29, డిసెంబర్ 2018, శనివారం

షష్టి పూర్తులు , సహస్ర చంద్ర దర్శనశాంతి హోమాలు అవసరమా? ఆడంబరాలా ?





షష్టి పూర్తులు , సహస్ర చంద్రదర్శన శాంతిహోమాలు అవసరాలా ? ఆడంబరాలా ? 

   ప్రపంచ దేశాలు మన దేశానికి మోకరిల్లేది మన ఆర్ధిక సంపదను చూచి కాదు , ఆధ్యాత్మిక సంపద చూచే . అది మనకు వేద ప్రమాణమైనది. అనంతమైనది. మానవుని ఆనంద  జీవనమునకు రెండు మార్గములున్నవి.             1. సంసార రహితుడై ముని వృత్తి తో మోక్షమును వెదకుట.(ఇది అలౌకికా నందము ) 2. సంసారాపేక్షతో కన్యను వెదకి పాణిగ్రహణము చేసికొని సత్సంతానముతో ఆరారోగ్యభోగ భాగ్యములతోబాటు కష్టనష్టములను అనారోగ్యముల ననుభవించుచు పరమాత్ముని తలచుకొను జీవనము. (ఇదిలౌకికానందము) మనము ఆరోగ్య భోగభాగ్యాలతో నుండవలెనన్న తప్పక దైవబలము మనకు కావలసినదే. టానిక్కులు త్రాగి , వ్యాయామాలు చేస్తే సరిపోయేదానికి ఆ కనపడని దేవుని తో పనే ముంది ? అని అడిగే వారికి  నా శతకోటి నమస్సులు. ఈ చర్చ ప్రస్తుతమప్రస్తుతము. 
     కొందఱు మన సంప్రదాయాలను తక్కువగా చూచి హేళన చేస్తూ షష్టి పూర్తి, సహస్ర చంద్రదర్శన శాంతి హోమము మొదలగు క్రతువులు ఆడంబరమనే అనవచ్చును. కానీ నమ్మిన వారికి  నమ్మినంత మహాదేవ. వాని వలన తప్పక ప్రయోజనము కలదని నా విశ్వాసము . శాస్త్ర వచనము . మనిషి పుట్టినదాది మరణము వరకు తెలిసో , తెలియకో పాపపుణ్యములు చేస్తాడు . పుణ్య ఫలముగా సుఖములు , పాపఫలముగా కష్టముల ననుభవిస్తాడు . పుట్టిన సంవత్సరము  నుండి మరల అదే  సంవత్సరము వరకు 59 యేండ్లు నిండి 60 కి వస్తాడు . అప్పటికి జీవితాన  ఒక ఆవృత్తి పూర్తి  అవుతుంది.  దీనినే  ఉగ్రరథ శాంతి , లేక షష్టి పూర్తి  మహోత్సవమంటారు.  ఈ సమయంలోనే భగవంతునకు కృతఙ్ఞతలు చెప్పి మన పాపముల పరిహారము కొరకు చేసికొను విన్నపములే ఈ శాంతిహోమములు . క్రతువులు. ఈ క్రతువులే చేయనవసరం లేదు. ఏ అనాథ  శరణాలయాలకో , పేదవారిదగ్గర కో  కూడా వెళ్లి వారికి తగిన సహాయమందించినా  పాప పరిహారమే అవుతుంది. కాకుంటే బంధువర్గమంతా కలసియుండుటకు ఇదొక మార్గము.
    ఏకాదశ రుద్రులందరికి తెలిసిన వారే. వీరుకాక రుద్రులు శతాధికముగా ఉన్నారు. రుద్రుడు లయకారుడు. మన పాపములను లయము చేయుమని రుద్రుని కోరుతూ కార్తిక మాసములో ఏకాదశ రుద్రాభిషేకం కూడా చేస్తాము.  రుద్రులలో కొందరు శాంత, మరి కొందఱు ఉగ్ర స్వభావాలతో ఉందురట. అట్టి వాడే ఉగ్రరథుడను రుద్రుడు. 60. ఏండ్లు నిండిన వారికి ప్రాణాపాయమో , అనారోగ్యమో కలిగించునట .దానికి పరిహారము గా  ఉగ్రరథ  శాంతి అవసరము. అట్లే 70. యేండ్లు నిండిన వారికి భీమరథ శాంతి , 78 ఏండ్లకు విజయరథ శాంతి , 83.యేండ్ల 4 నెలలకు .( 1000  పూర్ణిమలు ) సహస్ర చంద్ర దర్శనమహోత్సవము, 100 సంవత్సరములు నిండిన వారికి పూర్ణ శతాభిషేకము చేయించుకోవాలి. ఈ క్రతువులను కేవలము సంతామే చేయవలసిన అవసరము లేదని, స్వయముగా ఆ దంపతులే చేసికొన వచ్చునని విజ్ఞులు తెలియజేసారు. 
    మానవుడు  దైనందిన కార్యక్రమములలో మునిగి ఆలోచనలో ఉండి ఆచరించలేక పోయిన , దాన ధర్మాది కార్యములు , క్రతువులు ఈ సమయము లో బంధువుల ఆప్యాయతాను రాగముల మధ్యన చేసికొనిన పెద్దల , వేద విదుల, పండితుల దీవనలు లభించి ఆ దంపతులకు మెరుగైన ఆయురారోగ్యములు , భోగ భాగ్యములు చేకూరును. ఆధ్యాత్మిక భావనలు పెరిగి దైవకృప అధికమగును.  చరమాంకమున ఏ ప్రాణికైనను కావలసినది అదేకదా . 
      శరీరమాద్యం ఖలు ధర్మ సాధనం ... అనగా శరీరమే అన్ని ధర్మ కార్యముల సాధనకు మూలమైనది . దానిని కాపాడుకొనుటకు జాగ్రత్తగా ఔషధ సేవ చేస్తూ తగిన వ్యాయామములు చేయవచ్చు ననుకొనిన, అవి మానవ ప్రయత్నాలే . ప్రతి మానవ ప్రయత్నానికి తప్పక దైవ సంకల్పం కావాలి. దైవిక కార్యక్రమములన్ని ఒక మహోన్నత లక్ష్యముతో ఏర్పాటు చేసినవే నిస్సందేహముగా. 
   ది . 27.12 2018. న నాకత్యంత ప్రియతమాగ్రజుడు , సాహితీప్రియుడు అయిన శ్రీయుతులు పొన్నెకంటి భవానీపతి రావు గారి సహస్ర చంద్ర దర్శన శాంతి హోమమునకు వెళ్ళుట జరిగినది . 84 యేండ్ల వయసులో కూడ ఏంతో  ఓపిక , సహనము, భక్తి భావనాపూరితమైన చిరునవ్వుతో అపర భవానీపతి లాగానే కనిపించాడు. ఇక మా వదిన గారు హనుమాయమ్మగారు. అపర సాహితీమూర్తి , అవ్యాజ ప్రేమమయి, బంధుప్రీతి కల యిల్లాలు. వారి అన్యోన్య జీవన విధానము ఆదర్శప్రాయము. ఆమె పలకరింపులోనే ప్రేమానురాగాలు  తొంగిచూస్తాయి . వారి ప్రథమ పుత్రుడే చిరంజీవి శివ ప్రసాద్. ఆతని సదాలోచనను ఆతని భార్య ,  సోదర సోదరీమణులు, కుటుంబ సభ్యులందరు కలసి ఆమోదించి  సహస్ర రజత కమలములతో వారికి పాద పూజ( రజతములే కాక మామూలు వానితో చేసినను ) చేయుట ఆ దంపతుల పూర్వజన్మ సుకృత ఫలమో, తలిదండ్రులు  శతాధిక వసంతాలు ఆయురారోగ్యాలతో నుండి తమకు వెన్నుదన్నుగా నుండవలెనని సదాశయమో , ఆస్తుల కొరకు కన్న తల్లిదండ్రులనే  కసాయిగా  కడతేర్చు ద్విపాద పశువులకు  కొంత ఆదర్శము గా నుండు కొరకో , తలిదండ్రులపై అవ్యాజ ప్రేమానులాగాలో నిర్ణయించుట కష్టమే. ఏది ఏమైనను భవానీ పతి రావు అన్నయ్య , వదిన గారి వలన సంతానము , సంతానము వలన వారు  ఎంతో అభినందనీయులు. సదాశయము, సత్కార్యాచరణ, భక్తి భావనలు, దానధర్మములొనర్చుట, ధార్మిక జీవనము, సాంఘిక బాధ్యతలు మానవుని మహోన్నతుని చేస్తాయనుటలో సందేహములేదు . మానవ జన్మ సార్ధకతకు ఇంతకన్నా కావలసిన దేముంది?  . ఈ కార్యక్రమ చిత్రములు పైన కలవు  , వీడియోలను తదుపరి  పొందుపరచగలను . శుభం భూయాత్ .         
       

      

24, డిసెంబర్ 2018, సోమవారం

ఊహలు నిజాలైతే.

ఊహలు నిజాలైతే....

   మానవుని మస్తిష్కం నిరంతరం గత మధురక్షణాలను, చేదు జ్ఞాపకాలను నెమరువేసికొనుటే కాక, ప్రస్తుత పరిస్థితుల్లో మంచిచెడుల విశ్లేషణ చేస్తు ఉంటుంది. ఇంతేకాక మానవునకు భగవంతుడిచ్చిన గొప్పవరం ఊహాశక్తి. భావి జీవితాన్ని గురించి ఆలోచిస్తు ఉంటుంది. ఇది అందరికి సమానంగా ఉండదు. కారణం సత్త్వ,రజస్తమోగుణాలకు అనుగుణంగా హెచ్చుతగ్గులుంటాయని నా భావన. సత్త్వగుణం సాధారణంగా భక్తి, సేవాసక్తి, సాత్త్వికలక్షణాల వలన ఊహలకన్న యథార్థాలకే పెద్దపీట వేస్తుంది. వారూహించే విషయాలే నిజాలౌతాయి. రజోగుణం కొంచెం ఆవేశపూరితంగా ఉంటుంది కనుక ఊహలస్థాయి ఎక్కువగా ఉంటుందని భావించవచ్చు. నిజాల స్థాయి తక్కువే. రజోగుణంలో నిజాలస్థాయి ఉండకపోవచ్చు.
   ఊహలు మహాత్ముల పట్ల నిజమౌతాయనుటకు చాలా నిదర్శనాలున్నాయి. ఉదాహరణకు : 1.కాళిదాసకృత అభిజ్ఞాన శాకున్తలమ్ లో,  శకుంతలను జూచిన దుష్యంతుడు శకుంతలను ప్రేమించి, ఆమె చెలికత్తెలను ఈమె తలిదండ్రుల వివరాలడుగగా , ఈమె కణ్వమహర్షి కుమార్తెయని వారు చెప్పగా దానినంగీకరించక , ఆమె బ్రాహ్మణేతర  కన్యయని తెలిపి వివరాలు  సంపూర్ణంగా సేకరించగా  కణ్వుని పెంపుడు కూతురని, తలిదండ్రులు మేనకా విశ్వామిత్రు లని తెలుస్తుంది. 2. నానృషిః కురుతే కావ్యం, ఋషికానివాడు కవి కాలేడని అంటారు.  వాల్మీకి మహర్షి ఊహాజనిత కథే శ్రీమద్రామాయణం. మహర్షి ఊహే నిజం అయినది. 3. ఊహలు నిజాలయే విషయంలో నేను నా తండ్రిని  ఆదర్శంగా తీసికొంటాను. వ్యక్తి, కుటిల స్వచ్ఛతల విశ్లేషణానుభవం లో ఎన్నో విషయాలు నాకు ఋజువైనాయి. ఆయన ఋషి తుల్యుడు.
    సంఘంలో మానవ రక్త సంబంధాలనేకములున్నాయి. భార్యాభర్తలు, తల్లీ పిల్లలు, అక్కాచెల్లెండ్రు, అన్నదమ్ములు. మానసిక సంబంధబంధితులు  ప్రేయసీ ప్రియులు. కూతురు,కోడలు, కొడుకు, అల్లుడు.
  కూతురి ని కోడలులా, కోడలిని కూతురిగా , కొడుకును అల్లుడు గా, అల్లుని కొడుకుగా ఊహిస్తే....అలా ఊహించలేము. ఎందుకంటే ఎవరి స్థానం వారిదే.
కూతురి,కొడుకు పట్ల రక్తసంబంధపు చనువు జన్మతః ఉంటుంది. అది కోడలిపట్ల, అల్లుని పట్ల మనం ఏర్పాటు చేసుకోవాలి. అల్లుని సంబోధించునపుడు , ఏమండీ అంటాం కాని, ఏరా!అనము. కొడుకును ఏమండీ అనకూడదు. కూతురిని ఏమే అమ్మా!అంటాం. కోడలిని ఏమే అనే స్వతంత్రత ఉంటుందా ?
ఏనాటికి ఉండదుగాక ఉండదు. వేలమందిలో ఏఒకరో  ఉంటారేమే అలా అంగీకరించేవారు. మనమనసులలో పాతుకుబోయిన నిజాలు. ఇక పల్లెటూరి సామెతలకొస్తే....అవి జీవనయాత్రా సత్యాలు. : కూతురి వంటింట్లోకి నిబంధనలు లేకుండా చనువుగా వెళ్ళేవాడు తండ్రి. కోడలి ఇంట హాల్లో బిక్కముఖం వేసుకొని కూర్చునేవాడు మామగారు. (ఇలా అందరి విషయాలలో ఉండటం, ఉండకపోవటం వారివారి అదృష్టాలనుబట్టి ఉంటుంది.) కూతురు వచ్చి నాన్నా! అంటూ తండ్రి ప్రక్కన కూర్చుటుంది..మేనకోడలు కూడ మామయ్యా!అంటు దగ్గర జేరుతుంది.  మరి కోడలు మామయ్యగారూ !అని దూరంగా ఉండి మాట్లాడుతుంది ఎంతో అవసరమైతేనే.  వీలైనంత వరకు విషయాలన్నీ భర్త ద్వారానే చెప్పిస్తుంది.   ఊహల విషయానికి వస్తే .....మామగారిని తండ్రిగా, అత్తగారిని తల్లిగా ఊహించటంలో ఒక ఇబ్బంది ఉంటే అమలు పరచటంలో మరొక ఇబ్బంది ఉంది. నిష్కల్మషత్వ ప్రేమానురాగాలు, మమకారాలు, నిస్వార్ధం మానవకుటుంబ సభ్యులందరిలో  ఉంటే ఎలా ఊహించుకొన్నా ఏ ఇబ్బందులు, ఆటంకాలు రావు.
   మనం ద్విపాద పశువులస్థాయి దాటిన విజ్ఞాన ధనులం.  విజ్ఞాన హీన పశువులు సంఘటితంగా, ప్రేమానురాగాలతో  ఉండి ఎంతో పరాక్రమశాలియైన సింహాన్ని సైతం చంపుతున్నాయి. మన జీవనపరిస్థితులు, పరదేశ  సంస్కృతులు, స్వాతంత్ర్యాలు సంఘటితంగా ఉండనీయటంలేదు కుటుంబాలను. అందువలననే ఉమ్మడి కుటుంబాల ఊహే పగటికల అవుతున్నది.
    మానవ జీవనయానంలో ఒకరిపై మరొకరికి బంధంవేసేది నిర్మల ప్రేమ, అనురాగం, నిస్స్వార్థం. ఇవి పెరిగితే అన్నీ చక్కబడతాయి. అలా చక్కబడాలని తెల్లవారుజామున ఊహిద్దాం. ఆసమయంలోనైతేనే తథాస్తుదేవతలు దీవిస్తారు! శుభంభూయాత్! 

పద్యపరీమళము. యశస్వినీ సాహితీ సమితి. 12.06.25

 1. రాజనరేంద్రు కాలమున రాజిలె పద్యము నన్నపార్యుచే     సాజము సుందరంబయిన సంస్కృతభారతి తెల్గువెల్గుగా     భాజనమంచు పండితులు భారతమున్ శిరసావహించ...