28, జనవరి 2020, మంగళవారం

భక్తి పాటలు

                                       గణపతి కి మంగళహారతి.     
   అంబాసుతునకు లంబోదరునకు మంగళమనరే మానినులారా!
   ఆదిపూజ్యుడై యఖిలజగముల హర్షమునింపే యమలమూర్తికి
   విశ్వమునందలి విఘ్నములన్నీ వేడిన డుల్చే విఘ్నరాజుకి. "అంబా"
   తల్లిపార్వతి ముఖపద్మంబును వికసనజేసే విష్ణునేత్రునకు
   నెమలివాహనుని నేర్పున గెల్వబుద్ధిబలమునుజూపినవానికి."అంబా"
   గరిక పూజకె ఘనమనితలచి వరములనిచ్చే వక్రతుండునకు
   కుడుములుండ్రాళ్ళు కోరిభుజించి ముదమునుజెందే మోదక
                 ప్రియునకు......."అంబాసుతునకు."

                                         గంగా సంగమ క్షేత్రం.(పాట)
  గంగా సంగమ క్షేత్రం, అది సందర్శనకు పాత్రం.
  1.మకరరాశిలో రవియే చేరగ, మాన్యోదధియే వెనుకకు బాఱును
     పర్వదినంగా ఖ్యాతినందుచు, పారును గంగా ప్రవాహమచట
                                                           గంగా సంగమ క్షేత్రం!!
  2.కపిలమునీంద్రుని కఠోరశాపం, సగరపుత్రుల సమయజేయగ
     అలలతాకిడి మెలమెల్లంగ, అదుపుననుంచి యటుచేరంగ
                                                           గంగా...
  3.భగీరథుండల భక్తిని వీడక, భర్గుని ధ్యానము సేయంగ
      నాకము వీడి జూటముజేరి, నవ్వుల నురుగులు పారంగ
                                                             గంగా...
  4.అరువదివేల భస్మరాసులకు, నానందంగా నమరత్వంబును
     చేర్చికూర్చినది చిర్నగవులతో, చిన్మయరూపిణి శివగంగా
                                                             గంగా....

  5.సంద్రముజేరిన గంగా, మంద్రస్వరాలు వినిపింపంగా
     ఆనందంబును నారోగ్యంబును, సకలసుఖంబులు కలిగింపంగా
                                                               గంగా....

   6.నాగలోకమున నాట్యంజేయుచు, నవజీవనియై తిరుగంగ
     నాగలోకమే నాకలోకమై, పరవశించి తా వెలుగంగ
                                                             గంగా.....
   7.నాకమునుండి నాగము వఱకు, పాపసంచయం తొలగిస్తు
     పుణ్యరాసులను పంచుతు తాను, పవిత్ర నదిగా పరిఢవిల్లెను
                                                              గంగా......
   8.భంగములెన్నో చూచినగాని, భవుని కరుణచే భద్రంగా
      ఈ క్షేత్రంలో సంద్రంజేరెను, సమ్మోదంగా సలలిత గంగా
                                                                గంగా....
  9.ఇంద్రియజయమును పొందినవారు,సామాన్యులు మరి శిష్ఠజనంబులు
    ఇష్టముతోడ పరిపరి మునుగును, ఈశునిప్రేయసిగంగామాయీ
                                                                 గంగా....
 10.కోటిజన్మల కల్మష హరణం, కోరగ గంగా శరణం
       క్రుంకిన జీవన్ముక్తి, కలుగును భక్త్యనురక్తి.
          !!గంగా సంగమ క్షేత్రం, అది సద్గుణపాళికి
          సాథుసంతతికి సంబరమిచ్చెడు క్షేత్రం.!!

                        ........       కన్నయ్యలీలలు... పాట.1. (కసవునాసను)
గోపాలుడు కాచే ఆలమందనుండి ఒక ఆవు కసవు మేయుచు దారితప్పి అడవి మధ్యకేగి తప్పిపోయినది. ఓ కన్నయ్యా! నీవెక్కడున్నావో తెలియదు. నిన్ను చూచుటకై తపించు చున్నాను. కనికరింపుము. నీవు మురళి వాయించిన శబ్దమును గ్రహించుచు మరల నిన్ను చేరగలనంటు వేడుకొంటుంది. అనగా జీవాత్మ పరమాత్మను చేరుటకై పడువేదన ఆధ్యాత్మిక పరంగా చెప్పబడినది. 
1.వ.పాట
కసవు నాసను నేను కాననమున జిక్కి , కాననైతిని గదా కన్నయ్య రూపు..//కసవు//
మందలో నుండగ మందస్మితారవిందు, కన్నయ్య రూపును కలవేణు నాదముల్
చూచి యానందించి పరవశించితి నాడు ..//కసవు//
కసవు ఆకలి దీర్చు కన్నయ్య జేర్చదు, జీవితము పండంగ చేరవలె నీ చెంత.
తప్పిపోయితి నేను దయజూడు మాధవా! //కసవు//
మాయదారీ మనసు మైకమ్ము గమ్మింది, కసవు మెసవగ నన్నిటకు రమ్మంది.
దూరమైతిని నీకు తోయజాక్షా రావ!//కసవు//
మురళి నాదముతోడ మురిపించు మోహనా!, దారితప్పిన నేను తపియించి నినుగొల్తు
విడువ నీ పాదపద్మముల్ వేవేల యేండ్లకు//కసవు//

2వ. పాట. (కన్నయ్య మాయ)
ఒకనాడు బ్రహ్మదేవుడు తన మాయను ప్రదర్శింపదలచి శ్రీకృష్ణుడు
గోపాలురతో గోవులను కాచుచుండగా గోవులు గోపాలురు ఇండ్లకు వెళ్ళు సందెవేళకు
వానినదృశ్యము జేయగా మహామాయగాడైన కన్నయ్య కుమారుడైన బ్రహ్మకు కనువిప్పు  కలిగించిన తీరెలా ఉన్నదో చూద్దాం రండి.  

పాట.
కన్నయ్య మాయను కనలేని బ్రహ్మయ్య, గోపాలవర్గమ్ము గోగణమునంత
అదృశ్యముంజేసి యానందమొందె//కన్నయ్య మాయను//
సందెవేళందున సారసాక్షుడు జూడ, ఒక్క గోవు లేక నక్కజము నందగా
ఆనందమందెనా యంబుజాసనుడు//కన్నయ్య//
మాయలను సృష్టించు మహమాయదారియై, యోచించి కన్గొనెను ఉన్న సత్యంబును
బ్రహ్మ మాయే యనుచు ఫక్కున నవ్వెను//కన్నయ్య//
ఏరంగు గోగణము ఏరంగు గోపాలురందరు, తానెయై బృందమ్ముగాగ తత్త్వమ్ముజూపించ
ఒక్కడు సర్వమై సర్వమందొక్కడై రూపించె//కన్నయ్య//
తండ్రి మాయలముందు తానెంత యని దలచి, శిరము వంచి బ్రహ్మ శరణనియె తాను
కన్నయ్య లీలలు కనువిప్పు గలిగించు. //కన్నయ్య మాయను//

2.వ. బాణీ మార్చిన పాట. (భలేభలే బ్రహ్మయ్య బోల్తకొట్టావు)

భలేభలే బ్రహ్మయ్య బోల్త కొట్టావు, కన్నయ్యను మాయజేయ కాలు జారావు//భలే//
మేసేటి గోవులను కాసేటి గోపాలుర, మాయజేసి వారినెల్ల మర్మము జూపించి//భలే//
నీమాయకు నీవెంతో సంబరపడిపోయావు, నిన్నుమించు వారలింక నీ జగతిని లేరంచు
                                                                        //భలే//
కృష్ణుడంత యడవిలోన దృష్టి నిల్పి చూచినాడు,ఏ ఒక్కటి గోవులేదు ఏబాలుని జాడ
లేదు// యోచింపగ నీ మాయను నూహజేసె తానంత//భలే//
గోపాలురు గోవులుగా గుంభనగా తానె మారి, సందెవేళ బయలుదేరె సంతసాన యిండ్లకు
విశ్వమంత తాననుచు వేరొక్కటి లేదనుచు//భలేభలే//
తండ్రి మాయముందు నీవు తలవంచావు, సృష్టియంత కృష్ణలీల చేయించావు.//భలే//

3వ.పాట.(చిన్ని కృష్ణుని చిన్ని పాదాలు) కాళీయమర్దనము. 
        పోతనగారు వ్రాసిన భాగవతములోని కృష్ణుని లీలలు అత్యంత మధురము. 
పుణ్యఫలదాయకము. రస కందాయము. కాళీయుడను భీకరసర్పము 101పడగలతో
యమునానదిలో సంచరించుచు విషమును గ్రక్కుచు దరిజేరిన గోవులను గోపాలురను దినుచు దుర్భరముగా మారినది. అట్టిదానిని హతమార్చి గోవులకు గోపాలురకు నానందము గలిగించ సమకట్టి శ్రీకృష్ణుడు ఒక్క ఉదుటున నదిలోకి దూకి కాళీయుని పడగలను వంచి దాని గర్వము హరించి మరల యమునానదిని అమృతతుల్యము గావించినాడు. ఈ సమయమున కాళీయుని భావన పాట రూపంలో చూద్దాం రండి. 
పాట: 
చిన్ని కృష్ణుని చిన్ని పాదాలు శిరమున, తాకంగ తనువంత తన్మయమునందె
కాలకూట విషము కమ్మని మధువాయె//చిన్ని కృష్ణుని//
ఎన్ని జన్మలనుండి యెంతెంత తపమునో, చేసినా మునులకు చేరరాని స్పర్శ
నా పూర్వపుణ్యాన నా శిరము దాకె//చిన్ని //
నూటొక్క తలలను నురుగులై విషమంత, యమునలో గ్రక్కంగ నద్దాని బాప
నా శిరములొంచెను నా ఖరము ద్రుంచెను//చిన్ని//
యమున విషమేగాక నావిషమునంత, హరియించె శ్రీహరి యాప్యాయతలుదోప
ఉదధి జేరగ నాకు నుత్తమ కార్యంబు//చిన్ని//
బ్రహ్మకడిగిన చిన్ని పాదాలు నాకు, భవహరము సుఖకరము భాగ్యంబులీను
పట్టడో జనులార!పాదాలు గోపాలు//చిన్ని కృష్ణుని చిన్ని//

4వ. పాట. మురళీగాన మాహాత్మ్యం. 

     శ్రీకృష్ణుడు గానలోలుడు. సామవేదము నుండి సంగీతము పుట్టినది. త్యాగరాజు
వంటి మహాత్ములు "సంగీతము వినా మోక్షము లేదన్నారు." నాదోపాసన జేశారు.
తద్ద్వారా మోక్షము పొందారు. ఆ నాదము వేదసారమే. అది వినోదము కల్గించుటేగాక 
ముక్తి నిస్తుంది. చైతన్య ప్రాణులను అచేతనములుగ, అచేతపములను చైతన్య 
వంతముగ చేస్తుంది. రండి ఈ భావం పాటగా విందాం. 
పాట:
కృష్ణుని మురళీ మోహనగానం, చైతన్యంబులు జడమగు ఖాయం
జడములకు జడమది మాయం//కృష్ణుని మురళీ//
పశు పక్ష్యాదులు అశనమందుచు, పరవశమంది జడములౌనుగా
మోహన మురళీగానం, ముక్తికి నయ్యదె సోపానం//కృష్ణుని//
తత్త్వవేత్తలు మునులు సిద్ధులు, తన్మయమందిన చిన్మయగానం
గోపగోపికలు నిరంతరంగా, కోరి భజించెడి కోమలగానం//కృష్ణుని//
ఉత్త జడములౌ కొండలు కోనలు, ఊగిపోయినవి యుత్సాహంగా
చలన రహితమౌ చెట్టు చేమలు, తలలనూపినవి ధన్యులమంటు//కృష్ణుని//
ప్రాణములేని వేణువుగూడ, వాయువు వలనే పాడునులే
పరమాత్ముని యా పెదవిని దాకి , పారమార్ధిక రాగములెన్నో//కృష్ణుని//


 













   

దేశభక్తి.. గేయాలు

                         దేశభక్తి ..గేయం. 28.01. 2020     
          చరణం ..భారతావని నా తల్లి , భవ్య సద్గుణ కల్పవల్లి 
          పల్లవి .. ప్రణమిల్లుచు చేతును సంస్తుతులు 
                      కలుగగ నిరతము సద్గతులు ... 1. 
                      వేదభూమిగాప్రసిద్ధి నందిన 
                     పుణ్య సుశీలయె  నా మాత .... 2.   11 భారతావని  నా తల్లి 11
                      పవిత్ర మూర్తుల ప్రసవించి 
                      ప్రాణజ్యోతిగ వెలిగిన మాతా ... 3
                      గంగా యమునల కమ్మని పిలుపున
                      కలసి పారినది  బ్రహ్మాణి ......   4.  11 భారతావని  నా తల్లి 11
                      త్రివేణి సంగమ తీర్ధంబౌచు 
                      కల్మష హారిగ ఖ్యాతినందెను ... 5. 
                       ఉన్నత లక్ష్యము లున్నత కీర్తుల
                       హిమవన్నగమే నీవంది ...... 6. 11 భారతావని  నా తల్లి 11
                      దేశ దేశముల శాంతి తత్వమును 
                      బోధింపగ నిను పొమ్మంది ...... 7
                      అదియే తనకు మోదంబంచు 
                      తెల్లని నవ్వులు నవ్వింది .... 8. 11 భారతావని  నా తల్లి 11

       దేశాభివృద్ధిలో నా పాత్ర.(11.07.19)

      దేశసేవయన్న దేహముప్పొంగును
      నేరికైన గాని నిశ్చయముగ
      ధర్మపరుడనగుచు ధార్మికజీవికన్
      నడచుకొనుటయదియె నాదుపాత్ర.1.

      గ్రామసీమలెల్ల ఘనముగానెదుగుటే
      క్రాంతి,వృద్ధియనెను గాంధిజీయె
      వారి కలలు పండ వైభవంబుగ సాగి
      నడచుకొనుట యదియె నాదుపాత్ర.2.

      కవితనాయుధముగ కమ్మని సాహితిన్
      మనముపులకరింప మహితగతిని
      మార్చివేసి జనుల మనుగడ దెల్పుచు
      నడచుకొనుట యదియె నాదుపాత్ర.3.

       స్వార్థపరత సతము చంపును వృద్ధిని
       దేశప్రగతికదియ నాశనమ్ము
       త్యాగబుద్ధి కలుగు తత్వంబు నెలకొల్పి
       నడచుకొనుట యదియె నాదుపాత్ర.4.

       దేశవృద్ధి కొఱకు ధీరత్వమున్నట్టి
       యువత శక్తి యుక్తు లవసరంబు
       అట్టిస్ఫూర్తి బెంచి యంతరంగములందు
       నడచుకొనుట యదియె నాదుపాత్ర.5.

        పొదుపుచేయుచున్న పూర్ణఫలముగల్గు
        అందుముఖ్యమౌను నర్ధమెపుడు
        సర్వ గౌరవాలు సంపదందెయనుచు
        నడచుకొనుటయదియె నాదుపాత్ర.6.

         దేశభక్తి యొకటె దివ్యంపువృద్ధిని 
         కలుగజేయు ననిన కల్లగాదు
         యువతమనమనందు నుత్తేజముంబెంచి
         నడచుకొనుప యదయె నాదుపాత్ర.7.

మేరా భారత్ మహాన్.  జై భారత్. జైజై భారత్.

 మదికి కుశాగ్రతత్త్వమును మానితరీతిని సంతరించిన
 న్నది ఘనమై మహోన్నత సభాంతర రాజిత దివ్యతేజమౌ
 సదమల భావశూన్యుడయి సారవిహీనత మూర్ఖతత్త్వముం
 చదివిన జ్ఞాన మంతయును చప్పునబోవునదేమిచిత్రమో.
        

                       
                      

పద్యపరీమళము. యశస్వినీ సాహితీ సమితి. 12.06.25

 1. రాజనరేంద్రు కాలమున రాజిలె పద్యము నన్నపార్యుచే     సాజము సుందరంబయిన సంస్కృతభారతి తెల్గువెల్గుగా     భాజనమంచు పండితులు భారతమున్ శిరసావహించ...