వేంకటేశుని పాదాలు వినయగరిమ
అన్నమయ్యయు పట్టెను హ్లాదమొదవ
వాని ఫణుతులు విస్తృత పరచినట్టి
జ్ఞాన శోభాంచితసురాజ్ఞి! నతులుతల్లి!
నేనొక సాహితీ ప్రియుడను. సాహితీ ప్రియులన్దరకు నా సారస్వతాభివందనములు.నా సాహితీ పుష్పాల సుగంధాన్ని ఆఘ్రాణించటానికి సవినయంగా, ఆహ్వానం .
వేంకటేశుని పాదాలు వినయగరిమ
అన్నమయ్యయు పట్టెను హ్లాదమొదవ
వాని ఫణుతులు విస్తృత పరచినట్టి
జ్ఞాన శోభాంచితసురాజ్ఞి! నతులుతల్లి!
పరాభవ వసంతం,2026. భ్రష్టులకు పరాభవవసంతం వరిష్ఠులకు వన్నెచిన్నెల వసంతం . 8.03.2026.
అందరికి ఉగాది శుభాకాంక్షలు.
సీ. వాసంత లక్ష్మి ఆ వ్యత్యాసమెరుగును ,
భక్తవరిష్ఠులు భ్రష్టులకును
ప్రకృతి కాంతామణి పరికించు తేడాను
సుజన హృత్కమలంబు, శుంఠ మనసు
కాల శాసనుడు తా గనునెంతొ భేదంబు
సౌమ్యుల దుష్టుల చర్యలందు
సృష్టి కర్తెరుగును శీలంపు మూలంబు
రక్కసి జాతికి లలితులకును
తే . పంచిపెట్టు పరాభవాల్ భ్రస్టులకును
వన్నెచిన్నెల వైభవాల్ పండితులకు
నూత్న వత్సరంబ!తవ వినూత్న శోభ
ఎవరికెయ్యది ప్రాప్తంబొ ఈప్సితాన .1
సీ . కోకిల గానముల్ కోపంబు తెప్పించు
కూళల కక్కటా !ఘోరమగును
గంధబంధురమైన కమ్మని కుసుమాలు
వెగటుగాదోచును వెఱ్ఱులఁకును
వాసంతి లక్ష్మిగా వచ్చిన యిల్లాలి
కాలదన్నును మృగంబువోలె
పెరనారి పొందుకై పెర పెరలాడెడు
కామాంధులకునెల్ల కలతమిగులఁ
తే. దుర్మదాంధుల కుట్రల దునిమివేసి
జ్ఞానబోధను జేయంగ కదలివచ్చె
వాసిగాంచు పరాభవ వత్సరంబు.
పండితాళికి కవనంపు పండువనగ. 2.
సీ . ఏ పాపమెరుగని ఎందరి ఉసురులో
పొట్ట బెట్టుకొనెడి పోరుసల్పి
ఆధిపత్యంబదే అంతిమ లక్ష్య మై
ఆసురి చర్యల హర్షమంది
పాఠశాలల పైన ప్రాజ్ఞుల పైనను
బాంబుల వర్షంబు వడగజేసి
పాప కూపంబునబడు భ్రస్టులకునెల్ల
రయముగా తగిన పరాభవమ్ము
ఆ . కలుగజేసి మంచి కాపాడ వాసంత
లక్ష్మి వగుచు దయను రమ్ము రమ్ము !
దీనజనుల పాలి దేవతవీవమ్మ
కోటి నతులతోడ కొలుతు నిన్ను .3
ఆ. క్రొత్త వత్సరంబ ! కోర్కెలు పండగ
గౌరవాదరముల గోరు ప్రజలు
అధిక భాగమీవు ఆదాయములజూపి
అంతకన్న మిగుల ఆయువిమ్ము.4.
తే. నీ పరాభవ నామంబు నిఖిల జగతి
తలచుకొన్న గుండె లయనుదప్పిపోవు
వాదు నీకేల సద్గౌరవాలనిమ్ము
అంజలింతురు సర్వులు హారతిచ్చి.5.
రసజజభర....11.
కోకిల..కాకి.
కాకిరంగును బోలియున్నను, కావుకావని బల్కవే
నాకె కమ్మని కంఠముందని నాట్యమాడెదు గర్వమున్
సోకులాడివి మాయలాడివి, చోర విద్యను ప్రజ్ఞవే
నాకు నచ్చవు పొమ్ముపొమ్మిక, నంగనాచివి కోయిలా! 1
మావి కొమ్మను నక్కినక్కి అ, మ్మావి జొంపము మెక్కుచున్
భావికాల వసంతమందున, పంచమస్వర కీర్తనల్
భావుకాళికి గుండెపండగ, పాట పాడెదవెంతయున్
పోవె నీవగు మాయలెల్లను, ముందు మాకెఱుకాయలే.2
కాకిపెట్టిన రెండుగ్రుడ్లను, కాల ద్రోయుచు కూళవై
సోకులాడిగ నీదు గ్రుడ్లను, సుందరంబుగ నుంచుటల్
మాకు తెల్లమె నీ కథల్ పలు, మాయలెందుకె కోయిలా!.
కాకి పిచ్చిది కాకపోయిన, కట్టె దెబ్బలు నీకగున్.3
మావి కొమ్మలు పూచుకాలమె, మంచి కాలము మీకగున్
ఠీవిగా గళమెత్తి పాడగ, టింగురంగని యాడగన్
భావి సూచనలీయగా తగు, భద్రమెల్లను గూర్పగా
నావి నావని పల్కరాదను జ్ఞాన మిచ్చును కాకియే.4.
నీవు తిండిని గన్న వేరొక నేస్త మున్గనవెప్పుడున్
ఆవురావురటంచు మెక్కెదు, హ్లాది వౌచును స్వార్ధమున్
నావి నీవను భేదమొల్లక, నాల్గు దిక్కుల కాకులన్
ప్రోవుజేయుచు నారగించును, బుద్ధి మంతపు కాకియే.5
పంచమంబున నీవు కూయగ, బాలలందరు హేళనన్
ఎంచి రాగము మించిపాడగ, ఎక్కువైనవి నీహొయల్
పొంచియుండియు రాగ రీతులు, ముద్దు లొల్కగ మార్చుటల్
కొంచెమైనను ధర్మమా యిది, కోయిలా వనగాయకా. 6
ఈ రోజు (17.01.2026) నా వెంటపడిన మాంజా కాలసర్పం( దాని పొడవు సుమారు 1000మీ.)భగవానుని కృపతో తప్పుకొన్న నేను. మనం నిరంతరం మృత్యుదేవత కాలపాశం ప్రక్కనే తిరుగుతాము. విధి నియమానుసారం మాత్రమే దాని కౌగిలి చేరతాము.
నేను (పొన్నెకంటి సూర్యనారాయణరావు) ప్రతిరోజు వాకింగ్ కు సఫిల్ గూడ పార్కుకు ఉదయం 7గం.లకు వెళతాను. అలాగే ఈరోజు కూడ బయల్దేరాను. ఆనందబాగ్ చౌరాస్తా చేరబోతుండగా నా ఎడమకాలి బూటుకి మాంజా, కాలపాశమల్లె చుట్టుకొని ‘‘ నీవెక్కడికిరా వెళ్లేది?’’అని బెదిరించింది. కొంత స్పర్శ , భగవత్ కృప వలన అది మాంజాగా గుర్తించి ఏ కొంచెం ముక్కో తెగి నా కాలికి చుట్టి ఉంటుందని భ్రమపడి బండిని చౌరాస్తాలో ప్రక్కకు తీసి స్టాండ్ వేసి మాంజాని లాగటం ప్రారంభించాను. దీనిని ఇక్కడే వదిలితే మరెవరి గొంతుకైనా చుట్టుకొని ప్రాణాలు తీయవచ్చు, అలా జరగకూడదని పట్టుదలతో మొత్తం లాగి చుట్టచుట్టి , ఇది పార్కులోని నా మిత్రులందరికి చూపి, విషయం చెప్పాను. నాకు వెంటనే భారతంలోని దుశ్శాసనుడు స్ఫురణకు వచ్చాడు. వాడికి నాకు కొద్ది తేడా. దుశ్శాసనునకు ద్రోవది వలువలు పూర్తిగా రాలేదు, ఆ శ్రీకృష్ణుని దయవలన , నాకు అదే కృష్ణుని దయవలన మాంజా మొత్తం వచ్చింది. నాకు చుట్టిన మాంజా కాలసర్పం 1000మీ ఎంతో సహనంతో తొలగించి దానిని చుట్టి నాబండిలో పెట్టుకున్నాను. ట్రాఫిక్ ఆగలేదు. నేను అక్కడెందుకు నిలబడ్డానో ఎవరికి తెలియదు. అందరు విచిత్రంగా చూస్తూ బండ్లు తోలుతున్నారు. బండి ఆపి ఏమైనది ? అని అడిగిన నాధుడు లేడు. ఉ.9 దాటితే కనీసం పోలీస్ వారైనా ఉండిఉంటే నాబాధను అర్ధం చేసుకునేవారు. ఉ.7 గం.లకు వారుకూడ లేరు.
గాలిపటం ఉన్నతస్థానానికి వెళ్ళటానికి, పిల్లల ఆనందానికి మాంజానే కారణం. అది కారణాంతరాల వలన తెగిపోతే మనుషుల కంఠాలను చుట్టి కాలసర్పమై ప్రాణాలను తీయుటకు, తీరని దు:ఖానికి అదే కారణం.
తప్పెవరిది? గాలిపటాలు ఎగరేసే పిల్లలదా? కంఠాలను ఖండించగల మాంజాదా? బండి నడిపే వారిదా? పోలీసువారెంత చెప్పినా పెడచెవిని బెట్టి మా ఆనందమే మాది అనే అలసత కలిగిన గాలిపటాలు ఎగరేసే వారిదా?
గాలిపటాలు ఎగరేసే పిల్లలకు ప్రోత్సాహమిచ్చే పెద్దలు తెగిన గాలి పటం మాంజాను అలానే వదలివేయకుండా తిరిగి దానిని పూర్తిగా సేకరించి భద్ర పరచుకోవాలి. అపుడు బజార్లలో గాలిలో వదలివేయబడదు. లేదా వ్రేలాడుతున్న దారాలు ఎవరైనా చూస్తే బాధ్యతగా తొలగించాలి. ఈ విషయాలలో ప్రభుత్వం మరికొంత కఠినంగా ఉండటం ఎంతో అవసరం. మాంజాల సర్పాలనుండి ప్రజలను కాపాడుకుందాం. శుభం భూయాత్.
మీ పొన్నెకంటి సూర్యనారాయణరావు.
మల్కాజ్గిరి. భాగ్యనగరం,
పద్యాల శీర్షిక : తెలుగు కవులు
కవి పేరు : పొన్నెకంటి సూర్యనారాయణ రావు
నివాసం : మల్కాజ్గిరి, భాగ్యనగరం
చరవాణి : 9866675770
పద్యాలు :
1. రాజనరేంద్రు కాలమున రాజిలె పద్యము నన్నపార్యుచే
సాజము సుందరంబయిన సంస్కృతభారతి తెల్గువెల్గుగా
భాజనమంచు పండితులు భారతమున్ శిరసావహించ, సం
పూజిత దివ్యభవ్యమయి మోదముగూర్చె జగద్థితంబుగన్.
2. శేముషి మీరె భారతము సింహపురిన్ కవి తిక్కయజ్వచే
నా మహిమాన్వితంపు పదునైదు సుపర్వపు పాత్రలన్నియున్
ఆమని వేళ కేకి గణమద్భుత నాట్య విశేష వైఖరిన్
కోమలమై చనెన్ తెనుగు కోర్కెలు పండగ వాడవాడలన్.
3. నన్నయ మార్గమున్ సరస నాటకరీతుల తిక్కనార్యునిన్
చెన్నుగ నొక్కరీతి గని శ్రీ హరివంశపు సాహితీ సుధల్
పన్నుగ శేషభారతము భావ రసాంచిత నూత్న వైఖరిన్
మన్నన శంభుదాస వరమై మన తెల్గది వెల్గె దివ్యమై.
4. పోతన భక్తి తత్త్వమున పుస్తకపాణి ముఖావలోకియై
‘‘మాతరొ! బాష్పముల్ వలదు, మన్నన గూర్తు కవిత్వకన్నెకున్
చేతము రంజిలన్ వినుమ! చిన్మయ రూపిణి! ’’యంచు బల్కెగా
బ్రాతిగ నిచ్చె గౌరవము పచ్చని తెన్గుకు శాశ్వతంబుగన్
హామీ పత్రము : ఈ పద్యములు స్వయముగా నా చేత వ్రాయబడినవని హామీ ఇచ్చుచున్నాను
గాంధేయవాది. పల్లెవాడలో జననం. 1972న అవనిగడ్డ లో ఎన్నికైన ఏకైక శాసనసభ్యుడు. 1974లో విద్యామంత్రి. అంతర్జాతీయ తెలుగు కేంద్రం ను
మం.వెం.కృ.రావు తెలుగు కేంద్రంగా మార్చారు. దివిసీమగాంధి. ప్రథమ
ప్రపంచ తె.సభల అధ్యక్షులు. మండలి వెంకట కృష్ణారావు.
పల్లెవాడను పల్లె ప్రభవించి వెల్గిన
మండలివంశాబ్ధి మండనుండు
చదువు సంధ్యలయందు సామర్ధ్యముంజూపి
సత్కీర్తి గన్నట్టి సౌమ్యుడితడు
అవనిగడ్డ పరిధి నాత్మీయుడైవెల్గి
శాసనసభ్యుడై చనినవాడు
విద్యల మంత్రిగా విలువైన సేవలన్
ఆంధ్రులకొసగిన నార్యుడతడు
దివిసీమగాంధిగా తేజరిల్లినవాడు
కృష్ణరావాఖ్య వాజ్ఞ్నిపుణుడతడు
పుణ్యభారతమాతకు ముద్దుబిడ్డ
శాంతిదాంతులుపాటించు సారయశుడు
కీర్తిశేషులు పేదల కార్తిహరులు
ఐదుపదిసేతు వారికి నహరహంబు.
1. రాజనరేంద్రు కాలమున రాజిలె పద్యము నన్నపార్యుచే
సాజము సుందరంబయిన సంస్కృతభారతి తెల్గువెల్గుగా
భాజనమంచు పండితులు భారతమున్ శిరసావహించ, సం
పూజిత దివ్యభవ్యమయి మోదముగూర్చె జగద్థితంబుగన్.
2. శేముషి మీరె భారతము సింహపురిన్ కవి తిక్కయజ్వచే
నా మహిమాన్వితంపు పదునైదు సుపర్వపు పాత్రలన్నియున్
ఆమని వేళ కేకి గణమద్భుత నాట్య విశేష వైఖరిన్
కోమలమై చనెన్ తెనుగు కోర్కెలు పండగ వాడవాడలన్.
3. నన్నయ మార్గమున్ సరస నాటకరీతుల తిక్కనార్యునిన్
చెన్నుగ నొక్కరీతి గని శ్రీ హరివంశపు సాహితీ సుధల్
పన్నుగ శేషభారతము భావ రసాంచిత నూత్న వైఖరిన్
మన్నన శంభుదాస వరమై మన తెల్గది వెల్గె దివ్యమై.
4. పోతన భక్తి తత్త్వమున పుస్తకపాణి ముఖావలోకియై
‘‘మాతరొ! బాష్పముల్ వలదు, మన్నన గూర్తు కవిత్వకన్నెకున్
చేతము రంజిలన్ వినుమ! చిన్మయ రూపిణి! ’’యంచు బల్కెగా
బ్రాతిగ నిచ్చె గౌరవము పచ్చని తెన్గుకు శాశ్వతంబుగన్
ఆతరిసార్వభౌముని మహత్తర సీసవిలాసదీధితుల్.
5. రాయల కాలమున్ కవులు రమ్యరసాంచిత కావ్యజాలముల్
వ్రాయగ తెల్గు భారతికి వజ్రకిరీటము వచ్చి చేరుటన్
పాయని సంతసంబునను పౌరులు పద్యపరీమళంబులన్
హాయిగ బీల్చి సద్యశము నందుచు వెల్గెను విశ్వశాంతికై.
సూర్యశ్రీ
(పొన్నెకంటి సూర్యనారాయణ రావు.)
మల్కాజిగిరి. ఫోన్. 9866675770.
భాగ్యనగరం.
వేంకటేశుని పాదాలు వినయగరిమ అన్నమయ్యయు పట్టెను హ్లాదమొదవ వాని ఫణుతులు విస్తృత పరచినట్టి జ్ఞాన శోభాంచితసురాజ్ఞి! నతులుతల్లి!