త్రాగి త్రాగించాలి . పలికి పలికించాలి .( సూర్య శ్రీరామమ్ )
'పిబరే రామ రసమ్:" అన్నారు సదాశివ బ్రహ్మేంద్ర స్వామి వారు .వాల్మీకి మహర్షి సంస్కృతంలో రామాయణం వ్రాసి దానిని అమృత కలశం గా చేసి అపురూపంగా అందరికి అందకుండా చేశారు.ఆ అమృతం ఆస్వాదిమ్చాలంటే సంస్కృత పాండిత్యం కావాలి మరి ఆ భాష రాని వారి స్థితి ఏమిటి . అమృతం వారికి అవసరం లేదా . దీనికి సమాధానంగా ఎందరో మహానుభావులు తెలుగులో పద్య, గద్య, చంపు , కీర్తన , అను అనేక రీతులలో మకరందాన్ని వారనుభవించి సామాన్యులకును అనుభవింప జేశారు . అమృతం ఎవరు త్రాగితే ఆ రుచి వారికే తెలుస్తుంది . అందుకే నేను ముందు త్రాగి , నా శిష్యులచే , సాహితీ మిత్రులచే , హితులచే , సన్నిహితులచే రామామృతం త్రాగిమ్చాలని , ఆశించాను . అమృత భాండమును వంచి కొన్ని బిందువులను త్రాగి , జీర్ణించుకొని , తెలుగు పలుకులలో , కొంత తేట పరచి , పంచి , ఆనందించాలనే నా తపన . తిక్కన గారు " మధుర పదార్ధాన్ని , ఒంటరిగా తినరాదు, త్రాగరాదు. అడవులలో ఒంటరిగా నడువరాడు " అని చెప్పారు . అందుకే నేను మహర్షి పదములను , పాదములను ఆశ్రయించి , అనుకరించి , అనుసరించి , నా జన్మ ధన్యమగునట్లు చేసుకొంటున్నాను . అందుకు కరదీపికలుగా , మాన్యులు , డా, యం. కృష్ణమాచార్యులు గారు, డా. గోలి వెంకట రామయ్య గారు వ్రాసిన అనువాద గ్రంధము ఉన్నది . వారికి నా కృతఙ్ఞతలు . వారి ఆశీస్సులతో కొన్ని తెలుగు పలుకులు పలికి , మాతృభాషాభిమానాన్ని చాటుకుందామని అనుకొంటున్నాను . " బాణోచ్చిస్టం జగత్ సర్వమ్ " అన్నారు పెద్దలు . ఈ రామ రసాన్ని (క్లాసులలో ) గ్లాసులలో పోసి అందరికి అందించాలని నా కోరిక.

తొలి తెలుగు తొక్కు పలుకులను నాచే ముందుగ పలికించిన నా తలిదండ్రులకు ఈ గ్రంధమును అంకితము చేయుచున్నాను . తరువాత నా పలుకులను సాహితీ ములుకులుగా ,, తీర్చి దిద్దిన ప్రతి ఒక్క గురుదేవునకు సాష్టాంగనమస్కారములు చేయుచున్నాను .
బుధజన విధేయుడు . పొన్నెకంటి .