10, సెప్టెంబర్ 2016, శనివారం

మడిపల్లి వారి.లక్ష్మీ నృసింహ శతకం

మాన్యులు ,శ్రీ మడిపల్లి భద్రయ్యగారి లక్ష్మీ నృసింహ శతకము గ్రంథావిష్కరణ సందర్భంగా అభినందన పద్యాలు. 30.06.2016.

1.సీ. హస్తినాపురమున నవధానక్షేత్రాన
                       సాహితీ స్నేహంబు సాగెమాకు
         పద్యరచన ఘన పారవశ్యంబున
                       జేయుచునుండగ జెలిమిగలిగె      
         కంఠమెత్తి కవిత గానంబుజేయగా
                       నిండుమనసుతోడ నెయ్యమబ్బె
        నవరస భావాలు నవ్వల జల్లులు
                        పూవులై పూయించ మోదమయ్యె
  తే.గీ.  వారలెవ్వరో కాదు మా భద్రనామ
            యశులు మడిపల్లి ధీరులత్యంత ఘనులు
            నారసింహుని సత్కృపన్ ధారగల్గి
            కావ్యమందించుచున్న సంభావ్య వరులు.

2.సీ. గొంతెత్తి పాడెనా కోకిలమరపించు
                    నవరసంబులజూపి నవ్యఫణితి
         పద్యంబు రచియింప హృద్యంబెయౌనుగా
                     సత్కవుల్ పొగడంగ సభలయందు
         సాహిత్య సంగీత సమ్మేళనంబుల
                       కాలుమోపినజాలు ఘల్లుమనును
          నాటకరంగాన నాణెంపు నటనతో
                        పాత్రలో లీనమై పరవశించు
  తే.గీ. అట్టి మడిపల్లి భద్రయ్య హస్తినపుర
           మందు నాకు మిత్రుడగుట మరువలేను
           నారసింహుడు సతతంబు వారికెపుడు
           కోరుకొనినట్టి వరముల గూర్చుగాత!
   

కామెంట్‌లు లేవు:

పద్యపరీమళము. యశస్వినీ సాహితీ సమితి. 12.06.25

 1. రాజనరేంద్రు కాలమున రాజిలె పద్యము నన్నపార్యుచే     సాజము సుందరంబయిన సంస్కృతభారతి తెల్గువెల్గుగా     భాజనమంచు పండితులు భారతమున్ శిరసావహించ...