హైదరాబాద్ లోని ఆంధ్ర బ్రహ్మగర్జనకు నవరత్నమాల.. రచయిత.. కొమ్మేమఱ్ఱి యన్.కె.వి.రావు.
సీ. ఆంధ్రదేశములోనె యటు లంక పైబడ
సాగ, మ్రోగెను రామ శంఖరవము
మన యాదిలాబాదె మత్స్యదేశమగుట
అజ్ఞానమును వీడు అర్జునుండు
ఆవుల మళ్లింప ఆంధ్రదేశము పైనె
దేవదత్తమునూదె దిక్కులదర
ఆంధ్రదేశము నుండె యా వినోబాభావె
స్వచ్ఛంద భూదాన శంఖమూదె
తే.గీ. భారత సువర్ణకేతన భవ్యరూపు
ఆంధ్రదేశము లోననే యవతరించె
సకల విప్ర జనశ్ర్శేయ సాధనకును
ఆంధ్ర శంఖమూదుడో! అగునుజయము. 1.
సీ. ఆ నాల్గు వేదాల ఆపోశనము బట్టి
దాత్త ఉదాత్త నాద సహితంబు
కంఠస్థమొనరించి కలకాలమందించి
భవితకిడిన జాతి బ్రాహ్మణులని
సర్వ విశ్వజనాళి సౌఖ్య స్థిరత కోరి
భగవంతు పూజింత్రు బ్రాహ్మణులని
అధికార దర్ప ధనాది గర్వరహిత
పౌరోహిత కరుల ప్రతిభ గనుడు.
తే.గీ. ఇదము బ్రాహ్మ్యము క్షాత్రము నిదియె యనెడు
పరశురాముని రక్తంబు పారు కతన
పల్కు దారుణాఖండల యుల్కయైన
మానవత పండు మృదువైన మనసుమాది. 2.
సీ.స్వాతంత్ర్య సమర నిస్వార్థ వీరులలోన
బలసంఖ్య వీక్షింప బ్రాహ్మణులదె
లలిత కళావృద్ధి లక్ష్య సాధన లోన
బలసంఖ్య వీక్షింప బ్రాహ్మణులదె
తగిన అస్ప్ృశ్యతా దారుణా చరణంబు
రద్దుకై తొలి పిల్పు బ్రాహ్మణులదె
అర్ధ జనాభాగ ఆడువారర్హులు
పాలనన్ సగమైరి బ్రాహ్మణులట.
తే.గీ. ఇట్టి నిస్వార్ధ సేవల నెన్నొ చేయ
లెక్క లేకుంటిమి గద యే హక్కులకును
అగ్ర వర్ణము వారని యణగద్రొక్క,
బలిగ యైనాము సమైక్య బలములేక.3.
సీ. బహువిధ శాఖల బక్క బ్రాహ్మణులను
బలవంతులంజేయ బ్రహ్మ దీక్ష
ద్వంద్వ ప్రమాణాల దర్ప పాలనలోన
బలియైతిమని చాట బ్రహ్మ దీక్ష
అర్థ శతాబ్దిగా యణగియున్నామింక
రణభేరి మ్రోగింప బ్రహ్మ దీక్ష
అఖిల భారత విప్ర హక్కుల సాధింప
త్రివిధ పీఠము వారి తిష్ఠ దీక్ష
తే.గీ. కుల మతాల వ్యవస్ధలు కూలునట్లు
అఖిల వర్ణాల బీదల నాదరింప
పాటవ సమర్ధతల నెంచి పీటవేయ
పాలకుల పురికొల్పనే బ్రహ్మ దీక్ష..4.
సీ. భారత రాజ్యాంగ కారక విజ్ఞులు
శిష్టపాలన పరిపుష్టి గోరి
లౌకిక లక్షణాల్ లక్ష్యమ్ము జేసిరి
మతకుల ముఖ్యత మట్టుబెట్ట
అర్ధ శతాబ్దిగా ఆ భావనను, కాల
దన్ను ప్రబుద్ధులే దాపురింప
ప్రబలెగా నెటుచూడ ప్రత్యేక కుల హక్కు
లార్జనకై పోరు గర్జనములు
తే.గీ. క్రుళ్లు భావాల దుస్థితుల్ కూలదన్న
మమత సమతల సర్వత్ర మహిని నిల్పి
పాలనా నిర్మలతకు శుభంబు పలుక
బ్రహ్మ గర్జన మందిరి బాగుగోరి. 5.
సీ. సౌజన్య బుధజన సార కౌశలకృషిన్
వసుధైక రాజ్యంబు వచ్చుగాక!
అందరి బిడ్డల నక్షరాస్యుల జేయ
విజ్ఞాన దీపికల్ వెలుగుగాక!
మూఢ మతోన్మాద మూర్ఖతేర్ష్యలు మాని
ఏకేశ్వరార్చనల్ ఎదుగుగాక!
కార్మిక కర్షకుల్ పేర్మి కామందులై
ఉత్పత్తి కొండలై యుండుగాక!
ఆ.వె. మానవ మనుగడకు మారణాస్త్రాల, వి
సర్జనంబు ధరణి జరుగుగాక!
బ్రహ్మ దీవెనలివె భద్రమౌ జీవన
మఖిల జాతి జనుల కబ్బుగాక!.6.
బ్రాహ్మణ సోదర సోదరీ మణులారా!
సీ. బ్రాహ్మణ వంశాన భవమునొందితమన్న
నేతిబీరలలోని నెయ్యి యగును
జ్ఞాన శమదమ విజ్ఞాన సాధనలతో
ఉపనయనార్హత ఉండవలయు
గాయత్రి జపియించి కడునీతి పాటించి
సకల జనశ్శ్రేయ సంపదలకు
నిస్స్వార్ధ సేవల నియతితో నందింప
బ్రాహ్మణత్వ విభం ప్రాప్తి మనకు
తే.గీ. కాల గతులను శాస్త్రవికాస భాగ్య
మెఱిగి పరులపై నాధారమియ్యకొనక
స్వీయ కృషి సల్పి యెదుగుటే శ్రేయమనుట
బ్రహ్మ శంఖ గర్జనలోని భావమయ్య!. 7.
సీ. సుబ్బలక్ష్మి సుశీల సుబ్రహమణ్యులు
నీవారలంచును నిక్కి నడువు
తరిగొండ వెంగమ్మ తాళ్లపాక కవులు
నీవారలంచును నిక్కి నడువు
దేవి సరోజిని ధీరురాలిందిర
నీవారలంచును నిక్కి నడువు
జిల్లెల్ల మూడమ్మ చిత్రాన్న దానంబు
నీ కీర్తి పాదని నిక్కి నడువు.
తే.గీ. గాన మాధురి శ్రావ్యమౌ కావ్య రచన
ఆధిపత్యధికార సాహస చతురత,
తరగిపోని దాన నిరతి, ధర్మబుద్ధి
నేర్చిన ఘనుల, ధీరవనితల గనుమ.. 8
సీ. త్యాగయ్య అన్నమయ్య మురళి ప్రభృతుల్
నీవారలంచును నిక్కి నడువు
భారత రచనలో భవ్య కవీశులు
నీవారలంచును నిక్కి నడువు
తిక్కన చాణక్య తిమ్మరుసు బుధులు
నీవారలంచును నిక్కి నడువు
శంకర రామానుజాది సద్గురువులు
నీవారలంచును నిక్కి నడువు
తే.గీ. ఆంధ్ర కేసరి, రాజాజి, యా సుబాసు
జహ్వరు, తిలకు, పట్టాభి, సర్వెపల్లి
త్యాగధనులు, వీరవరులు, ధర్మరతులు
వారి లక్ష్యాల బాటల చేరి నడువు. 9.
.