14, ఏప్రిల్ 2022, గురువారం

యాత్రానుభవాలు. 1.కాశీ యాత్ర. 2 . రామేశ్వరం.3. వైష్ణవోదేవి, 4. అమర్ నాథ్. 5.నిర్మల్.


1. కాశీ యాత్రా విశేషాలు. 23.3.22...30.03.22 .

రచన .. పొన్నెకంటి సూర్య నారాయణ రావు. భాషాప్రవీణ, ఎం,ఏ. తెలుగు. 

కాశీ విశ్వనాధుని యనుగ్రహము వలననే నా 75 వ జన్మ దినము వారి సన్నిధిలో అభిషేక సహితముగా జరిగినది. అది నా పూర్వ జన్మ సుకృతము గా భావిస్తాను. 

    ది .23.03.22 న 


ఉ.9.30 ని.లకు. వారణాసి - దానాపూర్ ఎక్స్ప్రెస్ సికిందరాబాద్ నుండి కదిలింది విశ్వేశ్వరుని స్మరణతో. సికింద్రాబాద్ నుండి వారణాసి కి 1611. కి. మీలు.  స్టేషన్ల వరుసలో 24 వ ది వారణాసి జంక్షన్ . 24.03.22 మధ్యాహ్నం 2 గం. లకు వారణాసి చేరాము. వారణాసి కి రాను పోను రు.3500/-.వారణాసి, అలహాబాద్ , అయోధ్య, నైమిశారణ్యం లో ప్రయాణ సౌకర్యం, ఏ. సి. రూములు, భోజన  వసతులు కలిగించే నిమిత్తం రు.12500/-  అందులోని మా సభ్యులు. 1. పొన్నెకంటి సూర్యనారాయణ రావు. 2. ఇందిరాదేవి. 3. దోవల భగవతి . 4. గంగరాజు విజయలక్ష్మి. 5. మోదుకూరు హేమలత. 6. వఝ బుచ్చిరాజు.7. వఝ రాణి. 8. గంగరాజు హేమాద్రి. 9. గంగరాజు రాజ్యలక్ష్మి. 10. ఐతరాజు రాజ్యలక్ష్మి. 11. అచ్యుతన సీతారామమ్మ. 12. మోహన్. 13. సరళా దేవి . 

శ్లో : దర్శనాత్  అభ్రశదసి,  జననాత్ కమలాలయే ! 

       స్మరణాత్ అరుణాచలే, కాశ్యాంతు మరణాన్ ముక్తి : !!  

భావము: ఒకప్పుడు మానవులకు  4 వరాలిచ్చాడట పరమ శివుడు. అవి 1. చిదంబరం లో పరమేశ్వరుని జ్ఞానంతో దర్శించుట  2. తిరువారూరు లో జన్మించుట(ఇది మనచేతిలో లేదు) 3. అరుణాచలేశుని స్మరించుట. 4. కాశీ లో మరణించుట (ఇది కూడా మన చేతిలో లేదు)  

    వారణాసి రైల్వే స్టేషన్ కి మాకు సౌకర్యాలన్నీ ఏర్పాటు చేసే రాచకొండ వెంకటేశ్ 2 వాహనాలు పంపాడు. వానిలో హోటల్ డివైన్ కు చేరి భోజనం ముగించుకొని మా మా ఏ,సీ  గదులలో విశ్రాంతి తీసికొన్నాము. 

                                  వారణాసి గురించి కొన్ని వివరాలు :

    హిందువులకు ఉత్తర ప్రదేశ్ లోని అతి పవిత్రమైన స్థలం కాశీ. దీనినే వారణాసి అంటారు. వరుణ, అసి అను 2 నదులు గంగానది లో కలసి ప్రవహించుట వలన దీనికి ఆ పేరు వచ్చినది. బ్రిటీష్ కాలములో దీనినే బెనారస్ అనేవారు.  కాశీలో మరణించిన జీవికి కుడి చెవిలో శివుడు రామ మంత్రమును చెబుతాదాట . ఇచటి విశ్వేశ్వర లింగం ద్వాదశ జ్యోతిర్లింగాలలో ఒకటి.  అత్యంత పురాతన నగరం. సమస్త వేద వేదాంగ సంస్కృత పండితుల కిది కాణాచి. హరిశ్చంద్ర, గౌతమబుద్ధ ,వేద వ్యాస, తులసీదాస, శంకరాచార్య , కబీర్ దాస్,ల వంటి మహాత్ములు నడయాడిన పవిత్ర భూమి. 

చూడదగిన ఆలయాలు : విశ్వేశ్వరాలయం, అన్నపూర్ణాలయం, విశాలాక్షీ ఆలయం, వారాహీ ఆలయం, తులసీ మానస మందిరం, సంకట విమోచన హనుమాలయం, కాల భైరవాలయం , దుర్గామాత ఆలయం, డుంఢి గణపతి ఆలయం, చింతామణి గణపతి ఆలయం, కేదారనాథ్ ఆలయం, లోలార్కుడు, భరతమాత మందిరము. సారనాథ్ స్తూపం వంటివి ఎన్నో ఉన్నాయి.  

    మొత్తం 84 ఘాట్లలో దశాశ్వమేధ ఘాట్, హరిశ్చంద్ర ఘాట్, మణికర్ణికా ఘాట్, వంటి 64  ఘాట్లు చాలా ప్రశస్తిని సంతరించుకొన్నాయి.  సతీదేవి చెవి ఆభరణం (మణి కర్ణిక)పడిన ప్రదేశము కనుక దీనిని మణికర్ణిక ఘాట్ అంటారు. ఇచటికి పరమ శివుడు పదునాల్గు కోట్ల దేవతలతో స్నానానికి 12.గం.లకి  వస్తాడని ప్రతీతి. కాశీ వెళ్ళిన వారందరు మధ్యాహ్నం స్నానానికే ప్రాధాన్యమిస్తారు. దీనికి ప్రక్కనే మణి కర్ణిక శ్మశానము ఉన్నది. అచట శవదహనాలు 24 గంటలు, 360 రోజులు నిరంతరాయం గా జరుగుతుంటాయి. అందువలన కాశీ నిత్యం వెలుగుతున్న దీపం. మనం నదీస్నానానికి పూర్వమే యింటి దగ్గర స్నానం చేసి తీరాలి. ఆ తరువాతే నదీస్నానం చేయాలి. 

నదిలో ముందుగా 3 సార్లు మునిగి ఆ తరువాత సంకల్పం చెప్పుకోవాలి, లేక   పురోహితునిచే చెప్పించుకోవాలి. ఆ సంకల్పం ఈ విధం గా ఉంటుంది. 

**ఆచమ్య , ప్రాణానాయమ్యా  , మమోపాత్త దురిత క్షయ  ద్వారా  శ్రీ పరమేశ్వర ముద్దిస్య పరమేశ్వర ప్రీత్యర్ధం, శోభనే ముహూర్తే, కాశీ విశ్వేశ్వరఆజ్ఞ యా, ప్రవర్తమానస్య అద్య బ్రాహ్మణః, ద్వితీయ పరార్ధే, శ్వేత వరాహ కల్పే , వైవస్వత మన్వంతరే, అష్టావింశతి తమే, కలియుగే ప్రథమ పాదే , విక్రమ శకే , బౌద్ధావతార జంబూద్వీపే , భరతవర్షే , భరతఖండే , వింధ్యస్య ఉత్తర దిగ్ భాగే , ఆర్యావర్తక దేశే , అవిభక్త వారాణశీ క్షేత్రే , ఆశీవరణయోః మధ్యే , ఆనంద వనే, మహాశ్మశానే , గౌరీముఖే, త్రికంటక విరాజితే , ఉత్తర వాహిన్యాః , భాగీరధ్యాః   పశ్చిమే తీరే , బ్రహ్మ నాలే , మహా మణికర్ణికా క్షేత్రే , శ్రీ విశ్వేశ్వరాది త్రయస్త్రిమ్  శత్కోటి పరివార దేవతా , గో బ్రాహ్మణ , హరి హర గురు చరణ సన్నిధౌ , బార్హ స్పత్య మానేన అస్మిన్ వర్తమానేన వ్యావహారిక చాంద్ర మానేన ,శుభకృత్ నామ సంవత్సరే, వసంత రుతోః , చైత్రమాసే ,,,,,,శ్రీమాన్ శ్రీ వత్స గోత్రో ద్భవస్య సూర్యనారాయణ శర్మణః, సహ కుటుంబానాం, చతుర్విధ ఫల పురుషయార్ధం, ఆయురారోగ్య సౌభాగ్య సిధ్యర్ధం, గాఢ బద్ధ పాశ నివృత్తి ద్వారా, జ్ఞాన అజ్ఞాన కృత సర్వ దోష నివారణార్ధం , విశాలాక్షీ, అన్నపూర్ణా సమేత శ్రీ కాశీ విశ్వేశ్వర దేవతా ప్రీత్యర్ధం , మహామణి కర్ణికా స్నానం అహం కరిష్యే . గంగే మాం పాహి . 

ది . 25.03. 22.  

    తెల్లవారు జామున 5 గం. లకు లేచి సిద్ధమయి కాశీ విశ్వేశ్వరుని సన్నిధిలో నా 75 వ  జన్మదిన సందర్భముగా అభిషేకము చేయించుకొన్నాను. అభిషేకమునకు రు.800/-.అన్నపూర్ణా దేవికి కుంకుమ పూజ కు,రు350/-. ఇది నా జీవితం లో మరపురాని సంఘటన . ఈ సందర్భమును  పురస్కరించుకొని మిగిలిన అందరు  కూడ అభిషేకం చేయించుకొన్నారు. అభిషేక జలము స్వామివారి కి అర్పించి , దర్శనము చేసికొని, అన్నపూర్ణా దేవి చెంత  (శ్రీచక్రము వద్ద ) కుంకుమార్చన చేసుకున్నాము. అన్నపూర్ణమ్మ ప్రసాదంగా కొన్ని బియ్యం యిస్తారు. అవి మన యింటిలోని బియ్యపు డబ్బాలో కలుపుకుంటే అన్నానికి లోటు కలుగదని నమ్మకము. అచ్చటే కుబేర బియ్యం కూడ యిస్తారు . వానిని మనం డబ్బులు దాచుకొనే బీరువాలో పెట్టుకోవాలి. నేను ఆ రెండిటిని తీసికొన్నాను . ఆ తరువాత విశాలాక్షీ అమ్మవారు (శక్తి పీఠం ). ముందుగా కనబడే అమ్మ వారు అర్చామూర్తి . లోపల  ఉన్న అమ్మవారు స్వయం భువు. 

 తరువాత వారాహీ దేవి దర్శనం చేసుకొన్నాము, దొడ్డిదోవన ఒక్కొకరికి రు.200/-ధర్మ దర్శనం అసాధ్యం.  ఈమె అమ్మవారి శక్తి రూపాలలో ఒకటి. సప్త మాతృకలలో ఒకరుగా, దశ మహా విద్యలలో ఒక శక్తిగా కొలుస్తారు. వరాహ ముఖము కలిగి ఉంటుంది.  ఈమె లక్ష్మీ రూపం . విష్ణువు వరాహ రూప మెత్తినపుడు ఆయన భార్య గా వారాహి అయినది. శైవులు, వైష్ణవులు, శాక్తేయులు పూజిస్తారు. ఎక్కువ తాంత్రిక పూజలు చేస్తారు.ఈమెయే కాశీకి గ్రామ దేవతకూడ . అందు వలన తెల్లవారు జామున 4 గం.ల నుండి. 9 గం.ల వరకు అమ్మవారు గ్రామ దర్శనానికి వెళుతుందట. ఆ సమయమే మనకు దర్శన సమయం.  మాకు దర్శనం అయేటప్పటికి సుమారు 11 గం. అయినది. మరల హోటల్ డివైన్ కు వెళ్ళి , బట్టలు మార్చుకొని 12.30 లకు చింతామణి గణపతి, కేదారనాథ్, ఆలయముల దర్శనం చేసికొని మణికర్ణిక ఘాట్ లో స్నానానికి బోటులో బయలు దేరాము . మేమందరం గుడికి, స్నానానికి కదా  వెళుతున్నాము, చెప్పులు అవసరం లేదనుకొని వేసికొని వెళ్లలేదు.  వెళ్లేటప్పుడు బాగానే ఉన్నది. కానీ వచ్చేటప్పుడు 3మధ్యాహ్నం 1గం. కు  అచటి మెట్లు నిప్పుల కుంపటి లాగా మండుతున్నాయి.  అప్పుడు సాగింది నిజమైన మా భగవన్నామ స్మరణ.  మనం హాయిగా చెప్పులు వేసికొని వెళ్ళి ఆ బోటులో విడిచి స్నానం తరువాత వేసికొన వచ్చును. ఈ పొరపాటు ఎవరును చేయవద్దు. 

    మణికర్ణిక ఘాట్ .. స్నానం. మేము ఒక పురోహితుని చేత సంకల్పం చెప్పించుకొని స్నానం చేశాము. ఆయన సంకల్పం చెప్పినందుకు ఒక్కొకరికి రు . 30/-లు చెల్లించుకొన్నాము. దేవతలతో సహా  పరమశివుడు స్నానంచేసిన  చోట స్నానం చేస్తే మనకు పునర్జన్మ ఉండదట. ప్రక్కనే 10 అడుగుల దూరం లో మణికర్ణిక దహన సంస్కార ఘాట్ ఉన్నది. నిరంతరం శవాలు శివ సాయుజ్యం పొందుతూ ఉంటాయి. కాశీ లో మాత్రం శవ దహనానికి సమయ నియమం లేదట. అందు వలననే నిత్యాగ్ని హోత్రాలతో వెలుగుతు ఉంటుంది కాశీ. మన స్నానం కూడా శవాల బూది నిమజ్జనమైన గంగా జలంలోనే.  


గంగా హారతి : ప్రతిరోజు శీతాకాలంలో సాయంత్రం.7గం .లకు, వేసవికాలంలో  ప్రతిరోజు సా. 6. గం .లకు గంగా హారతి ఉంటుంది. జీవితంలో ఒకసారి చూడదగినది. హరిద్వార్ తరహాలో రిషికేశ్, వారణాసి, ప్రజ్ఞా, చిత్రకూటం లలో గంగాహారతి నిర్వహిస్తారు.  వారణాసిలో 1991 నుండి ప్రారంభించారు. కార్తిక  పూర్ణిమ సందర్భంగా జరిగే హారతి చాలా ప్రత్యేకము. హారతి చూచుటకు మనం యింటి దగ్గర ఖచ్చితంగా సా.4 .గం .లకే బయలు దేరాలి. గంగానది హారతి కాంతులతో వెలిగిపోయే మనోహర దృశ్యం. గంగా హారతి నిచ్చే పూజారులకు ప్రత్యేక వస్త్రధారణ ఉంటుంది. ధోతి, కుర్తా, పొడవైన గాంచా (తువ్వాలు) ధరిస్తారు. 5 ఎత్తైన పలకలతో కూడిన ఒక యిత్తడి దీపం, గంగాదేవి విగ్రహం, పూలు, ధూపం యితర ఆచార  సామగ్రిని హారతి కొరకు సిద్ధం చేస్తారు . ఉపనిషత్తులు నేర్చిన 7 గురు  పండితులు మాత్రమే హారతి ప్రదర్శనలో పాల్గొంటారు. వారికి గంగోత్రి సేవా సమితి పూజారి నేతృత్వం వహిస్తారు . హారతికి ముందు శంఖనాదం చేసి మంత్రాలతో కర్పూరంతో రకరకాల హారతులిస్తారు.  బోటులో నుండే  గంగాహారతి చూచి, ఆడవారందరు  దీపం జ్యోతి పర బ్రహ్మం అంటూ ప్రమిదలలో  దీపాలు వదిలారు. దశాశ్వమేధ ఘాట్ లోనే కాక ప్రక్క ఘాట్ లో కూడా ఆడపిల్లలు హారతి యివ్వటం చూచాము. తరువాత అన్ని64  ఘాట్లు చూచాము. సుమారు  9 గం లకు హోటల్ డివైన్ కు చేరాము.  

26.03.22. 





ఈ రోజు కాలభైరవ, మృత్యుంజయ ఆలయాలను, సారనాథ్ స్తూపం, వ్యాస కాశి లను  చూచాము. మేము టిఫిన్ కూడా తీసికొని వెళ్ళాలి అనే సంకల్పం తో కొంత ఆలస్యం చేశాము. కానీ అది చాల యిబ్బందికి గురిచేసింది. కాలభైరవుని ఆలయం దగ్గర అప్పటికే కొన్ని వందలమంది ఉన్నారు. వారు బహుశః తె .జామున 4 గం. ల కే  అచటికి చేరి యుండవచ్చును. బ్రహ్మ, శివుల ఆధిక్యపు పోరాటంలో శివునకు కోపం వచ్చి హుంకారం చేయగా పుట్టినవాడే కాలభైరవుడు. ఈయన వాహనం శునకం(కుక్క) ఈయనే క్షేత్ర పాలకుడు కూడాను.  శివుని ఆజ్ఞానుసారం బ్రహ్మ పంచముఖాలలో ఒకటి ఖండించి, ఆ కపాలం చేత ధరించి, ఆ పాప పరిహారార్ధం సమస్త లోకాలు తిరుగుతుంటాడు . ఈ కపాలం ఎచ్చట పడుతుందో ఆచటేనీకు పాప విమోచనం జరుగుతుంది అని శివుడు చెబుతాడు. విష్ణువు సలహాతో మరల కాశీ చేరి పాపం పోగొట్టుకుంటాడు. చేతిలోని  కపాలం క్రింద పడుతుంది. దానిని  పాతి పెడతాడు , ఆ ప్రదేశమే కపాల మోక్ష తీర్థం. శివుని అవతారమే కాలభైరవుడు. ఆయనను క్షేత్రపాలకునిగా నియమించి, ముందు నీ పూజ అయిన పిదపె నాకు పూజలు జరుగుతాయని సెలవిచ్చారు శివయ్య . కాశీ యాత్ర ముగిసిన తరువాత యింటి దగ్గర గంగ పూజ చేయించుకొని గారెలు చేసి, నైవేద్యం పెట్టి, 9 గారెలను దండగా  గుచ్చి కుక్కను కాల భైరవునిగా భావించి మెడలో వేస్తారు. మృత్యుంజయుని దర్శించి ఆశీస్సులు  తీసికొని, సారనాథ్ చూచాము. 

సారనాథ్ : సారనాథ్ అనునది ఆంగ్ల పదము. మృగదవ, వింగదాయ, ఋషిపట్టణ,  ఇస్ఫి తాన, అని కూడ  అంటారు. మృగదవ అనగా జింకల వనం . ఇచట గౌతమ బుద్ధుడు తన మొదటి ధర్మ ఉపదేశాన్నిచ్చాడు . ఇచ్చటే బౌద్ధ సంఘాలు ఏర్పడ్డాయి . ఇది వారణాసి కి ఈశాన్యం లో 13. కి. మీ. లలో ఉన్నది. సారనాథ్ కాక కుశీనగరం, బోధిగయ, లుంబిని కూడ బౌద్ధమత భక్తులకు పుణ్య స్థలాలు . బుద్ధుడు తనకు జ్ఞానోదయం అయిన తరువాత తన సహచరులైన 5 గురు పంచ వాగ్గీయ సాధువులు బుద్దుని వదలి ఉసీ పట్టణం వెళ్లారు. వారికి జ్ఞానోపదేశం చేయుటకు గంగానదిపై గాలిలో నడచుకుంటు వెళ్లాడట. ఇది విన్న మౌర్య రాజు బింబిసారుడు సన్యాసులకు శుల్కాన్ని రద్దు చేశాడట. ఇలా ఎన్నో విశేషాలున్నాయి . 

27.03.22. 

   (24,25,26)  3 రోజుల అనంతరం కాశీ వదల బోయే ముందు విశ్వేశ్వరుని, అన్నపూర్ణా దేవిని పునర్దర్శించుకొని భక్తుల భోజన సౌకర్యం నిమిత్తం అమ్మకు నావి, భక్తులయివి కలిపి రు .1400/- సమర్పించికొన్నాను. ఉ.8.గం.లకు బయల్దేరి మధ్యాహ్నం 1.30. లకు త్రివేణీసంగమం (అలహాబాద్) (ప్రయాగ రాజ్) చేరాము. కాశీ నుండి అలహాబాద్ కు 120. 9 కి. మీ లు.ప్రయాణ సమయం 2.30. ని. లు.





ఆచట మాకు కేటాయించిన పురోహితులు బాబుగారు . మేమందరం వెంటనే త్రివేణీ  సంగమములో(గంగా, యమునా, సరస్వతీ )  స్నానం చేసి దంపతులము ముందుగా వేణీదాన పూజ(రు.1500), తరువాత  పితృదేవతలకు పిండప్రదానములు(రు.600) చేశాము. వేణీదాన పూజ చాలా ప్రత్యేకతను కలిగి ఉన్నది. ఈ పూజను కేవలము దంపతులు మాత్రమే జీవితంలో ఒకసారి మాత్రమే చేయించుకోవాలి. శాస్త్రోక్తముగా అన్యోన్య అనురాగములను కోరి వివాహ మంత్రసహితముగా(భాషికమును కట్టించుట, ఒకరి కళ్ళ లోనికి మరొకరు చూచుట, వరమాలా ధారణ , వగైరాలు ) పూజ చేయించి, భార్యా భర్తలు పరస్పరము తెలిసో తెలియకో చేసిన తప్పులను మనస్స్ఫూర్తిగా క్షమించుకొనుట యిందు అత్యంత ప్రశంసనీయమైన, జీవితమున మార్పు తెచ్చే ఆచారము. చివరకు భార్య తన భర్త ఒడిలో కూర్చుండగా నతడు ఆమెకు జడవేసి ఆ జడ చివరి వేణి (వెంట్రుకలను)ని  కత్తిరించుతాడు . వెంట్రుకల చివరన,  గోళ్ళ చివరన పాపము నిలచి ఉంటుంది కనుక కత్తిరించిన తరువాత వానిని ముట్టుకోరాదు. అలా ముట్టుకుంటే స్నానం చేయాలి.  స్త్రీ కి 3 రకముల పాపములు వస్తాయట . 1. తల్లి దండ్రుల నుండి  2. రజస్వల సమయమున 3. వివాహ సమయమున . భర్త కత్తిరించిన వెంట్రుకలను భార్య త్రివేణి లో కలుపుతుంది . వెంట్రుకలు మునిగి పోతాయట ఆ నదిలో . 

    ఈ కార్యక్రమం తరువాత అందరం ఎవరి పితృ దేవతలకు వారలము  పితృ తర్పణాలు (32) మంత్ర పూర్వకముగా వదిలాము . భోజనానంతరము సుమారు 3. గం. బయలుదేరి రాత్రి 9. గం.లకి అయోధ్య చేరాము . త్రివేణి సంగమం నుండి అయోధ్యకు సుమారు 167.9 కి. మీ. లు .ప్రయాణ  సమయం . గం .3.54 లు . 

[12/05, 9:21 am] జె జె. యస్: కాశీ కి వెళితే...

కాయో పండో వదిలేయాలి అని పెద్దలు అంటారు.... 

అందులో మర్మమేమిటి అసలు శాస్త్రం లో ఎక్కడ కూడా.. కాశీ కి వెళితే కాయో, పండో వదిలేయాలి అని చెప్పలేదు..శాస్త్రం  చెప్పిన   విషయాన్ని.. కొందరు తెలిసీ తెలియని విషయ పరిజ్ఞానం తో కొంచం వాళ్లకు అనుకూలంగా మార్చు కున్నారు.  కాశీ క్షేత్రం    విషయంలో శాస్త్రము చెప్తున్నది ఏమిటి అంటే... 

కాశీ వెళ్లి గంగ లో స్నానం చేసి "కాయా పేక్ష మరియు ఫలా పేక్ష"  ను గంగలో వదిలి, ఆ విశ్వనాథ దర్శనం చేసుకొని ఎవరి ఇళ్ళకు వాళ్ళు తిరిగి వెళ్ళాలి అని.


ఇక్కడ కాయాపేక్షా,ఫలాపేక్ష అన్నారు...అంటే...ఈ కాయము పై (శరీరము పై అపేక్షని ) ,ఫలా పేక్షా (కర్మ ఫలము పై అపేక్ష ని)పూర్తిగా వదులు కొని...

కేవలం నిజమైన భక్తితో ఆ ఈశ్వర చింతన కలిగి ఉండమని పెద్దలు చెప్పారు. కాలక్రమేణా...అది కాస్తా  కాయ, పండు  గా మారి పోయింది.

అంతే కానీ...  కాశీ వెళ్లి ఇష్టమైన కాయ గూరలు,తిండి పదార్థాలు గంగ లో వదిలేస్తే...మనకు వచ్చు భక్తి కానీ,అందులో నిజమైన పుణ్యం ఎం ఉంటుంది. కనుక.... శాస్త్రం నిజంగా ఎలా చెప్తుందో అర్థం చేసుకొని... ఆ క్షేత్ర దర్శనము,  ఆ సంప్రదాయం పాటిస్తే..నిజమైన ఆధ్యాత్మిక చైతన్యం వస్తుంది...

అంతే కాని మామిడి పండుని,  వంకాయ ని గంగలో వదిలేస్తే వచ్చే ఉపయోగం ఏమి ఉండదు. కనుక...ఈసారి మీరు కాశీ వెళితే....మనకి శత్రువులు అయిన ఈ శరీరం పై ఎక్కువ ప్రేమని, మనం చేసే కర్మల మీద లేనిపోని కర్మఫలం అపేక్ష ని మాత్రమే వదులుకొని....ఆ విశ్వనాథ దర్శనం చేసి, 

నిజమైన ఆధ్యాత్మిక జ్ఞానం కలగాలి అని ప్రార్దిదాం.

[12/05, 10:17 am] P.Suryanarayana Rao: ఇది బాగున్నది. కాని ఇష్టమైన కాయను పండును వదలటం కూడ ఒక రకంగా సమర్ధనీయమేనేమో! మనంతట మనం ఏ కోరికలను చంపుకోలేము. ఏదో ఒక కారణం కావాలి. కాశీలో వదలటం అంటే కాయలు పండ్లను గంగలో కలపటం కాదు. త్యాగ గుణమును, పెంచుకొనుచు మమకారములను ఒకొక్కదానిని వదలుకోవటం. ప్రతి వ్యక్తికి కాయము, ఫలితము మీద ఎంతో కోరిక. ఆ కోరికను వదలుకోటానికిది బహుశః సోపానమౌతుందనుకుంటాను. ఎన్ని మారులు కాశీ వెళ్ళి వచ్చినా త్యాగ గుణం అలవాటు కాకపోతే చార్జీలు ఎనర్జీ దండుగే.  అందులో ఈ వదలివేయుమని చెప్పే ఘటన మనం పితృకార్యాలు చేసేటప్పుడు వస్తుంది. నిజంగా మనం అచట పితృకార్యాలు చేయించే పండాలను , వారి వాచకమును, కొందరి దౌర్జన్యాలను సహించలేము. అచటి స్థలప్రాధాన్యతను దృష్టిలో నుంచుకొని మాత్రమే భరిస్తాము. ఇది నా వ్యక్తిగత అభిప్రాయం. నీతో పంచుకోవాలని పంచుకుంటున్నాను. మొన్నటి కాశీ యాత్రలో త్రివేణీ సంగమ తీరంలో జరిగిన "వేణీ దానం" ఒక ప్రత్యేక అనుభూతిని కలిగించినది. మరొకటి నా వృద్ధ స్నేహితుని భార్యకు నేను (రిక్థిన్..ఋణదాతకు తర్పణము వదలుట, కులభేద రహితముగా) తర్పణము వదలుట జరిగింది. "ఇది మీకు అయాచితముగా లభించిన పుణ్య విశేషమని"అచటి కార్యక్రమాలు చేయించే పండితులు చెప్పారు. చాల ఆనందం కలిగినది.  మనం పితృ ఋణం తీర్చుకొనుట బాధ్యత, అనివార్య కర్తవ్యం. కాని ఇతరులకు చేయుటే పుణ్యమని భావించాను. నా వృద్ధ స్నేహితుని(గతంలో మాతో కాశీయాత్రకు వచ్చిన నాయీబ్రాహ్మణ పండితుడు, పండితాభిమాని)కోరిక మేరకు కాశీయాత్రా విశేషాలు ప్రింట్ తీయించి పంపాను. గుర్తుకు వచ్చిన అంశాలన్నీ నీతో ఆనందంగా పంచుకొన్నాను. 🙏🌹🙏

    అయోధ్య. : 27 రాత్రికి అయోధ్య చేరాము. 28.03.22 అయోధ్య లో .. 

 దీనికి సాకేత పురం అని కూడా పేరు ఉన్నది. ఇది ఉత్తర ప్రదేశ్ లోని ఫైజాబాద్ జిల్లాను ఆనుకొని 6. కి. మీ . దూరం లో సముద్ర మట్టానికి 305 అడుగుల ఎత్తులో ఉన్నది. ఇది కోసల రాజ్యానికి రాజధాని . మనువు ఈ నగరాన్ని స్థాపించినట్లు తెలుస్తున్నది. అధర్వణ వేదం ఈ నగరాన్ని దేవ నిర్మిత స్వర్గ మని పేర్కొన్నది. తమిళ కవి కంబర్ తన కమ్బ రామాయణం లో, తులసీదాస్ తన రామ చరిత మానస లో , తమిళ వైష్ణవ భక్తులైన ఆళ్వారులు తమ రచనలలో అయోధ్యను మనోరంజకముగా శ్లాఘించారు. యోధులకు లొంగనిదే అయోధ్య . టిఫిన్ చేసి మాకు కేటాయించిన హోటల్  గదులలో ఆ రాత్రికి విశ్రాంతి తీసికొని 28.03.22  ఉ. 5 గం.లకు లేచి స్నానంచేసి, సరయూ నదికి స్నానానికి వెళ్ళాము. ఈ నది ఉత్తరాఖండ్ లో పుట్టి ఉత్తరప్రదేశ్ గుండా ప్రవహించే నది. గంగానదికి,శారదానదికి  ఉపనది. దీనిని గోగ్రా నది అని కూడా అంటారు. వేదాలలో, రామాయణంలో ఈ నది ప్రస్తావన ఉన్నది. అయోధ్యా పట్టణాన్ని ఆనుకొని ప్రవహిస్తుంది. ఈ నదిలోనే శ్రీరామ లక్ష్మణులు మునిగి అవతారాలు చాలించారని నమ్ముతారు. ఇది బీహార్ లోనే రావెల్గంజ్  వద్ద గంగా నదిలో కలుస్తుంది. అయోధ్యా నగరం లో రోడ్లు తప్ప మిగిలిన ప్రదేశమంతా భక్తుల పట్ల కరుణా సముద్రుడైన రామహృదయము  వలె మెత్తని యిసుక కనబడినది. ఇత: పూర్వము నేనిలాంటి యిసుక ఎక్కడను చూడలేదు . సరయూ నది స్నానా నంతరము రామ మందిర నిర్మాణమునకు సన్నాహం చేస్తున్న, డిజైన్లు చెక్కబడిన , రామ నామం వివిధ భాషలలో వ్రాయబడిన శిలలు చూచాము. అవి చూస్తున్నంత సేపు మా మనసులు ఒక నిర్ణయానికి వచ్చేశాయి. తప్పక సంపూర్ణముగా రామ మందిరం పూర్తి అయిన తరువాత తప్పక వచ్చి చూడాలని . అయోధ్య రాముడు పుట్టిన ప్రదేశం కనుక నిరంతరం రామనామమ్   మన మనసులను ఆవరించి మరొక ఆలోచన రానీయదు.  ఎందుకంటే రామ శబ్దం లోనే ఆ గొప్పతనం ఉన్నది. రమయతే యితి రామః అనగా అందరి(శత్రువుల) మనములను రమించువాడే రాముడు . పెద్ద హనుమాన్ ఆలయము చూచాము . అందులో రామ కృష్ణ , అవతారాల విశేషాలు యానిమేషన్ తో ఉన్నాయి. కొండపైన ఉన్న మరొక పెద్ద హనుమాన్ ని కూడా చూచాము . చివరకు ఎన్నో సంవత్సరాలుగా రామ భక్తులు పోరాడి గెలిచిన స్థలం, రామ బాలాలయం , దర్శించాము . మహమ్మదీయుల పాలనలో హిందూ దేవాలయాలు సర్వ నాశనం చేయబడ్డాయి. మతమ్  అంటే అందరికీ సమ్మతం గా ఉండాలి . పరమత విద్వేషం కూడని పని. మన ఖర్మ కొద్ది మహమ్మదీయుల పాలన , అందులో కొందరు ఉత్తములున్న , మరి కొందరు మత పిచ్చి తో పరమత సంప్రదాయాలను చులకనగా చూచుట, మాట్లాడుట చేస్తారు. అందులో ముఖ్యం గా ముందు వరుసలో ఉండేది మహమ్మదీయులు, క్రైస్తవులు . మన రామాలయమును పడగొట్టి నామ రూపాయలు పైకి కనబడనీయకుండా బాబరు తన పరి పాలనలో మసీదు కట్టించాడు .  మసీదు క్రింద రామాలయం ఉన్నది అని తెలిసిన రామ భక్తులు మసీదు దగ్గరే కొంత భాగం లో రామ పూజలు చేసేవారట. కాలక్రమం లో రామ మందిరం మా దేనని వివాదం పెరిగి ఒక సుముహూర్తమున మసీదును కూల్చివేశారు . ఆ స్థలమును ప్రభుత్వ పురాతత్వ శాఖ వారు త్రవ్వి అచ్చట దొరికిన హిందూ దేవతల శిలా శకలాలు, శాసనాలు నిశితముగా పరిశీలించి యిచట రామ మందిరం ఉన్నదని నిర్ధారణ చేశారు. హిందువులు అది మాదే కనుక  మాకు యివ్వ వలసినదని  సుప్రీం కోర్టుకు సాక్ష్యాలు సమర్పించారు. చిట్ట చివరకు ఒక అంధుడు , వేద వేదాంగ పారీణుడు సరయూ నది కి యిన్ని కిలోమీటర్ల దూరం లో రామ మందిరం ఉన్నది అన్న సంగతి ఫలానా ఉపనిషత్తులలో ఉన్నదని చెప్పగా , దానిని జడ్జీ గారు తెప్పించుకొని విషయము గ్రహించి , యిచ్చట రామ మందిరం ఉన్నదని , ఈ ప్రదేశం 2.77 సెంట్లు  హిందువులకి చెల్లుతుందని, మహమ్మదీయులు వేరొక చోట మసీదు కట్టుకోవాలని 5. ఎకరాల భూమిని వారికి కేటాయించారు, నవంబరు 9 , 2019 లో . దానితో సమస్య కొంతవరకు పరిష్కారమైనట్లే అని భావించ వచ్చును. ఆ ప్రదేశం లోనే ఈనాడు రాముని బాలాలయం ఏర్పాటు చేశారు. భీకరమైన మిలటరీ బందోబస్తు ఉన్నది అడుగడుగునా. సీ. సీ . కెమెరాలు ఉన్నవి . మనం ఆలయం చూడటానికి వెళ్లాలంటే ఆధార్ కార్డ్, తప్పక చూపాలి. డబ్బులు, ఏ, టి, యం.  కార్డులు, తీసికొని వెళ్ళవచ్చు. కలము , పుస్తకాలు,మందులు , మంచినీరు  వంటివి తీసికొని వెళ్లరాదు. పొరపాటున తీసికొని వెళ్ళిన సెక్యూరిటీ దగ్గర పడవేయాల్సిందే.  చెప్పులతో లోనికి వెళ్ళ వచ్చును . ఆలయ పరిసర ప్రాంతమంతా ..   

 అంతా రామమయం , యీజగమంతా  రామమయం, అంతరంగమున ఆత్మారాముడు , అనంత రూపముల వింతలు సలుపగ, సోమ సూర్యులును సురలు తారలు ను, ఆ మహాంబుధులు అవనీజంబులు , అండామ్డంబులు పిండామ్డంబులు, బ్రహ్మాండంబులు బ్రహ్మలు మొదలుగ. నదులు వనమ్బులు, నానా మృగములు, విహిత కర్మములు వేద శాస్త్రములు,     అంతా రామమయం ఈ జగమంతా రామమయం గా కనబడుతుంది. రామ భక్తులకు . 

   అయోధ్య లోని ప్రత్యణువు శ్రీ రామ పాద స్పర్శతో పునీతమైనది. నామ స్మరణతో ప్రతి జీవి పులకరించినది. రామో విగ్రహవాన్ ధర్మః , సత్య పరాక్రమః అనునట్లు మూర్తీభవించిన సత్య స్వరూపుడు పాలించిన పుణ్య స్థలం . సామాన్య మానవావతారం లో కష్ట సుఖములు సమానముగా ననుభవించిన ఆదర్శమూర్తి . లక్ష్మీదేవి సామాన్య స్త్రీ మూర్తి వలె అనేక కష్ట సుఖముల  ననుభవించిన పతివ్రతా లాలామ. సమస్త కుటుంబ బంధాలకు ఆలవాలమైనది రామ పరివారం. సీతా రాముల అన్యోన్య దాంపత్యం ఎంతో ఆదర్శ ప్రాయమైనది.    రామాలయ దర్శనానంతరం వాల్మీకి,  కుశలవుల ఆలయము చూచిన తరువాత టిఫిన్ చేసి హోటల్ రూమ్స్ కి వెళ్ళి మధ్యాహ్న భోజనం చేసి సుమారు 2 గం. లకు బయల్దేరి అయోధ్యా పునర్దర్శన ప్రాప్తి రస్తూ ! అనుకొంటూ 28.03.22 రాత్రికి సుమారు 8 గం . ల కు  నైమిశారణ్యం లోని సాయి బాబా ఆశ్రమం చేరాము. 

29.03.22. నైమిశారణ్యం : 

    నైమిశారణ్యం ఉత్తరప్రదేశ్ సీతాపూర్ జిల్లాలోని లక్నో కు 94 కి. మీ దూరం లో ఉంది. గోమతీ నదీ ప్రాంతం లో వేలాది సాధువులు తపమాచరించారు. ఇక్కడే వేదవ్యాసుడు మహాభారత రచన చేశాడట. . సూతుడు శౌనకాది మహర్షులకు అష్టా దశ పురాణాలు వినిపించాడట. మునుల కోరిక మేరకు బ్రహ్మ ఒక పవిత్ర ప్రదేశమును నిర్ణయించదలచి దర్భ చక్రమును విడచి అది విరిగి ఎచ్చట పడునో అదే మీ తపోభూమి అని సెలవిచ్చెను. ఆ చక్రము పడినదే నైమిశారణ్యము. నిమి అనగా బండి చక్రపు కమ్మి, నేమి పేరుతో ఆచటి అరణ్యము నైమిశారణ్యం అయినది. చక్రం పడి విరిగిపోయిన చోట జాలం ఉద్భవించి లింగాకృతిలో పొంగి పొరలుతుంది. మహా శక్తి ఆ ప్రవాహాన్ని ఆపుతుంది. ఆ పవిత్ర ప్రాంతం శక్తి పీఠం గా రూపొంది లింగధారిణి శక్తి రూపం అయిన లలితాదేవి ఆలయం గా పేరొందింది . చక్రం ఆగిన ప్రదేశం చక్రతీర్థం అయినది . వరాహ పురాణ ప్రకారం .. శ్రీ మహా విష్ణువు నిమి కాలం లో అనగా లిప్త (కన్ను మూసి తెరిచే)  కాలంలో రాక్షస సంహారం చేశాడు ఈ అరణ్యం లో . అందువలన ఈ పేరు వచ్చిందంటారు. 9 తపోవనాలలో నిది ఒకటి ప్రసిద్ధి చెందినది . ఇక్కడకు 9 కి. మీ దూరంలో దధీచి కుండం ఉన్నది. శ్రీరాముడు అశ్వమేథ యాగం చేసి లవ కుశులను కలసికొన్నది యిచటనే . సీతాదేవి పేర రాముడు దానం చేసిన గ్రామమే సీతాపురం .     

ఈ రోజు ఉ. గోమతి నదీస్నానం, అనంతరం చక్రతీర్ధ స్నానం. తరువాత సామూహిక సత్యనారాయణ స్వామి వ్రతం. భోజనా నంతరం విశ్రాంతి . మధ్యాహ్నం 2 గం. ల కి లలితా దేవి శక్తి పీఠం , బాలాజి ఆలయం, వ్యాస గడి , శూత గడి , హనుమాన్ గడి,పంచ ప్రయాగ , శంకర మందిరాలు , వట వృక్షం, సీతా రామాలయం,   రుద్రావర్తం ,(రుద్ర కుండం) చూచాము. ఈ కుండం లో బిల్వ పత్రం, పాలు  మునిగి పోతాయి . అరటి పండు 4 భాగాలు చేసి వేస్తే మనకు ప్రసాదం గ కొన్ని ముక్కలు తేలుతాయి . నేను వేసిన అరటి పండు 4 ముక్కలలో 2 నాకు ప్రసాదంగా తేలినవి. అలాంటి అరటి పండే మా అక్కగారు  4 ముక్కలు వేస్తే ప్రసాదంగా 3 తేలినవి .  నేను గతంలో గయలో వదలినవి అరటిపండు, చేమ కూర, మోదుగు ఆకుల విస్తరి. ఇచట ప్రసాదంగా అరటి పండు వచ్చింది కనుక నేను తినవచ్చునా ? అని పంతులు గారిని అడుగగా యిక్కడ ఆ పట్టింపు ఉండదు. శివాలయం లో తినకండి అని చెప్పారు. దానిలో మిగిలయిన కమల , ద్రాక్ష పండ్లు శివాలయం లో సమర్పించాము.  నైమిశారణ్యం లో చలి చాలా ఎక్కువ. నాకు జలుబు చేసి ఉన్న కారణం గా గోమతీ నదీ స్నానం , చక్రతీర్థ స్నానం విరమించుకొని జలములను పైన చల్లుకొన్నాను. అందరూ యాత్రను చాలా ఆనందంగా అనుభవించారు. 29.03.22 రాత్రికి అచ్చటనే విశ్రాంతి తీసికొని 30.03.22 . ఉ . 7. గం లకు కాన్పూర్ రైల్ వే స్టేషన్ కు బయలు దేరాము.

 30.03.22.  

 ట్రైన్ ( గోరఖ్ పూర్ ఎక్స్ ప్రెస్ ) మధ్యాహ్నం 1.40. సరైన సమయం . కానీ ఆ రోజు గం 5.30. లు ఆలస్యం గా నడిచింది. మేము ఆ రోజు రాత్రి 9. గం .లకు కాచిగూడ   చేరుకున్నాము.  ఇవి నా అనుభవాలు . కాశీ యాత్ర సుఖాంతం. పునర్ దర్శన ప్రాప్తి రస్తు ! 

మేము యాత్ర ముగించుకొని వచ్చిన తరువాత గంగాపూజ.



2. రామేశ్వర యాత్ర. ది.21.09.22.







ఎంతో కాలంగా ఉన్న సంకల్పం ఈనాటికి (21.09.22)నెరవేరింది. సికింద్రాబాద్ లో సాయంత్రం 6.00గం
 లకు బయలుదేర వలసిన "చార్మినార్ ఎక్స్ప్రెస్ (12760 ) షుమారు 3గం. ఆలస్యంగా రా.9.గం.లకు బయలుదేరి
నవమాసాలు నిండిన ప్రథమ గర్భిణి వలె నడచి మరుసటిరోజు (22.09.22) మధ్యాహ్నం 11గం.,కు చెన్నై    ఎగ్మూర్ స్టేషన్ కు చేరింది. ఈరోజు ఉదయం టిఫిన్, కాఫీల ను సూళ్ళూరుపేట‌లో ఎక్కిన మా మరదలు సీత, స్పాన్సర్ చేసింది. మేమందరం( పొన్నెకంటి సూర్యనారాయణ రావు. ఇందిరాదేవి. .సీత, వఝ బుచ్చిరాజు, రాణి, భగవతి,సారథి,రమణి, మాధురి, సబిత, హేమ, శివకుమారి. )మందిమి ఉన్నాము.  
    చెన్నై వరకు ఒక్కొకరికి పోను,రాను రైల్వే టికెట్స్ (₹2,200.) రిజర్వేషన్ చేయించుకున్నాము. ఆర్.వి. ట్రావెల్స్ హైదరాబాద్ వారి సహాయం తీసుకున్నాము. హోటల్ , భోజనం, ప్రయాణం సౌకర్యం నిమిత్తం ఒక్కొకరికి ₹15,500/- తీసుకున్నారు. డ్రైవర్  "అనీఫా" చెన్నై ఎగ్మూర్ స్టేషన్ లో చక్కని గులాబీ ల బొకేతో మాకు ఆప్యాయంగా స్వాగతం పలికాడు. మంచి సంప్రదాయం. అందరం  వాను ఎక్కిన తరువాత భోజనాని ఎగ్మూర్ లోని "ఆనంద్ భవన్"కు తీసుకుని వెళ్ళాడు. భోజనం బాగుంది. ఈనాటి భోజనాల ను మాధురి స్పాన్సర్ చేసింది గురువారం సాయిబాబా పూజ సందర్భంగా. మధ్యాహ్నం 12.గం.లకు రామేశ్వరం  బయలుదేరాము. చెన్నై ఎగ్మూర్ నుండి రామేశ్వరం షుమారు 570.కి.మీ. దూరంలో ఉంది. బస్సు ప్రయాణం షుమారు 10 గం.లు పడుతుంది. 22 రాత్రి రామేశ్వరంలో ఆర్.వి.ట్రావెల్స్ వారు ఏర్పాటు చేసిన హోటల్లో బసచేసి ఉదయాన్నే స్నానాలు, దర్శనాలు . 
   23.09.22 ఉ.5.00 గం.లకు హోటల్ లో స్నానానంతరం  స్థానిక పూజారి సూచన మేరకు రామేశ్వరుని దేవాలయ పడమటి ద్వారం సమీపాన ఉన్న, సముద్ర స్నానం మరియు 21 బావుల స్నానాలను  "ఓం నమశ్శివాయ" నామ జపంతో పూర్తిచేశాము. ఒక్కొకరికి 22 బావుల స్నానం,(సముద్రస్నానంతోకలిపి) రామేశ్వర స్వామి దర్శనం, గంగాజలాభిషేకం చేయించుటకు  రు.650/-లు.  సముద్ర స్నానానంతరం కాశీ గంగలో కలుపు నిమిత్తం సముద్రంలోని ఇసుకను కొంత సేకరించాము.
(ముందుగా మనం కాశీ వెళ్ళి గంగను తెచ్చి,  రామేశ్వరం వెళ్ళి ఆ గంగను రామేశ్వరునకు అభిషేచనంచేసి, రామేశ్వరం సముద్రంలో, ధనుష్కోడి దగ్గర ఇసుకను సేకరించి దానిని వీలైనంత త్వరగా గంగలో కలపాలట. అప్పుడే మనకు సంపూర్ణంగా కాశీయాత్రాఫలితం దక్కుతుందని పెద్దలు చెబుతారు. ) 
     ఇందులో విశేషమేమంటే కొన్ని బావులలో నీరు తియ్యగా  ఉన్నాయి. అనంతరం దుస్తులు మార్చుకొని కాశీనుండి తెచ్చిన గంగాజలం రామేశ్వరుని కి ( సైకతలింగానికి) అభిషేకం చేసి  అచటి నుండి హనుమ తెచ్చిన శివలింగానికి నమస్కరించి ఆటోలో హోటల్ కు చేరాము.  టిఫిన్ చేసి అచటికి 20కి.మీ.దూరాన ఉన్న "ధనుష్కోడి"కి వెళ్ళి వచ్చాము. అక్కడ కూడ కాశీ గంగలో కలిపే నిమిత్తం కొంత ఇసుక సేకరించాము. అందరం వివిధ భంగిమలలో ఫొటోలు తీసుకొని చక్కని ఆనందాన్ని పంచుకొన్నాము. ధనుష్కోడి నుండి శ్రీలంక కు సముద్రయానంగా 10మైళ్ళ దూరమట. రామేశ్వరుని దేవాలయమును దక్షిణాదిన ఉన్న అతి పెద్ద దేవాలయములలో ఒకటి.  10. వ. శతాబ్దానికి చెందిన శ్రీలంక రాజు ‘‘పరాక్రమబాహు’’ కట్టించాడట. శ్రీ శంకరాచార్యుల వారు చెప్పిన బడా చార్ ధామ్ లలో రామేశ్వరమొకటే శైవ క్షేత్రము. మిగిలిన 3 వైష్ణవ క్షేత్రాలు. ( 1.పూరి జగన్నాథ్. 2. ద్వారకానాథ్. 3. బదరీనాథ్) బ్రాహ్మణుడైన రావణుని రాముడు చంపిన కారణముగా తనకు బ్రహ్మహత్యా దోషము వచ్చినదని దానిని తొలగించుకొనుటకై శివలింగ ప్రతిష్ఠ చేశాడని చెబుతారు. ఇచట రెండు శివలింగాలకు ఆయన ప్రతిష్ఠ చేశారు. ఒకటి సీతాదేవి తయారుచేసిన సైకతలింగము, రెండవది హనుమ తెచ్చిన  విశ్వలింగము.  హనుమ విశ్వలింగము తెచ్చుట కొంత ఆలశ్యమైన కారణముగా రాములవారు సీతామాత తయారుచేసిన సైకతలింగమును ముందుగా ప్రతిష్టించారట. తరువాత హనుమ తెచ్చిన విశ్వలింగము ప్రతిష్ఠించారట.  మూడవది శంకరాచార్య ప్రతిష్ఠిత స్షటిక లింగము. ఈ స్షటికలింగ దర్శనమును ఉదయమే చేస్తారట. దీనిని మణి, లేక ధూళి దర్శనమని అంటారు.  ఇచటి అమ్మవారు‘‘విశాలాక్షి’’. పంచ మాధవ క్షేత్రాలలో ఒకటైన ‘‘ సేతుమాధవ క్షేత్రం ఇక్కడున్నది. రామేశ్వరుని దర్శించిన తరువాత మరి జన్మలో యే యితర శివాలయములను దర్శించుట, కార్తిక మాస ఉపవాసములు వగైరాలు అక్కరలేదని పెద్దలు చెబుతారు. ఇచట రామపాదాలు, విభీషణాలయము, సేతు నిర్మాణమునకుపయోగించిన రాళ్ళు , హనుమ మొదట అడుగు మోపి లంకకు ప్రయాణమైన కొండ చూడవచ్చును. నీటిలో తేలే రాయి ఒక్కొకటి షుమారు 15 కిలోల బరువుంటాయట. అయినా అవి నీటిలో తేలుతాయట. రామసేతువును నిర్మించిన ఆనాటి ఇంజనీరు‘‘నీలుడు’’.  ధనుష్కోడి నుండి తలైమన్నారు వరకు సేతునిర్మాణం జరిగినదట. ఈ క్రింది చిత్రాలు ధనుష్కోడి లోనివే. 









 మన మాజీ రాష్ట్రపతి, గొప్ప ఖగోళ శాస్త్రవేత్త అయిన  "అబ్దుల్ కలామ్ గారి పుట్టినిల్లే ఇది. ఆయన  సొంత యింటిలో ఏర్పాటు చేసిన, ముత్యాలు, పగడాలు వగైరాలున్న షాపులో కొన్ని వస్తువులు కొనుగోలు చేసి మరల హోటల్ కు వచ్చి భోజనం చేసి "కన్యాకుమారి"కి బయలుదేరాము. ఇచటి నుండి కన్యాకుమారి 309.1కి.మీ దూరంలో ఉంది. సమయం 5.42 ని.లు పడుతుంది. 23రాత్రికి అచటే బస.

 రామేశ్వరానికి కొద్ది దూరంలోనే "పంబన్"బ్రిడ్జి ఉన్నది. దీనికొక ప్రత్యేకత ఉన్నది. పెద్ద పెద్ద ఓడలు ప్రయాణం చేసేటప్పుడు ఆటోమేటిక్ గా పైకి ఓపెన్ అయి వాటికి దారి యిస్తుంది.

 23 రాత్రి కన్యాకుమారి లో బసచేసి 

24 ఉ.5కి లేచి సముద్రంలో సూర్యోదయం చూచి మరల హోటల్ కు వచ్చి టిఫిన్ చేసి మరల స్వామి వివేకానంద రాక్ కు వెళ్ళి, ఆయన ధ్యానమందిరం చూచి కొంతసేపు ధ్యానంచేసి మరల ఓడలో తిరిగి వచ్చి , కన్యాకుమారి అమ్మను దర్శించుకొన్నాము.  (మనమీనాడు ఓడలో వెళ్ళిన దూరం వివేకానందుడు ప్రతిరోజు ఈదుకుంటు వెళ్ళి ఒక పెద్ద రాతి మీద ప్రశాంతంగా ధ్యానం చేసుకొని వచ్చేవాడట.)









 ఆమె ముక్కు ముంగెరకున్న రత్న కాంతి పుంజములకు ఆనాడు ప్రయాణిస్తున్న ఓడలన్ని ఆకర్షింపబడి ఒకదానికొకటి కొట్టుకొని ప్రమాదంలో జనం మరణిస్తూ ఉండేవారట. కొంతకాలానికి దీనిని గమనించి భక్తులు ఆ రత్నాన్ని సమయానుకూలంగా తీసి మరల పెడుతున్నారట.  మధ్యాహ్నం 12 గం.లకు మధురై కి (244.4కి.మీ. 3.42.ని.లు.) బయలుదేరాము. 
సా. 6.00గం. లకు మధురై చేరిన వెంటనే ఒక గైడ్ ను మాట్లాడుకుని మీనాక్షి , సుందరేశ్వరులను దర్శించుకున్నాము. చాల గొప్ప చరిత్ర కలిగిన దేవాలయము మీనాక్షీ ఆలయము. 



ఇది పాండ్యరాజుల 64 తరాలనాటి ఆలయము. పాండ్యరాజు పుత్రులకై యజ్ఞము చేయగా ఫలితంగా పార్వతీదేవి  మీనాక్షి రూపంలో 3 స్ధనములతో జన్మించినదట. ఈ స్థితికి చింతజెందియుండ అశరీరవాణి  "ఈ బిడ్డ యుక్త వయస్సు వచ్చాక ఎవరిని చూచి సిగ్గుపడుతుందో వారితో వివాహమౌతుంది; మూడవ స్థనము అపుడే అదృశ్యం అవుతుందని చెప్పారట. మీనాక్షి కి తండ్రి సమస్త విద్యలు నేర్పి మగపిల్లవానిలా పెంచుతు రాజ్యపట్టాభిషేకం చేశాడు. పరిపాలన చేస్తున్న కాలంలో యోగంతో కైలాసం వెళ్ళిందట.  యుక్తవయస్సులో ఉన్న అమ్మకు  సుందరేశ్వరుని( శివుని) దర్శనమై  సిగ్గపడుట ఆయననే వివాహం చేసికొనుట, సుబ్రహ్మణ్యస్వామి అంశతో "ఉగ్రపాండ్యన్" జన్మించి పాలనచేసినట్లు చరిత్ర. మీనములవంటి అక్షములు(కన్నులు) కలది కనుకనే మీనాక్షి అయినది. మీనములు ఎలాగైతే తమకు దూరంగా ఉన్న గ్రుడ్లను చూపులతోనే పొదిగి కావలసిన ఆహారాన్ని ఇస్తుందో అలాగే అమ్మ తన భక్తులను చూపులతోనే కరుణించి పాలిస్తుంది. అమ్మ కరుణకొక యథార్ధ సంఘటన. ఆనాడు "రోస్ పీటర్" అను నాస్తికుడు, సనాతన ధర్మవ్యతిరేకి, అమ్మను నిత్యం నిందించేవాడు  మధురకు పాలకుడు. కరుణామయి కనుక అమ్మ ఆతనికి కలలో కనిపించి "నీవుండే బంగళామీద కొద్ది సేపట్లో పిడుగు పడబోతున్నది, దూరంగా వెళ్ళు" అని చెప్పగా ఆయన బయటకు వచ్చి నిలబడి చూచాడు. కంటికెదురుగానే బంగళా భస్మం అయింది. ఆయన మహా భక్తుడై కొన్ని లక్షల విలువైన ఆభరణాలు చేయించాడట. ఈ ఆలయం సహస్రారం వంటి ప్రదేశము. మంటపంలో 7రాణులతో కూడిన ఒక రాజుగారి విగ్రహం ఉన్నది. ఆయనే "తిరుమల నాయకన్ మూర్తి". "సుమనతీర ఆచార్య" శిల్పి. ఆరుగురు రాణుల విగ్రహాలు, రాజు విగ్రహం అందంగా చెక్కాడు. 7 వది పట్టపురాణి విగ్రహం చెక్కేటప్పుడు ఆమె మోకాలిమీద చిన్న పెచ్చు లేచిందట. ఎంత ప్రయత్నించినా సరికాలేదట. బాధపడుతు ఈవిషయాన్ని మంత్రి మహాభక్తుడైన " నీలకంఠ దీక్షితుల"దగ్రకు వెళ్ళి చెప్పగా ధ్యానంలో విషయం గ్రహించి "పట్టపురాణి మోకాలిపై పుట్టుమచ్చ ఉన్నదని, ఇది ఉత్తమజాతి స్త్రీ లక్షణమని, అందుకే ఆస్థానంలో నీవేమిచేసిన సరికాదని, అలాగే ఉంచుమని "చెప్పారు. రాజు గారు వచ్చి చూచి మహారాణి మోకాలిమీద అలా పెచ్చు ఊడినదేమని అడిగారట. రాణీగారికచట పుట్టమచ్చ ఉన్నదని చెబితే నీకెలా తెలుసని తలతీస్తారు. అందుకని మంత్రిగారు యనకు చెప్పినట్లే చెప్పాడు. రాజుగారు కొంతసేపటికి "మంత్రిగారిని బంధించి తీసికొనిరండి "అని భటులను పంపగా వారు దీక్షితులవారు అమ్మవారికి హారతి ఇచ్చేసమయంలో వచ్చారు. మంత్రిగారికి విషయం అర్ధమై, రాజు ఎలాగు తన కన్నులను తీసివేయించుతాడని నిర్ణయించుకొని హారతితో కన్నులు పోగొట్టుకుంటాడు. భటులకు " రాజుగారు తనను ఏమి చేయదలచుకున్నాడో నేనదే చేశానని చెప్పండి"అని చెబుతాడు. మహారాజునకీ విషయంచెప్పగా రాజు " మంత్రిగారు  మహా భక్తుడు కనుక నా ఆలోచనను ఎలా తెలుసుకున్నాడో నా భార్య పుట్టుమచ్చను కూడ అలాగే తెలిసికొని ఉంటాడ"ని గ్రహించి పశ్చాత్తాప పడి "స్వామీ నన్నుమన్నించండి. మీ భక్తిని శక్తిని గమనించలేకపోయాను. మరల మీరు కన్నులు తెప్పించుకోండి" అని పాదములపై పడగా అపుడు మంత్రిగారు "ఆనందసాగర వర్ణన"చేస్తున్నారు. వర్ణన పాదముల వరకు వచ్చింది. దీనిని చెబుతుంటే ఎవరో వ్రాస్తున్నారు. ఒక శ్లోకంలో "అమ్మా!నీవు గొప్పదానివి. నీ పాదాలు తెచ్చి నా ముందుపెట్టినా చూడలేని గ్రుడ్డివాడిని. చూడలేను. నా కన్నులు కాలిపోయినవి."అని అనగానే కన్నులు వచ్చినవట. అంతట రాజు మంత్రే కాక అందరు సంతోషించారట. ఆలయంలోని కోనేరులో పద్మాలను దేవేంద్రుడు ప్రతిష్టించాడట. నిర్మాణం పద్మాకారములో ఉన్నదట. తూర్పున రెండు గాలి గోపురములు, దక్షిణమున ఒకటి, పడమర ఒకటి ఉత్తరమున ఒకటి. మొత్తము 5 గోపురములు "నమశ్శివాయ" అను పంచాక్షరీ మంత్ర స్మరణ సంకేతంగా ఉన్నాయట. ఆలయంలో గల మీనాక్షీ సుందరేశ్వరులు   వారి వివాహానంతరం నాట్యం చేస్తున్నప్పుడు,  అమ్మవారి కర్ణాభరణము క్రింద పడగా అయ్యవారు  తన కాలితో పైకి తీస్తున్నట్లు చెక్కిన శిల్పం, కోపంతో ఉన్న అమ్మవారి శిల్పం  మహాద్భుతం, అమర శిల్పులకే సాధ్యం. పార్వతీ పరమేశ్వరుల దాంపత్యం మానవుల వైవాహిక జీవనానికాదర్శప్రాయం అని సూచించే అచటి శిల్పాలు అద్వితీయాలు. 

30.06.17..ఉ.7.05.కి తెలంగాణ ఎక్స్ ప్రెస్ ఎక్కాము.

01.07.17. ఉ.10 కి. న్యూ ఢిల్లీ. (హోటల్..బాబా రెష్టారెన్ట్)2.౦7.17. బిర్లామమందిర్, ఇండియా గేట్, పార్లమెంటు,ఇందిరా గాంధీ భవన్,కుతుబ్ మినార్,లోటస్ పాండ్,గాంధీజీ ఘాట్,కురుక్షేత్ర్ లో రాత్రకి బస

3.06.17. కురుక్షేత్రం. లోకల్. ఘటోత్కచుని కుమారుడు బింకిని., బాణగంగ.(భీష్ముని అంపశయ్య)

         ** కురుక్షేత్రం గురించి.**

  గీతాచార్యుని నిలయము
  ప్రాతః స్మరణీయమైన ప్రాంతమునంతా
  చూతము రారండిబుధులు
  చేతమ్మున భక్తినింపి క్షేత్రమ్మునకున్.

 భోజనానంతరం 3.గం.లకు. బయలుదేరి అమృత సర్ చేరాము.(హోటల్ ..ఆర్.వి.రెష్టారెన్ట్)

                      **గోల్డెన్ టెంపుల్ గూర్చి.**

      శిక్కులదేవాలయమది
      అక్కజమౌస్వర్ణమయము హ్లాదముగూర్చెన్.
      మిక్కుటమౌఆజ్యమిళిత
      చక్కని పసదనముదొరికెసంతసమొప్పన్.
   శిక్కులపవిత్ర గ్రంథము
   నిక్కపుభక్తిన్జదువుగ నేనటుగంటిన్భఘృ
   అక్కడి సద్గురువర్యుల
   అక్కరుణామూర్తులకివె అంజలులార్యా!
          ధైర్య సాహసాలు తమసొంతమనురీతి
         చిన్నపెద్ధవృద్ధ చేతులందు
         ఛురికలుండెమనకు చోద్యమలర.
         భరతమాత పుత్ర భవ్యచరిత!

5.07.17. కాట్రా. ఇక్కడికి 18కి.మీ. వైష్ణవోదేవి ఆలయం.పూర్తి. 6.07.17.ఈరోజు శ్రీనగర్ ప్రయాణం.ఉదంపూర్ లో 9 కి.మీ.టన్నెల్
7.07.17.శ్రీ నగర హోటల్లో లోకల్ విజిట్. (సరస్వతి స్వయంభువుగా అవతరించినది. అందే హనుమ,శ్రీచక్రము,నెమలి,సింహపాదము కనిపిస్తాయి)
8.07.17. జమ్ము,కాశ్మీర్ కర్ఫ్యూ కారణంగా ఈ హోటల్లో నే ఉన్నాము.

                         3.  ** వైష్ణవీదేవిని గూర్చి.**

   దర్శన భాగ్యమిచ్చెనిట తాత్త్వికరూపిణి వైష్ణవీసతే
   దర్శితనేత్రముల్ మిగుల ధన్యతనందె పవిత్రమై పున
   ర్దర్శనమెప్పుడో యనెడు ధార్మికజీవుల మస్తకంబులన్
   స్పర్శను జేయుచున్ కరము సంతసమిచ్చె కృపాంతరంగయై.

        అమ్మనుజూడగాదలచి ఆర్తుడనై విలపించుచుండ,రా
        రమ్మని సద్దయన్ బిలచి రమ్యకపర్దిని వైష్ణవమ్మయే
        తెమ్మనె నాదుబృందమును తెల్విగకొండకు ప్రాణనాధునిన్
        అమ్మకుమాటయిచ్చిజవనాశ్వమురూపముదాల్చె శంభుడే.

    రాజు నామానబరగెడు రమ్య హయపు
    శిక్షకుడుహమీదనువాడు చెలిమితోడ
    చతుర భాషణాచణుడౌచు సాగివచ్చి
    అమ్మ పాదాల ననుజేర్చె  హ్లాదమొప్ప.

          తాతపేరున బెరిగిన జాతకుండ
          సూర్యనారాయణాఖ్యుండ ‌సూరిబ్రువుడ
          వారినామంపుఫలమేమొ తేరిచూడ
          అశ్వమెక్కెడి యదృష్టమవనికలిగె.

 భైరవరాక్షసుండు నను భర్తగచేకొనుమంచుకాళికన్
 ఘోరతరంబుగాగ కడు కూళత నీచత వెంబడింపగా
 ధీరత రౌద్రరూపమున దిక్కులు సర్వము పిక్కటిల్లగా
 పోరునుసల్పి వానినటు ముచ్చటజేర్చెను కాలుచెంతకున్.

       తప్పు క్షమియింపగల్గిన తరుణిజూచి
       అమ్మ !నాకిటప్రాముఖ్యమమరునట్లు
       వరము నీయుమ కరుణను వాంఛదీర
       యనుచు గోరగ భైరవుననుమతించె.   

  నిన్ను గాంచిన పిదపనే నిశ్చయముగ
  ముక్తి నందును భక్తాళి మోదమలర
  అనుచు వరమిచ్చె ప్రేమతో వైష్ణవమ్మ
  అమ్మతనమును రూపించె నాదిశక్తి.

            **వైష్ణవోదేవి పాట**

  వైష్ణవిమాత వైభవచరిత వరములనీవమ్మా!
  నీపద సన్నిధి జేరినవారిని నెమ్మదిజూడమ్మా!

  మూడు మూర్తుల మోహనరూపివి లక్ష్మీ వాణీ కాళికవు.
  ముల్లోకంబుల భక్తుల బ్రోచెడు కరుణరసాంచిత పాలితవు.॥వై॥
  అష్టలక్ష్మిగా నమ్మినవారిని అందలమిచ్చి కాచెదవు
  నలువరాణిగా కొలిచినవారికి నాలుకపై నడయాడెదవు.   ॥వై ॥
  నామభేదముల నానారీతుల నెలకొనియున్న ఏకరూపివి
  ఎక్కడక్కడచూపుము నాకని పలుకువారికి నిశ్శబ్ద శక్తివి.   ॥వై॥
   బహువిధ మణుల రత్నరాసులను భారీపూజలు చేసినగాని
  శుద్ధభక్తికే పట్టముగట్టెడి సుందరమూర్తివి నీవమ్మా             ॥వై॥

                4 **అమరనాధుని అందాలు**

  శ్రీ అమరనాథుని అందమునంతా చూతమురారండి
  గుహలో వెలసిన మంచులింగమును తలచుచురారండి

      కనులకు శిరమది కనబడకుండును
              హిమసౌందర్యంబున దాగియుండును 
      కనులకు గంగయు కనబడకుండును
               ప్రవాహరూపిగ పారుచుండును.           ॥అమర॥

     ఉమకై వెదుకగ నుండదచ్చట
                 ఉన్నది శంభుని కూతమిచ్చుచు
     అగ్నినేత్రము కానరాదులే                 
                 ఆరెను ఎప్పడొ ఆచలికి                     ॥అమర॥

     నాగాభరణము నామమాత్రమై         
                 మంచుకణములో మాయమైనది
     శూలము,ఢక్కా సృక్కిపోవుచు
                  సుందర హిమమున కరగిపోయెను ॥అమర॥

    మంజీరంబది మౌనముద్రతో
                 మంచునపొంచెను మరిమరిమ్రోగక
    బసవడు సైతము పరవసించుచు
                  కోటికష్టముల గోటద్రుంచుచు
                రారమ్మంచును రంకెవేసెను.             ॥అమర॥

8.07.17 న రాత్రికి బయలుదేరి 9ఉ. 6.00.గం.లకు. బాల్తాల్ చేరాము. 9.05.ని.లకు అమర్ నాథ్ దర్శనానికి వెళ్లి సా. 6.00.గం.లకు వచ్చారు. ఆరాత్రికి అచటనే ఉండి  10.07.17.ఉ.10.గం.లకు బయలుదేరి మరల శ్రీనగర్ వచ్చి హోటల్ లో బస చేసి 11.07.17న చాముండాదేవి దర్శనం కొరకు వెళుతున్నాము. 12.07.17న డోగ్రా లో ఆలయం ఉంది.దర్శనం అయింది. ఆ తరువాత "ధర్మస్థల్" లో జ్వాలాముఖి , తారాదేవి అమ్మవార్లను చూచాము. ఈరోజు చింతాపూర్ణి లో హోటల్లో బస.
    13.07.17.ఈరోజు చింతాపూర్ణిమ దర్శనం అయినది.
అనంతరం నయనాదేవి ని దర్శించాము.ఆ ఆలయానికి రోప్ వే లో వెళ్ళాము(₹170/- ఒక టికెట్) అక్కడ నుండి 90 మెట్లు ఎక్కి వెళ్ళాలి. భోజనానంతరం ఢిల్లీకి ప్రయాణం.

  అమరనాథుని యాత్రలో హ్లాదమొప్ప
  పాలుపంచుక నిరతంబు పారమార్థి
  కంబు నెయ్యంపు సమ్మతిన్ కలసినట్టి
  మాన్యసోదరసోదరీమణులనుతింతు.

       పెద్దల గారవించుచును ప్రేమవినిర్మిత మాతృభావనన్
       ముద్దులుమూటగట్టి కడు మోదముగూర్చెడు పల్కుజిల్కుచున్
       హద్దులుదాటనీని చిరు హాస్యము హాసము పంచుచున్సదా
       నిద్దురదూరమున్సలుపు నిర్మలమూర్తుల కంజలింతునే.

        అమరనాథుని యాత్రలో నాతో ప్రయాణం చేసిన వారి గురించి పాట.

ఓ....సోదర,సాదర భక్తశిఖామణులారా!
సరస సహృదయ సోదరీమణులారా!
   వినరండీ యాత్రాఫలం, కనరండీ జ్ఞాన బలం.

       అమరనాధుని అనుగ్రహముతో అంతా సుఖకరమైనది
       అమ్మపార్వతి అనురాగం తో అంతా సుముఖమయైనది.

  తీర్థయాత్రలో తీయని కష్టం త్రినేత్రుడిచ్చే వరమేలే
  సార్థకంబులై జీవితంబులే సంపదాళితో వరలునులే

    హిమాలయంబులు నదీనదంబులు
    పచ్చని చెట్టు పశుపక్ష్యాదులును
         శంభునిరూపం  శాంభవి తేజం.

  మానవజీవన గమ్యం మమతాసమతల రమ్యం
  మానవత్వమే మాధవు సేవకు సోపానం

       అమరనాధుని యాత్రకువెళ్ళే అన్నార్తులకిల అండగనుంటు
       పంచభక్ష్యముల పంచేవారిని పరమాత్మే దయజూచునులే.

                       అమరనాథుని దర్శనం... నా అనుభూతి.

 అమరనాథునిగంటి ఆత్మీయ భక్తుల
             మీనంపునేత్రాల మెరపులందు
 అమరనాథునివింటి నద్భుతస్వరములన్
             భంభంభోలెయనడు భజనలందు
 అమరనాథుని దరహాసచంద్రికలను
              నింపుకొంటినిహృది నిండుదనుక
  శ్రీహిమాలయమున చిత్తంబు భవుపాద
              పద్మాలకర్పించి ప్రణతులిడితి
     ఎన్ని జన్మల పుణ్యమో ఎరుగలేము
     శివుని ఆజ్ఞగ భావించి చేరవచ్చి
     పారమార్థక చింతనన్ పరవశించి
     ఈశునాశీస్సులందితి నిశ్చయముగ.

5.నిర్మల్ విహారయాత్రానుభవాలు.

  నిరంతరం శ్రమపడే మానవ  మేథస్సునకు ప్రకృతి సందర్శనాన్ని మించిన ఆనందం ఉత్తేజం ఏముంటుంది చెప్పండి. అందుకే  నిర్మల్ లోని హస్త కళా సౌందర్యాలు, సమీపంలోని జలపాతాల పరవళ్ళు, అందాలు ఆస్వాదించే కోరికతో ది.2.12.2017.న ఉ.7గం.లకు హైదరాబాద్ లో  మా బావగారైన శ్రీ పులిజాల సత్యనారాయణ(రిటైర్డ్ ఆర్కియాలజీ సూపరింటెండెంట్) గారి ఆధ్వర్యంలో  నేను( పొన్నెకంటి సూర్యనారాయణ రావు) నా శ్రీమతి ఇందిరాదేవి, పెద్దచెల్లి అరుణ, చిన్నచెల్లి పద్మ జారాణి, మేనకోడలు సంథ్యారాణి, పిల్లలు ఆదిత్య,లలిత, మిత్రుడు గోవింద్ తలిదండ్రులు బయలుదేరి(NH44) జాతీయ రహదారిలో  210 కి.మీ. దూరాన ఉన్న నిర్మల్ కు మధ్యాహ్నం చేరి, అచట హోటల్ లో విశ్రాంతి , భోజనానంతరం నిర్మల్ కు 38 కి.మీ. దూరంలో గల పొచ్చెర జలపాత సందర్శనానికి వెళ్ళాము.

   ముందుగా నిర్మల్ బొమ్మలు..కళాకారుల.,తయారీ విషయాలు...

 అత్యంత మృదువుగా, తేలికగా ఉండే "పునికి" కర్రతో చేయబడే ఈ బొమ్మలకు 400సంవత్సరాల చరిత్ర ఉంది. కళాకారులు "నకాషీ" కులానికి చెందిన కళాకారులు. వీరు "మరట్వాడ" ప్రాంతీయులు. నిర్మల్ సంస్థానాధిపతి "నిమ్మనాయుడు" దేశం నలుమూలలనుండి కళాకారులను రప్పించి హస్త కళలను పోషించి వృద్ధిచేశాడు.
                                 తయారీ విధానం.
       ముందుగా చేయదలచుకొన్న బొమ్మకు దగిన ఆకారపు ముక్కలు తీసికొని, చింతగింజలు నానబెట్టి జిగురువచ్చువరకు రుబ్బి  పేస్ట్ చేసుకొని, దానిని కొయ్యపొడిలో కలిపి కావలసిన బొమ్మ చేసి దానిని ఎండబెట్టి నునుపు చేసి తగిన రంగులు వేస్తారు. ఆరంగుల తయారీలో చెట్ల ఆకురసాలు, పూల రసాలు వాడతారు. ఈ రంగులలో బంగారురంగు తయారీకి చాలా ఎక్కువసమయం శ్రమ పడుతుంది. ఈ రంగులు అత్యంత మనోహరంగా, మన్నికగా ఉంటాయి. బొమ్మలన్నీ సజీవకళతో ఉట్టిపడుతుంటాయి. ఈ బొమ్మల కళాకారుల సహకారసంఘం 1955 లో స్థాపించబడినది. ఈ నిర్మల్ పంచపాత్రలకును ప్రఖ్యాతి చెందినది.

     సువర్ణ పుష్పాభిషేకంతో  నిజాం నవాబు, అవాక్కు.

       ఒకసారి నిజాం నవాబు నిర్మల్ పట్టణానికి వచ్చిన సందర్భంగా
వారికి ఇచటి కళాకారుల చేత బంగారు(చెక్క)పూలు చేయించి వాటితో సువర్ణ పుష్పాభిషేకం చేశారు. కొద్ది సేపటికి నిజం తెలుసుకొని నవాబు గారు అవాక్కయ్యారట. ఇది నిజమైన భగవద్దత్తకళ. శిల్పకళవంటిదే దారుకళ. దారువు అంటే కర్ర.

   దారుకళాధురీణా!నిర్మలవాసా! దండంబులందుకోవయ్యా!
     
   1. కడుపునిండిన నిండక కలతపడక
       భరతజాతికి కీర్తికి బాటవేసి
       నలువ రూపంబు ధరియించి నవ్యరూపు
       సృష్టిచేసితివయ్యరో చెలువుమీర

   2. నిర్మల వాసివౌ సత్కళా నిర్మ లాత్మ!
       త్యాగపరిపూర్ణ సద్భావ యోగివర్య!
       వందనంబులు నీకెపుడు వందవేలు
       జాతి మరువదు నీదు విఖ్యాతి యెపుడు.

   3. "పునికి" కర్రకు నిపుణత పురుడుబోసి
        పూర్ణ రూపాలు సృష్టించు పుణ్యులార!
        రంగురంగుల యందాలు రహినినిలుపు
        మీకు శుభములుకలుగుత మిగులశోభ!

                          పొచ్చెర జలపాతం.
    ఎక్కడో పుట్టిన అప్సరసల వంటి నదీ కన్నెలు తమ చెలికత్తెల వంటి ఉపనదులతో గూడి చిలిపి వలపులతో రసికులనూరిస్తూ, చిత్రకారుల కుంచెలకు పనిచెబుతు, కవుల మస్తిష్కాల ఊహలకు ఉయ్యాలలూపుతు, సంగీతజ్ఞుల సరిగమలకు సాయంపడుతూ తమ ప్రత్యేకతలను చాటుకుంటు భూమాతపాదకమలాలను స్పృశించాలని తపనపడేవే జలపాతాలు. మన పౌరాణిక ఆధారాన్ని అనుసరించి భగీరథుని దయ వలన భువికి దిగినదే గంగారూపి జలపాతం. ఇలా ఎన్నో నదులు ఎన్నో దేశాలలో జలపాతాలై మధుర మనోజ్ఞ దరహాస చంద్రికలను, రమణీయ కర్ణపేయ సంగీత నాదాలను వినిపిస్తు ప్రకృతి ప్రియులను అలరిస్తున్నాయి.
       పొచ్చర జలపాతం నిర్మల్ కు 38 కి.మీ. దూరంలో ఉంది.
ఎన్నో ఓషథీ గుణాలను సంతరించుకొని అతి స్వచ్ఛమైన పరవళ్ళు త్రొక్కే నీటితో తన దరిజేరిన వారికి అమితానందాన్నిస్తుంది.
మేము ఆ ఆనందాన్ని ఎంత సేపు అనుభవించామో! రకరకాలుగా ఛాయాచిత్రాలు తీసుకొని పదిలపరచుకున్నాము. ఇచటికి మా బావగారు కూడ రాగలుగుతారనే ఉద్దేశంతో నే ముందుగా దీనికి వచ్చాము. ఇచటి అందాలను వృత్తిపరమైన ఛాయాగ్రాహకులైతే ఎంత ఒడుపుగా బంధిస్తారో! నాకు మదిలో అత్యుత్తమ ఛాయాగ్రాహకుడైన నా బావ మరది కీ.శే. గంగరాజు వాసుదేవమూర్తి మెదిలాడు.

     పొచ్చెర జలపాతంబది
     యచ్చెరువగుగాదె మనకు హ్లాదినియగుచున్
     చెచ్చెరదూకగముందుకు
     చిచ్చరపిడుగయ్యెమనకు సిరులనుగూర్చన్.

      జలపాత దర్శనానంతరం నిర్మల్ బొమ్మల తయారీ, పూర్తిగా తయారయి అమ్మకానికి సిద్ధంగా ఉన్నవి , ఆయిల్ పెయింటింగ్స్ చూచాము. అవి సజీవ దారు శిల్పాలు. మన భారతీయుల కీర్తి కిరీటాలు. స్వచ్ఛ విజృంభమాణసృజనలు. అభివృద్ధి వారి కళాకౌశలాలలో కనపడుతున్నదే కాని వారి జీవితాలలో కాదని ఆ కళాకారులను చూచినపుడు అవగతమౌతుంది. దానికి మనం స్పందించాల్సిన విధానం ఒక్కటే. వారి వస్తువులను మనం కొని ప్రోత్సహించటం. అందుకే మేము కొన్ని బొమ్మలను కొన్నాము.

         ది.3.12.2017. న.   కుంతాల జలపాతం.
 ఈ జలపాతం ఆదిలాబాద్ జిల్లా, నేరడిగొండ మండలం "కుంటాల"గ్రామంలో ఉంది. దీని ఎత్తు 147అడుగులు. హైదరాబాద్ నుండి 237కి.మీ. నిర్మల్ నుండి షుమారు35 కి.మీ. వెళ్ళి నేరడిగొండ నుండి కుడివైపునకు తిరిగి 13కి.మీ వెళితే "కుంటాల" జలపాతం వస్తుంది. దుష్యంతుని భార్య శకుంతల ఇచటికి వచ్చి స్నానంచేసి వెళ్ళేదట. ఆమె పేరు మీద ఈ జలపాతానికి "కుంతల"జలపాతం అని పేరు వచ్చిందట. భూమట్టం నుండి క్రిందకు 408 మెట్లు ఉన్నాయి. కాని చాల విశాలంగా ఉండి ఎక్కువ శ్రమలేకుండ దిగి ఎక్కగలిగేలా ఉంటాయి. కొంత మధ్యలో విశ్రాంతి తీసుకుంటు వెళ్ళిరావటం శ్రేయస్కరం. అత్యంత మనోహరదృశ్యం. వర్ణనాతీతం. కాని నీరుపారే ప్రాంతమంతా పాచి ఉండి ప్రమాదానీకి హేతువౌతుంది. మిక్కిలి జాగ్రత్త అవసరం.
 
  కుంతల జలపాతంబిది
  ఎంతయు ఘనమైనలోతు ఏమామలుపుల్
  వింతకు వింతై తోచు,శ
  కుంతలపేరన్ బరగుచు కూర్మిన్ గూర్చున్.

                                  ముఖ్య విషయం.
   అచటికి వెళ్ళేముందే మనం దారిలో మనకోసం ఎంతో ప్రేమగా, ఆశగా ఎదురుచూచే వానరాల కొరకు కొన్ని ఫలాలను తీసికొని వెళ్ళటం మరచిపోరాదు. మనం తిన్నది మట్టిపాలు. పరులకు పెట్టేది పరమాత్మ పాలు. పరమాత్మ అనుగ్రహిస్తే వరాలు. ఆగ్రహిస్తే శాపాలు. మనం జీవకారుణ్యాన్ని పాటించుదాం, తోటివారికి సాయపడదాం.  కళాకారుల జీవితాలలో వెలుగులు నింపే ప్రయత్నం చేద్దాం.  ఇలాంటి కార్యక్రమాలు అక్రమార్జనాపరులు చేస్తే వారి పాపాలన్నీ పటాపంచలైపోతాయి. అందుకే వారిందులోకి రారేమో!  ప్రభుత్వాలు కూడ కుటీర పరిశ్రమలకు ఎక్కువ చేయూత నివ్వాలి. వారి జీవితాలలో కాంతులు నింపాలి.




             



         




  


       

  

       



     


    





పద్యపరీమళము. యశస్వినీ సాహితీ సమితి. 12.06.25

 1. రాజనరేంద్రు కాలమున రాజిలె పద్యము నన్నపార్యుచే     సాజము సుందరంబయిన సంస్కృతభారతి తెల్గువెల్గుగా     భాజనమంచు పండితులు భారతమున్ శిరసావహించ...