15, జులై 2019, సోమవారం

కార్మిక సంక్షేమం.PSN



    కార్మిక సంక్షేమం.psn.

  1. కార్మిక జీవనంబిలను కష్టమటంచును నెంచకే, సదా
      ధర్మ నిబద్ధతన్నిలిపి ధైర్యసమంచిత మానసంబునన్
      మర్మమొకింతలేక యజమానికి సంపదగూర్చు మా పురా
      కర్మఫలంబదేమొ మముగావగ వారికిజేయిరాదొకో!

  2. గనులలోతుల బ్రతుకులు గడుపుచుండి
      కొండలన్నియు బిండిగ గొట్టుచుండి
      మట్టమధ్యాహ్నమైనను మడులుదున్ని
       కూర్చవలయును లాభాల గోట్లకొలది.

  3.  అడవిబుట్టిన కతమున నచటి సిరులు
       సేకరించుటె మాపని, చేతివాట
       ము సలుపు ప్రబుద్ధు లెందఱో మూగిమమ్ము
       దోచుకొందురు నిలువెల్ల దొరలుగాను.

  4. రైతు సంక్షేమ పథకాలు రకరకాలు
      గనులజనులకు హామీల కరువులేదు.
      నీటిపైవ్రాయు నక్షర కోటివోలె
      నొక్కటైనను గనరాదు బక్కకెపుడు.

  5. ఘర్మజలములుతనువెల్ల గ్రక్కుచుండు
       కర్మజీవికి మేలును గలుగజేయ
       నుద్యమింపుడు సంక్షేమమూతమిచ్చి
      దొరలు ! నిరుపేద రక్తంబుదోచకుండ.

         స్వీయ రచన.. పొన్నెకంటి సూర్యనారాయణ రావు.
                                   భాగ్యనగరం.

     
     
        

భయం

                                       భయం.

          మనం దేనిని గురించి భయపడతామో
          అది తప్పక మన వెంటే పడుతుంది
          ఏ ప్రాణి కైనా మొదటి భయం చావు
          అది ఎంతకాలానికైనా అనివార్యమే!

      సృష్టి తో సమానంగా పుట్టిందే చావు
      దానికి ఏనాడు భయపడకు నీవు
     చావెక్కడో ఎప్పుడో తెలియదు,అందుకే
     చలాకీగా, ధైర్యంగా చరించు ముందుకే

     బుల్లితనువులో ఆడేశ్వాస, కొల్లగచేయును సంబరం
     అకస్మాత్తుగా ఆగే శ్వాస, మెల్లగచేరును అంబరం
     ఆగబోయే శ్వాసకోసం, అంతరంగపు వ్యధ దుర్భరం
     ఆగటం వింతకాదని చింతలేనటులుండటం మహాద్భుతం

     పిరికితనమే చావంట, ప్రత్యామ్నాయం లేదంట
     చావును నిరతం ప్రక్కకునెట్టే  చక్కని యోగం మనదంట
     జీవితకాలం కష్టసుఖాలు, పరమార్ధపు వరసఖులంట
     మానవజీవన రథచక్రాలు, చావుపుట్టుకల జంటంట.

      మనసును మెల్లగ మారుస్తు ధైర్యం చెంతకు చేరుస్తు
      పిరికితనమే చావంట, ప్రత్యామ్నాయం లేదంట
     చావును నిరతం ప్రక్కకునెట్టే  చక్కని యోగం మనదంట
     జీవితకాలం కష్టసుఖాలు, పరమార్ధపు వరసఖులంట

     మానవజీవన రథచక్రాలు, చావుపుట్టుకల జంటంట.
      చావు పదానికి స్వస్తిని పలికి, లావే మేలని భావిస్తు
      పురోగమించు పురోగమించు పున్నమివెన్నెల పూయించు
      జీవితమంతా శోధించు, సత్ఫలతతినే సాధించు.

సర్కారు బళ్ళు. జెజెయస్., పి.యస్.యన్.

సర్కారు బళ్ళు, చదువుల గుళ్ళు.

1.  పరమ నిర్లక్ష్య వైఖరి న్బరగు బడుల
      పేదసాదల బిడ్డలే ఖేదమోద
      ములను సహియించి భరియించి ముద్దుగూర్చు
     చదువుగుడులంచు భావించి చదువుచుంద్రు.
      2.  పైకప్పులూడుచు పరమభీతినిగొల్ప
                          కట్టించునాధుడు కానరాడు
      కూర్చుండపంతులు కుర్చీలు లేకున్న
                        అడిగెడు వ్యక్తియే యవనిలేడు
      మధ్యాహ్నభోజన మంతయు దిగమ్రింగ
                               ఏదనిప్రశ్నించ నెవడులేడు
      అభివృద్ధి పధకాల నంకెల జూపంగ
                               నిగ్గునుదేల్చగ నెవడు రాడు
      ఇట్టి దుర్దశగల్గిన హేయమైన
      బడులె నిరుపేద విద్యార్థి గుడులుగాగ
      మంత్రివర్యుల యధికార్ల మనసుమార్చ
      రండు జనులార! మేల్కొని దండువోలె.
 3.  బల్లలు లేవులేవుపసిపాపలు కూర్చొని మోదమందగన్
      పల్లముగాన నయ్యెడల వర్షపునీరదె తొంగిచూచెడున్
      తెల్లనిసుద్దముక్కకును తీరని కోరిక పంతులమ్మకున్
      కల్లగసాగుచుండెనధికారుల పాలితపాఠశాలలే.
 4.  తామె పథకాల యమలులో ధర్మకర్మ
       బద్ధులపగిది నిరతంబు పాటబాడి
       బాలబాలురె రేపటి భవితటంచు
       కరుణజూపరు ఘనులు సర్కారుబడుల.
 5.   ఉండవు శౌచశాలలటు లుండవు చాలిన యాటవస్తువుల్
       ఉండవు మంచినీరములటుండవు చక్కని వ్రాతబల్లలున్
       ఉండవు సుద్దముక్కలు మహోన్నత నేతల చిత్రరాజముల్
       ఉండవు పాఠశాలల ప్రభుత్వపు నేతల శ్రద్దలేమిచే.
 6.   కావలె మంత్రివర్యుల వికాసపు జ్ఞాన విశేష దీధితుల్
       కావలె నీతిమంతమగు కమ్మనిపాలన దేశమంతటన్
       కావలె శ్రద్ధ విద్యపయి గాంధిజి కోరిన పాఠశాలలన్
       రావలె మంచిరోజులు వరాలనుజిమ్మగ పేదసాదకున్.

      జె.జె.యస్. పద్యాలు.
1.చదువ వ్రాయనేర్పి సన్మార్గమున్జూపి
    సంఘమందు మెలగు సరళిదెల్పి
    జ్ఞాననేత్రమొసగి కాపాడుచుండెడి
    విద్యనేర్చు నతడు విజ్ఞుడగును.
2. చదువె విద్యావినయముల సాధకంబు
    గురులె దైవాలు చదువులగుడులె బడులు
    నీతినియమాలు నేర్వంగ నెలవులగుచు
    కామితమ్ములుదీర్చు సర్కారు బడులు.
3. పల్లెప్రాంతమునుండి బడిజేరువారికై
                  బస్సుసౌకర్యముల్ లెస్సగూర్చు
    తరతమభావాలు దరిజేరనీయక
                   ఏకరూపమయిన వేషమొసగు
    చదువులు నేర్వంగ చక్కగా పుస్తకాల్
                   ఉచితమ్ముగానిచ్చు నుచితరీతి
     మధ్యాహ్నవేళలన్ మరలిపోనీయక
                     పౌష్టికాహారాన తుష్టిగూర్చు
     ఇట్టి బహుళార్ధదములందు బట్టువిడక
     చదివి సంస్కారయుతులౌచు సాగిపొండు
     తాతతండ్రులు చదివిన తావు విడచి
     పుట్టగొడుగులవలె నేడు పుట్టుచున్న
     వివిధ సంస్థలజేరంగ వెఱ్ఱితనము
     చేరరారండు! మీరు సర్కారు బడుల.
4. ప్రభుత నడిపెడి సర్కారు బడులజదువ
    బడయనగు సీటు గురుకుల పాఠశాల
    యందు,వాస్తవంబిదిగాన ఆదినుండి
    చేరరారండు!మీరు సర్కారు బడుల.
 5. చక్కగనాడుకోదగ విశాల మనోహర ప్రాంగణమ్మునన్
     రొక్కము కోరకుండగ పురోగతిజూపెడి విద్యబొందగా
     చక్కని బోధనాపటిమ జాటు సుశిక్షితదేశికాళితో
     పెక్కుగనిల్చె నీ ప్రభుత విద్యల నేర్వుడు పాఠశాలలన్

                              (జయరాం)
 
      1.  ఉచితమైనవిద్య, ఉత్తమబోధకుల్
           ఉన్న ప్రభుతబడుల నుత్సుకతన
           పేదవారు సతము ప్రియమారజేర్పింత్రు
           చదువుగుడియనంగ సంతసాన. 
 2.   ఉండవు రాజకీయములటుండవుజీవనడాంబికంబులున్
       ఉండవు భారమై యెపుడు నూహకునందని ఫీజులచ్చటన్
       ఉండవు హెచ్చుతగ్గులు, మహోధృత ఠీవులు చెల్లవచ్చటన్
       అండగనుందురందరును హాయి దలిర్పగ పాఠశాలలన్. 
 3.  చదువకోర్కెలున్న సాధింప సిరిలేక
      బాధచెందు వివిధ బాలలకును
      సాయమీయనెంచి సర్కారు బడులునాన్
      అన్నమిడుచు చదువులందజేసె.
 4.   సగటు మానవజీవన సంపదలను
        పెంచిపోషించి జ్ఞానంబు వృద్ధిజేయ
        పాఠశాలల నెలకొల్పె ప్రభుత నేడు
        సకల సౌకర్య మార్గాలు సంతరించి.
5.  చదువుల గుళ్ళలో సతము  సారసమన్విత జ్ఞానపూర్ణమై
      సదమల విద్యనేర్పగల స్వచ్ఛ గుణాంచిత బోధకాగ్రణుల్
      ముదమునుజెంద బాలలకు ముచ్చటగూర్చెడు నాటవస్తువుల్
      అదనుగజేర్చుటం బ్రభుత హ్లాదమునందిరి పేదలందరున్.
 6.  సర్కారు బడిలోన చదివెడు విద్యార్థి 
                              విజ్ఞాన వీధిలో వెల్గులీన
      యాత్రలజేయించు యత్నాన గోరగ
                  పయనంపురాయితీ పరగజేసి
      పాఠ్యగ్రంథచయము బాలలకొరకునై
                పంచుచుండునటుల బాధ్యులగుచు
       సాంకేతికంబుగా చక్కగ నెదుగంగ
                   దర్శనయంత్రాల తామెగూర్చి
        ప్రభుత పాలించుచుండుట పరమవరము
        అట్టి వరమున ప్రజలెల్ల హ్లాదమంది
        మట్టిబుట్టిన రత్నాలు, మణులవోలె
        దేశదేశాల రోచిష ధిషణజూపు.
          (పొన్నెకంటి)

రమణమూర్తి గారికి కృతజ్ఞతలు.

రమణమూర్తి గారికి కృతజ్ఞతలు.

1. ప్రేమమీరంగ శుభములు క్షేమములను
    సాదరంబుగ గోరెడు సన్నిహితుడ!
    అమరనాథుని సత్కృప యాత్రలన్ని
    విజయవంతము జేతు మవిఘ్నముగను.
 2. తల్లి వైష్ణవిమాతను తనివిదీర
     కన్నులంగాంచు పున్నెంబు గల్గుననగ
     మానసిక మైననుద్వేగ మధురిమలను
     తెలుపలేకుంటి పలుకుల ధీవిశాల!
 3. ప్రముఖ కాశ్మీరు ప్రాంతంబు పాఠ్యమవగ
     చెప్పియుంటిని. దానిని గప్పియున్న
     మంచుసోయగమంతయు మరులుగొల్ప
     కాంచు భాగ్యంబు నాకిటు గలిగె హితుడ!
4. ఎప్పుడేమేమి జరుగునో యెరుగలేము
    జన్మమెత్తినదాదిగా జగతియందు
    చేరవచ్చినదానిని చెలిమితోడ
    స్వాగతించుటయొక్కటె సాధ్యమగును.
 5. అనుభవాలను మనసున నణచియుంచి
     చూచి వచ్చిన స్థలముల శోభలన్ని
     అక్షరంబుగ లిఖియింతు హ్లాదమొప్ప
     సుందర రమణుని నెయ్యంపు స్ఫూర్తివలన.

బట్టతల నష్టాలు. చింతా వారిని గూర్చి స్పందన, బట్టతల నష్టాలు.

   

చింతా రామకృష్ణారావు గారి పద్యాలకు స్పందన. 9.11.17.

 రాముడు కృష్ణుడుం గలసి రాగవిశేషత రమ్యమూర్తులై
 నామమదొక్కటై వెలసి నవ్యవిభాసిత దివ్యతేజముం
 బ్రేమగ సోదరుండగుచు పెన్నిధియై లభియించియుండుట
 న్నామొగమట్లెతోచు పరమాదరమేదురమాధురీవిధిన్.
        నాకారాముడు సర్వము,
        శ్రీకారముతోడనున్న చెల్వగు శక్తుల్
        ప్రాకారమౌచు నిలచును
        సాకేతవిభుని పదముల శరణనసతమున్
 పూర్వ జన్మల లేశంపు పుణ్యఫలమొ
 సద్గురు విమల బోధల సారతరమొ
 నాదు సన్మిత్రవర్యుల స్వాదుమతియొ
 ప్రేరణంగూర్చెశ్రీరాము బిల్చునటుల.

   పంది,చేప,కోడిపెట్ట,కప్ప.....బ్రహ్మణ భోజనం. దత్తపది.

  ఒక ఆకుపై మరొక ఆకు కప్పి భోజనం తీసికొని వచ్చినపుడు.

   "కప్ప"బడినట్టి ఆకును కడగనుంచి
   పట్టుబట్టుటకూ"పంది"వహ్వయనుచు
   నాప"కోడి పెట్ట"క యేమి నంజుడనుచు 
   "చేప"రిధిచల్లె నీరము శిరమువంచి.

 సందీపశర్మ  మనమున
 సందేహములన్నిదీర్చి సారసపదముల్
 ఛందోబద్ధముజేయగ
 విందుంజేకూర్చిరచట విజ్ఞతమిగులన్.

శారద నాట్యమాడెనట చక్కగ పండితజిహ్వరూపియై
పారెను సాహితీసుధలు భావపరీమళ కంఠసీమలన్
మారెసభాంతరాళముసమాజ్ఞిత హాసవిలాసదీప్తులన్
తీరె విరించిగారికల  తేటతెనుంగవధానసత్కళన్.

 మీసము ద్రిప్పుచున్ మిగులరోసముమీర
                సీసమువ్రాసెడు  చేవమీది
 "మా సములున్నచో మన్నన గూర్తునన్"
                అసమానవినయంపుటంశమీది
 ప్రతినలజేయకే పరమార్థమిదియంచు
               నవ్వులు చిందించునయముమీది
 దోసమొకింతకాదోయియటంచును
                నిమ్మకాయలనిల్పు నేర్పుమీది     
    భళిర! చిత్రకవివతంస!బ్రహ్మతేజ!
    రామకృష్ణుల సద్రూప రమ్యచరిత!   
    దివ్యగుణధామ మానితధీవిశాల!
    చింత వంశంపు రత్నమా! స్నేహశీల!


 "మా సములెవ్వరుండ"రని మండపమందునహంకరించినన్
 మీసముద్రిప్పగావలయు, మిమ్మవమానముజేయజూచిన్
 మీసము మెల్చగావలెను, మీరినబల్కులనేరుబల్కినన్
 మీసముద్రిప్పిరోసమును మిక్కిలి జూపుటె పౌరుషంబహో!!

కృష్ణస్వామి చిత్రానికి స్పందన.

 తల్లారమందునతనలేత కిరణాల
             కబురులాడగవచ్చు కర్మసాక్షి
 పచ్చదనములిల పరచుచు గ్రామాన
              ఉత్సాహమందించు నుద్భిజాళి
 ఎటువైపు జూచిన ఎర్రటి మట్టితో
               కనువిందుగలిగించు కాలిబాట
 ఆలయంబులిచట హ్లాదంబుజేగూర్చ
                ఆధ్యాత్మశోభలనందగించె
   ప్రకృతి సౌందర్య మిచ్చోట పరిఢవిల్ల
   మీదు కుంచియ కదలాడె మించుగరిమ
   కృష్ణ స్వామిరో! మనసున తృష్ణదీర
   దెంత పొగడిన చిత్రంబు ధీవిశాల!.

 బట్టతల గురించి పద్యం.

   సీ..తాతని పిలుచుచు తనవారు పెరవారు
                ఎగతాళి జేయుదురింటబయట
     వరునిగ ప్రకటింప వయ్యారి వధువులే
                పెడమోము జూపింత్రు దడవకుండ
    ఎండకు వానకు నెంత జాగ్రతయున్న
              చురుకుమనుచు, నాని సోషపడును
    కేశాలు మొలిపించ క్లేశంబు తప్పదు
                 లక్ష్యంబు నెరవేర లక్షలగును
 ఆ.వె. వంశలక్షణంబె వయసు చిన్నదనుచు
          ఎన్ని సాక్ష్యములిల యున్నగాని
          బట్టనెత్తియున్న బాధలు తప్పవు
          మన్మథునికినైన మహినిజూడ.

డా. సర్వా సీతారామ చిదంబర శాస్త్రి

సుహృన్మితృలు డా. సర్వా సీతారామ చిదంబర శాస్త్రి గారికి, (డా.రామడుగు వేంకటేశ్వర శర్మ గారి సహాధ్యాయుడినైన) పొన్నెకంటి సూర్యనారాయణ రావు అనిర్వచనీయ ప్రేమాభిమానాలతో వ్రాయునది....
.
    మీరు గురుభావనతో నన్ను "మీ పదవీ విరమణ" సందర్భంగా ఆహ్వానించారు. కాని అప్పటికే స్థిరీకరింపబడిన నా వ్యక్తిగత కార్యక్రమాల వలన రాలేకపోయినందులకు చాలా బాధపడుచున్నాను. కనీసమీ సమాచారము మీకు తెలియపరచుటకును చరవాణి కాని, అంతర్జాల చిరునామా కాని లభించలేదు.
      ఈరోజు మీరు పంపిన "శ్రీ గాయత్రీ మాతృద్విశతి" అందినది. చదివాను.ప్రతి పద్యమత్యంత భక్తి భావప్రపూరితము, సుశబ్దశోభితమై మనోరంజకముగానున్నది. అమ్మ గాయత్రీ దేవి కరుణకు పాత్రులైన మీరు ధన్యులు.

         అమ్మ గాయత్రి కరుణను నందినారు
         పూర్వజన్మంపుపున్నెంబు ప్రోగుగాగ
         కవన పాండిత్యసద్గుణ భువన రవిగ
         శుభముకలుగుత మీకెప్డు సూరివర్య!

         గాయత్రీజప ఫలితము
         వేయేలవచింపలేము విశ్వంబందున్
         మాయామేయజగంబున
         కాయంబదియుండుదనుక కైమోడ్పెతగున్.
                       శుభం భూయాత్!
                   పొన్నెకంటి సూర్యనారాయణ రావు.
                             ది.22.12.2017.
          

భద్రాచలం, హేమాచలం.8.01.18.

భద్రాచల యాత్ర.

  హైదరాబాద్ నుండి మణుగూరు ఎక్స్ప్రెస్ ట్రైన్ లో 8.01.2018న,రా.11.30కు మా బావగారు శేషగిరిరావు గారు, చెల్లి ఉదయ, ఇందిర,నేను బయలదేరి ఉ.7.30కి మణుగూరు చేరాము. 9.01.18న స్టేషన్ నుండి బయలుదేరి అల్పాహారం తరువాత ఆటోలో  "మల్లూరు" " హేమాచల నృసింహస్వామి" దర్శనానికి వెళ్ళాము. (మణుగూరునుండి మల్లూరు 50.కి.మీ.మల్లూరు వెళ్ళేటప్పుడు వీలుచేసుకొని అరటి,జామ మొ.లగు పండ్లు తీసికొని వెళితే వానరాల ఆకలి కొంతవరకు తీర్చవచ్చును)అచట ఆర్చికి కుడివైపున మెట్ల ప్రక్కన కొద్ది దూరంలో స్వయం భవునిగా వెలసిన హనుమ గుడి చెంత  కాలకృత్యాలు తీర్చుకోవడానికి, స్నానాలు చేయడానికి (స్వల్పరుసుముతో)చక్కని ఏర్పాట్లు చేశారు. ఎంతో అభినందనీయులు. అచటికి వచ్చే నీరు పరమ పవిత్రము, స్వచ్ఛము, అవ్యక్త మూలికాసంస్పర్శిత రోగ నిర్మూలనము,అమృతతుల్యము,సమతులోష్ణము,సజీవగంగావతరణము. ఆ స్నానానంతరము మనజన్మ పునీతమైన అనుభూతి కలుగుతుంది. నేను కూడ అచట స్నానం చేయగలగటం మహద్భాగ్యమే. అక్కడనుండి షుమారు 50సోపానాలు (మెట్లు)దాటితే నరసింహ దర్శనం లభిస్తుంది. స్వామి స్వయం భువుగా చెబుతారు.   
               ఈ స్వామిని దర్శించిన మహమ్మదీయ చక్రవర్తి కొండ, ఆలయము అర్థచంద్రాకృతిలో ఉండుటవలన తమదైవ చిహ్నమని భావించి భక్తి తో కొంత బంగారాన్ని కానుకగా సమర్పించారట. తదుపరి ఆబంగారమును అమ్మి వచ్చిన ధనమును బ్యాంకు లో వేసి వచ్చే వడ్డీ తో అర్చకులు మొ.లగు వారు మనుగడ సాగిస్తున్నారట. ఆ కారణముననే ఆ స్వామి"హేమాచల నృసింహస్వామి" పిలవబడుతున్నాడట.                                               ప్రపంచంలో ఎక్కడా లేని ప్రత్యేకత ఏమిటంటే స్వామికి కంఠం క్రింద భాగమంతా శిల కాక మానవశరీరంలాగా ఉంటుంది. నొక్కి చూస్తే చర్మం లోనికి వెళ్ళి కొద్దిసేపటి పూర్వపుస్థితికి వస్తుంది. పూర్వం త్రవ్వకాల కారణంగా స్వామి నాభి(బొడ్డు)దగ్గర గాయం యేర్పడి అచట రక్తము కారుచున్న కారణంగా అచట చందనం ఉంచుతారు. స్వామి నిజరూపదర్శనం శుక్ర,శని,ఆదివారాలు (మ.12.వరకు) ఉంటుంది. స్వామి వారి నాభిదగ్గర ఉండే చందనాన్ని పాలలో కలుపుకొని త్రాగితే పెండ్లి కాని వారికి వివాహము, సంతాన హీనులకు సంతానము తప్పక కలుగుతుందను నమ్మకం ఇటీవలి కాలంలో ఎక్కువమందికి కలుగుతున్నది. ఈవిషయాన్ని ఫలితం పొందినవారివలన, ఆటోలవారివలన కూడ వినటం జరిగింది. నమ్మకం,ఆత్మ విశ్వాసం ఎన్ని సమస్యలనైనా తీర్చగలవు.ఎంత ఉన్నతినైనా కలిగించగలవు.
         9వతేది మధ్యాహ్నం మణుగూరునుండి బయల్దేరి 2.30.లకు భద్రాచలం లోని "అంబా అన్నసత్రం"లో భోజనంచేసి దగ్గరున్న గదిలో విశ్రాంతి తీసికొని ఆటోలో బయల్దేరి "జటాయువు గుడి,(జటాయువు కాలు తెగిపడినచోటు)(సమీప పొలంలో రెక్క తెగిపడినదని సమాచారం) దుమ్ముగూడెంగ్రామదేవత, సీతారాములపర్ణశాల"(భద్రాచలంనుండి 30.కి.మీ.)చూచి వచ్చాము.
     10వ తేది. ఉ.8.00లకు మేము భద్రాచల రామదర్శనం చేసుకొని, శేషగిరిరావు గారి దంపతులు చేయించుకొనిన       కల్యాణమును కనులారా చూచుకొని, అన్నసత్రములో రామప్రసాదమును స్వీకరించి విశ్రాంతి తరువాత గోదావరి స్నానం ముగించి గదికి చేరాము. సాయంత్రం7.గం. లకు బస్సు లో కొత్తగూడెం చేరి అచట సికింద్రాబాద్ మణుగూరు ఎక్స్ప్రెస్ లో రాత్రి.10.45కి ఎక్కి 11వ తేది ఉ.6.గం.లకు ఇండ్లకు చేరాము.

 కం.హేమాచల నరసింహుని
      నేమానవుడేనిభక్తి నీమముతోడన్
      సేమంబుగోరిమ్రొక్కిన
      కామంబులుదీరితాను కాంచునుసుఖముల్.
కం. మల్లూరు నారసింహుని
      యుల్లంబునవెల్లువెత్తు యుత్సాహమునన్
      కల్లా కపటములెరుగక
      చల్లంగనుమ్రొక్కినాము సౌమ్యతదనరన్.

 కం.ప్రాతఃస్మరణముజేయుచు
      పూతాత్ములభంగిభద్రు ముంగిటవాలన్
      సీతారాముల కరుణయె
      చేతంబులురంజిలంగ చేరెను మాకున్.

పద్యపరీమళము. యశస్వినీ సాహితీ సమితి. 12.06.25

 1. రాజనరేంద్రు కాలమున రాజిలె పద్యము నన్నపార్యుచే     సాజము సుందరంబయిన సంస్కృతభారతి తెల్గువెల్గుగా     భాజనమంచు పండితులు భారతమున్ శిరసావహించ...