పశువులకు కూడ అంత ప్రేమాభిమానాలా?
ది 24.03.26 న మా అబ్బాయి చి. అరుణ్ కిరణ్ పెంచుతున్న ఆవుకు నా సేవలు గాని దానికి కేటాయించిన సమయంకాని చాల తక్కువే. అంటే నేను మా వాడింటికి వెళ్ళినపుడు మాత్రమే దానిని దగ్గరకు తీసికొని ప్రేమతో గంగడోలు, మెడ, వీపు, కాళ్ళు నిమిరి దానిని అక్కునజేర్చుకునేవాడిని. 22.03.26 నుండి 24 వతేదీ వరకు అచటనే ఉండి 24 న నేను అచటినుండి మల్కాజ్గిరి బయల్దేరుతుండగా క్రిందికి కొడుకు కోడలు కూడ వచ్చారు. సరే వెళ్లిరండని అంగీకారం తెలిపారు. కాని నా కాశ్చర్యం కలిగించింది , మనసు కదిలించింది ఈ రోజు జరిగిన సంఘటన.
మా అబ్బాయి పెంచుతున్న ఆవు పేరు ‘‘సిరి’’. వారు దానిని ఎంతో అల్లారుముద్దుగా పెంచుతున్నారు కుటుంబం అంతా. వారు బయటకు వెళ్ళేటప్పుడు సిరికి బై బై చెప్పటం మరల వారింటికి రాగానే సంతోషంతో ఉండటం మామూలే. ఎందుకంటే వారు ప్రతిరోజు దానికి ‘‘ నందినీ ధేనువునకు రఘుమహారాజు అవ్యాజమైన ప్రేమానురాగాలు, భక్తి శ్రద్ధలతో పూజించి గౌరవించినట్లు ’’ చూస్తారు. కనుక వారి పట్ల అది ప్రేమను కోపాన్ని (గారాబంగా) బాధను చూపించటం సహజం. కాని ఆ ‘‘సిరి’’ నాపై కూడ ఎంత ప్రేమ పెంచుకున్నదో ఈరోజు నాకర్ధమైనది. సూట్ కేసులు బాగులు వగైరాలు ఆటోలో పెట్టబోతూ నేను ‘‘సిరి’’వంకచూచి ‘‘బైబై సిరి’’ అన్నాను. అది సమాధానంగా మూగభాషలో ఏమీ చెప్పలేక అమ్మ బయటకు వెళుతుంటే చంటిపాప వెళ్లవద్దని ఏడ్చినట్లు కన్నీరు కార్చింది. ఈ ఘటన నా భార్య, కొడుకు కోడలు చూచారు. అది అంతే పిచ్చిది. మేము బయటకు వెళ్లేటప్పుడు కూడ అలానే ఉంటుంది అన్నారు. నిజమే మిమ్ములను అనునిత్యం చూస్తుంది. నేను నెలకో రెండు నెలలకో వచ్చిపోయేవాడిని కదా! సంపూర్ణంగా ప్రతిరోజు దాని బాగోగులు, చూడటంలేదుకదా! మరి నామీద అంత ప్రేమతోకూడిన పిచ్చి ఎందుకో నాకర్ధం కాలేదు. మామూలుగా ఉండకు కన్నీరు కార్చడమేమిటి? అవి దు:ఖాశ్రువులా? ఆనందబాష్పాలా? ఏది యేమైనా గోజాతి శ్రీకృష్ణపరమాత్ముని మధుర వేణుగాన సుధారసము గ్రోలుట వలనగాని, పరమాత్ముని కరస్పర్శ వలనగాని అనిర్వచనీయమైన జ్ఞానసంపద కలిగియున్నవి. మాట లేకపోయినను సర్వము వాటికి కరతలామలకమే.
గోమాత సర్వదేవతల నివాసస్థానము.ప్రతి యింట ఒక గోవు ఉండాలి. దానిని ప్రేమతో పెంచాలి. జీవితాలు ధన్యం చేసుకోవాలి. 25.03.26 న నా 78వ పుట్టినరోజు. ఇది పరాభవనామ సంవత్సరం. ఈ సంవత్నరపుటుగాదినాడు ‘‘ అన్నమయ్య కళావాహిని’’ లో నా ప్రయమైన సోదరుడు , అష్టావధాన శేఖరుడు ‘‘సురభి శంకరశర్మ’’ గారిచే నిర్వహించబడిన అవధానంలో డా. శోభారాజ్ గారిచే సన్మానం జరిగింది. విశేషం పరాభవనామ సంవత్నరంలోనే గౌరవ సన్మానం జరిగింది. ఇది ఆపరమాత్ముని అనుగ్రహంగా భావిస్తాను. గడచిన సంవత్నరాలు నాకెన్నో సన్మానాలు. అవమానాలు ప్రసాదించినై. అవి అన్నియు పూర్వపు లెక్కలు సరిచేయుటకే సుమా! ఏదియేమైనను మానవజన్మ ఉత్కృష్టమైనది. దానిని సార్ధకం చేసుకొనుటకు , మానసిక ప్రకాశము , ప్రశాంతత కొరకు భగవంతుని నమ్మికొలుచుట ఏకైక మార్గము.మా ‘‘సిరి’’ కంటినుండి వచ్చిన నీరు నేను ‘‘ఆనందబాష్పాలుగా భావిస్తాను. ‘‘రేపు నీ పుట్టినరోజు కదా! ఆనందంగా జరుపుకో’’ అని సంతోషం వ్యక్తం చేసి ఉంటుందికదా! ఔనౌను. నూటికి రెండువందల పాళ్లు అంతే.
నా భావాలను మీకిబ్బంది అయినా పంచుకొన్నందులకు ధన్యవాదములు. సర్వే జనా: సుఖినోభవంతు!!!


