.
      ఒంటిమిట్ట కోదండరాముడు " ఏరా నాయనా! నా కథ తెలుగులో వ్రాస్తున్నావటగా , ఏదీ ఎలా ఉందో నేనే స్వయంగా చూస్తానిలా రారా! , పూర్తి అయిన తరువాత అప్పుడు మరల చూస్తాలే, నీ పాండిత్యమేపాటిదో చూడాలని, నిన్ను ఆశీర్వదించాలని కుతూహలంగా ఉండి ముందు రమ్మన్నానంతే, భయపడకు! " అని పిలిచినట్లున్నది.

23, సెప్టెంబర్ 2016, శుక్రవారం

తిరుపతి యాత్ర పద్యాలు. 22.09.2016.

            తిరుమల  శ్రీవేంకటేశ దర్శనమ్.(22.09.3016)

 1.  కంటిని వేంకటేశు ఘన కాంక్షలుదీరగ తన్మయత్వముం
      గంటిని సప్తశైలముల కంజదళాక్షు మహోన్నతత్త్వముం
      గంటిని శ్రీనివాసునల క్రన్ననభక్తులుజేరి మ్రొక్కగం
      గంటిని దివ్యమంగళుని కన్ను లపండువుగాగచేఱువై.
 2.  వింటిని వేయినామములు వీనులవిందుగ పర్వతాగ్రమున్
      వింటిని దేవదేవుకడు వేడుకబాడెడు కీర్తనావళిన్
      వింటిని సత్కథావళులు వేలకువేలుగ నెల్లవారిచేన్
      వింటిని వేదమంత్రముల విశ్వవికాసుని దివ్యలీలలన్.
 3.  ధన్యములాయె చక్షువులు తామరసాక్షుని దర్శనంబునన్
      ధన్యములాయె శ్రోత్రములుదంచితరీతిని కీర్తనాళిచేన్
      ధన్యములాయె హస్తములు తత్పదసేవనుజేయుటన్సదా
      ధన్యపు జీవితంబగును దైవ వినిర్మల నామచింతనన్.

                 వెల్లూరు  శ్రీలక్ష్మీదేవి దర్శనమ్.


 4. శ్రీహరి పాదపద్మముల చిర్నగవుల్మెరయంగ నొత్తుచుం

     దేహములోనిదేవియయి దివ్యమనోహర లక్ష్మి రూపమై
     ఊహకునెన్నరానివిధమున్ తన భక్తజనాళికిన్ సదా
     దాహముదీర్చునట్లుగను దానిలబంచును రత్నరాసులన్.
 5. శ్రీపుర వాసియైబరగి చిన్మయ రూపిగ ఖ్యాతినందియున్
     బాపురె భక్తకోటికిల బంగరు తల్లిగ భద్రవల్లిగా
     ప్రాపునుజేరినన్మరియు పాయనిగూర్మిని జింతజేసినం
     బాపములెల్లడుల్చి నిరపాయముగూర్చుదయాంతరంగయై.
 6. అందిన నీదుపాదరజమా కమలాక్షుని హృన్మనోబ్జరా
     గేందిర!సుందరీమణి! మదీయ శుభాంచిత పుణ్యశాలినై
     బొందెదనమ్మ సౌఖ్యముల మోదముతోడుత విష్ణుపత్నిరో!
     సందియమందనేలనిను చాలగగొల్చిన మోక్షమబ్బదే?

                  కాణిపాక వరసిద్ధి వినాయక స్వామి


 7. బావిని నీవుగావెలసి భక్తజనాళి హృదంతరాళముం

     దావులనింపినావుగద ధన్యతగూర్చుచు కాణిపాకము
     న్నోవర సిద్ధినాయకుడ! మోదకహస్తుడ!మూషికాధిపా!
     కావుమ మమ్ముసంతతము గౌరిముఖాంబుజ ద్వాదశాత్ముడా!
 8. ఇష్టము నీకనిన్నిల గణేశుడ! తీయనినిక్షుఖండముల్
     కష్టమెయైన దెచ్చితిని గైకొనివాని దయార్ద్రచిత్తతన్
     స్పష్టపు యోచనల్గలుగ చక్కని బుద్ధిని నాకొసంగుమా
     నిష్ఠగ నిన్నుగొల్తునిక నీరజనాభుని మేనగుర్రడా!
 9. రైతు పొలాననీవు కడు రాజసమింపెసలార బావిలో
     చేతమురంజిలం దమదు సేమముగోరుచు నుద్భవించితో
     భూతగణాధినాధుని సుపుత్రుడ!షణ్ముఖ సోదరా ! మహ
     ర్జాతక! కాణిపాకనగరాధిప! నీకివె మానమస్కృతుల్.

10. ఉంచితి నాదుభావనల నూహకు గల్గిన నంతమాత్రముం

       గాంచనగర్భురాణి నను గ్రన్నన గాచి రసాంచితంబుగ
       న్నంచితరీతిబల్కుమని నాజ్ఞయొసంగిన దానిమీరకం
       బంచితి నార్యులార!యిక బ్రాజ్ఞతతో గుణదోషమెంచుడీ!
     


   



   
   

   
   
   
     

      

దుర్గ దంపతుల పెళ్లి రోజు శుభాకాంక్షలు.12.05.26.

 ఆ.వె: చందమామ రేల డెందాలుమురిపించు రేయి బవలు వెల్గు రేడు నీదు మేనమామ; మనసు మెచ్చిన చెలికాడు జీవన పయనాన నావయతడు.1  సీ : ఒకచోట దుర్గమ్మ ఒకచోట ...