21, సెప్టెంబర్ 2020, సోమవారం

పోతన., గురజాడ. జాషువా. గాంధీ జీ. పొట్టి శ్రీరాములు,పి.వి.అల్లూరి, ఘంటసాల..

              1.   నేటి అంశం "బమ్మెరపోతనామాత్యుడు".

          సీ: శ్రీరామదర్శన సిద్ధినిబొందిన

                        పుణ్యాత్ముడైనట్టి భూరిగుణుడు

              వాణికన్నీటిని వారించి కావ్యమ్ము

                         రామునకిడినట్టి రమ్యగుణుడు

             భాగవతంబున ప్రత్యక్షరంబును

                              భక్తిని నింపిన భవ్యగుణుడు

            సహజకవియనెడు చక్కని బిరుదంబు

                      పొందిన రసరమ్య పుణ్యగుణుడు

  ఆ. వె.  బమ్మెరాన్వయుండు బహుపూర్వ పుణ్యుండు

           పోతనాఖ్యుడైన భూసురుండు

           భరతసత్కవిమణి భాగ్యంపువారాశి

           సాటిలేని విమల సారయశుడు.

... తేటగీతిలో పోతనగారు. 

తన్మయత్వాన శ్రీరాము తత్త్వమంత

భారతీయుల హృదయాల భద్రపఱచె

భాగవతమను పేరను భవ్యచరిత

పుణ్యచరితుండు భక్తుడా పోతరాజు...1

హలము బలమున పండించె నైహికంబు

కలము చేతను సృజియించె కవనఫలము

రెంట జాలిన పోతన మింటికెదిగి

రామ రసమును బంచెను రసనతనియ.2

నవ్య మధువున భావాలు నానబెట్టి

భక్తిరసమును బూయుచు పద్యరచన

చేయకుండిన యంతటి చిద్విలాస

పూ‌ర్ణ సాహిత్య మొదవునె పోతనార్య?.3.

           2.   గురజాడ.

     సీ: సాంఘిక శ్రేయమ్ము సమకూర్చవలెనంచు

                          పాటుబడినయట్టి పండితుండు

         గ్రాంథికవాదులౌ కవులను మెప్పించి

                     ప్రజలభాషను బెంచు పండితుండు

         హేతువాదిగ మారి హిమవన్నగమ్ముగా

                           భావాలు పంచిన పండితుండు

        "కవిశేఖరుండన్న" కమ్మని బిరుదమ్ము

                         భద్రమై వెలుగొందు పండితుండు

  తే.గీ: వేసె సాహిత్య రంగాన భిన్నమైన

         నడుగు లెన్నెన్నొ వీరుడై హ్లాదమొదవ

         వారి జాడలె మనకెప్డు దారిజూపు

         భావి సంస్కారపూర్ణత్వ పరిధిపంచు.

        3.   కవికోకిల" జాషువా గారి జయంతి .సం.గా...

తే. గీ . కులము మతనెడు క్రుళ్ళును కూల్చివేయ

         అక్షరాయుధంబునుబట్టి యనవరతము

        సాహితీరణ రంగాన సాగి ప్రజల

        డెందముల్గెల్చిన సుకవీ! వందనములు.

తే.జీ .  రాజు సుకవుల చావు బేరీజు వేసి

        సుకవి ఘనుడంచు బల్కిన సూరివీవు

        ప్రజల గుండెల నిండెడు భావచయము

        నీదు సొంతము జాషువా! నిజమునిజము

        4.   అంశం..గాంధీజీ.... 

   ఉ .  ఆయుధమింతలేక పరమాద్భుత శాంతి కి మారురూపమై

         గాయము రక్తపాతములు కర్కశఖడ్గవిహారశూన్యమై

        దాయగునింగిలీసుప్రభుతన్హడలంగను నెట్లుజేసితో

        ఓయి మహాత్మ! జాతిపిత! యున్నత భారతమాతబిడ్డరో!

        5.  పొట్టి శ్రీరాములు...ఆంధ్ర రాష్ట్రావతరణ:  

ఆ.వె. కలసిరాష్ట్రమున్న కష్టాలకడలంచు

       పొట్టివంశజుండు పోరిపోరి

       ఆంధ్రులకును స్వేచ్ఛ నందించు యజ్ఞాన

       తనువు సమిధజేసె త్యాగమూర్తి.

ఆదర్శ నేత...

తాను చేయు పనుల ధర్మంబు తప్పని

స్వార్ధమెఱుగనట్టి సజ్జనుండు

లలితహృదయుడైన లాల్బహదూర్వంటి

నేత దొరకగలడె నెమకిచూడ!

వాగ్గేయకారుడు... త్యాగరాజు.

సరళ సంగీత సాహిత్య సార కీర్త

నాళి రచియించి రాగాలనాలపించి

యయ్యె వాగ్గేయకారుడు త్యాగరాజు.

పూర్వజన్మంపు పుణ్యంబు ప్రోదిగాగ.

 కీ.శే. మాజీ ప్రధాని,పదునారు భాషల పుంభావ సరస్వతి,
      తెలగాణ మాగాణపు కల్పవృక్షము పాములపర్తి
      నరసింహారావు గారి శతజయంతి సందర్భముగా
      "అక్షరాంజలులు."  28.6.2020.


   1.సీ: అంబుధి జేరిన యార్ధిక రంగమున్
                            కమఠమై కాచిన కైటభారి
           ఆర్ధికమంత్రి గా స్వార్ధరహితమైన
                     పాలన నెఱపిన పరమశివుడు
           సంభాషణలయందు చాతుర్యమందున
                         కిటుకుల నెఱిగిన కృష్ణుడతడు
            జ్ఞానమూర్తి యగుచు నైపుణిన్గడియించి
                         వాసిగాంచిన యట్టి వాణిభర్త
     తే.గీ: మూడుమూర్తుల "నరసింహమూర్తి"యతడు
              స్ఫూర్తి దాతగ వెల్గె సత్కీర్తిబొంది
              చెక్కుచెదరని నిక్కమౌ యుక్కుమనిషి
              నిత్య సంస్తుత్యుడైన మనీషియతడు.
   2.సీ: పంచెకట్టున వెల్గి పదునారు భాషల
                              నాపోశనన్బట్టు నాంధ్రుడెవడు
           తెలగాణబిడ్డడై తేజంబుజూపి ప్రా
                           ధాన్యుడైనట్టి యా ధన్యుడెవడు
           మోమున చిరునవ్వు మునిచంద్రుపగిదిని
                            భావాల విలసిల్లు భవ్యుడెవడు   
           వేదాంత సూక్ష్మాల  విజ్ఞత జూపి వి
                                వేకియౌ విశ్రాంతవీరుడెవడు       
        ఆ.వె: నూరు వత్సరముల నారనితారయై
                 నింగి వెల్గు మహిత నియతమూర్తి
                 "పీవి" గాక వేరు పేరులబనియేల
                 పుణ్యభారతాంబ ముద్దుబిడ్డ.
      3.ఆ.వె: నాగఫణి వరుండు నవ్యప్రధానినో
                   ప్రశ్నవేయుడనగ బదులువలికె
                   మౌన భాషణాన మహిత శక్తిని జూప
                   పద్యమల్లుమనియె హృద్యముగను
      4.ఆ.వె: ప్రశ్నవేయుటందు ప్రజ్ఞను జూపిన
                  నారసింహు జూచి నాగఫణియె
                  విస్తుబోయి వారి విజ్ఞాన దీప్తికి
                  పద్యమల్లె మౌన భావమునకు.
      5.ఆ.వె:ప్రశ్నలెన్నియిడిన ప్రాజ్ఞతజూపించి
                  నవ్యరీతి బల్కు భవ్యగుణుడు
                  "పీవి నారసింహు" ఠీవిని నుతియింప
                  నాదిశేషుతరమె!వాదమేల?
     6.ఆ.వె: విమలకీర్తి గన్న వేదాంతియాతడు
                  కవులు మెచ్చుకొనెడి కవియతండు
                  సరసరాజనీతి చాణిక్యుడాతడు
                  స్వార్ధరహితుడైన సాధుగుణుడు.
    పద్యాలతోరణం... దత్తవర్ణన: అల్లూరి సీతారామరాజు.
      నా వర్ణన: మీపొన్నెకంటి.7.05.2020.
   సీ: ఆంగ్లేయశునకాల యసువులు బాపంగ
                             చెలరేగి దుమికిన సింగమీవు
        భారతావని కంట వరదయైపాఱిన
                             కన్నీరుదుడిచిన ఘనుడవీవు
        స్వాతంత్ర్య సంగ్రామ సంఘాలు నడిపించి
                             మన్నెంపు పులివైన మనిషివీవు
        "రూధర్ఫరుడు"నకు రోషంబు రుచిజూపి
                              యుద్ధంబు సల్పిన యోద్ధవీవు
   తే.గీ: నీదు కన్నుల రేగిన నిప్పుకొలిమి
            ఆరదేనాడు భారతవీరులందు
            అందుకోవయ్య జోహార్ల నమరచరిత!
            నీకు సాటిగ నెవరుంద్రు నీవెసాటి.

గానగంధర్వ...ఘంటసాల గారి వర్ధంతి సందర్భముగా.
             (జననం) 1922.డిశంబర్.4.---1974 .పిబ్రవరి.11.
సీ: కరుణరసాన నీ గళముకంపమునొంద
           కన్నీరుగార్చులే కఠినులైన
     వీరరసంపు వైవిధ్య ముంజూపిన
          కనులరాలునునగ్ని కణములెన్నొ
     శృంగారభావనల్ చిందించి పాడంగ
           చిత్తాన మొలకెత్తు చిలిపివలపు
    హాస్యరసంబును నలవోకపలికింప
         కడుపుబ్బ నవ్వుల కళలువిరియు
    తే.గీ. ఓయి స్వరమాంత్రికుండ!మహోన్నతుండ!
            ఘంటసాలగ సత్కీర్తి మింటవెలిగె
            జాతి గర్వించె నీదగు జన్మ చేత
            గానగంధర్వ! నీసరి కనగనీవె.
సీ:  సంగీత శాస్త్రాన సామర్ధ్యమున్నట్టి
           యున్నతోన్నతులున్న నుండుగాక
      వాగ్గేయకారులై వైవిధ్య రీతులన్
           చోద్యాలు చూపిన చూపుగాక
      పసితనమాదిగా పాండిత్యముంజూపు
            ఉద్దండులుండిన నుండుగాక
       జంత్రగాత్రములందు జాణత్వముంజూపు
             ఉత్తములుండిన నుండుగాక
    సుధలుకురియించు త్వద్గళశోభలెన్న
    హాసదరహాస సుప్రభా వేసమెన్న
    దేశభక్తిని ప్రకటించు ధిషణజూడ
    నీకు సాటివి నీవయ్య నిర్మలాత్మ!
            

  కీ.శే. అటల్ బిహారి వాజ్ పేయి గారికి అశ్రునీరాజనాలు.

      అటలు బీహారి సత్కవి యమరుడయ్యె,
      ఇంద్ర సభలోన కవులెల్ల మంద్రమైన,
      భార విహ్వల హృదయాల పజ్జజేర,
      స్వాగతించిరి సురలెల్ల సభకు నిపుడు.

                 

   


5, సెప్టెంబర్ 2020, శనివారం

గురువు.

                                గురువు.

          ఆ.వె. సర్వెపల్లివారి సద్యశస్ఫూర్తిగా

                   నొజ్జలదినమంచు నోహొయనగ

                   చేసిరైదు తేది సెప్టెంబరందున

                   వర్షవర్షమెల్ల హర్షమొదవ.

మ.  అకలంకంబగు నక్షరంబులను సర్వార్ధ్హార్ధ సిద్ధంబుగాన్ ,

      సుకరంబయ్యెడి రీతిగా  మదికి సంస్తూయాత్మపాండిత్యమున్,

     సకలంబున్ దయజూపి నేర్పిన గురుస్స్వాముల్ విచారింప.నా

     కొకరా యిద్దర ముగ్గురా నలుగురా యున్నార లెందెందరో  .

సీ. క్రమశిక్షణాన్విత గమనంబు నేర్పిన

                      గురువుల మేమెప్డు మరువలేము.

    పాఠ్యాంశముల్గాక పరమాత్మ జూపిన

                      గురువుల మేమెప్డు మరువలేము

    సద్భావసాహిత్య సౌహిత్యమూర్తులౌ

                      గురువుల మేమెప్డు మరువలేము

    పద్యంబునెప్పుడు హృద్యంబుజేసెడు

                      గురువుల మేమెప్డు మరువలేము

    దేశభక్తి మదిని దీపింపజేసిన 

                     గురువుల మేమెప్డు మరువలేము

    పెద్దలబూజించు ప్రేమను నేర్పిన 

                      గురువుల మేమెప్డు మరువలేము

    మహితుల చరితలన్ మదికెక్కజెప్పిన

                       గురువుల మేమెప్డు మరువలేము

    తల్లిదండ్రి గురువు దైవంబులన్నట్టి 

                       గురువుల మేమెప్డు మరువలేము

    మాతృసంస్థనెపుడు మరువరాదనియెడు 

                      గురువుల మేమెప్డు మరువలేము

    తే.గీ:  వివిధ రూపాలనలరెడు వేదమూర్తి

             బాలబాలికలన్నను పరవశించి

             జ్ఞాన దీపాలు పంచు విజ్ఞానమూర్తి

             అర్పణముసేతు నతులను నహరహమ్ము.

  ఆ.వె.    విద్యలన్ని  నేర్పి విజ్ఞత కల్గించు 

             గురుని పాదరజము శిరముదాల్చ

             నంతకన్న ఫలము నవనిని లేదురా 

             వదలకయ్య గురువు పాదములను.

 ఆ.వె.   నిదుర లేచి యెవడు నిస్టాంతరంగుడై 

            గురుని నామ జపము కూర్మి సలుపు 

            నట్టి వాడు పొందు నఖిల సౌఖ్యమ్ములు 

            వదలకయ్య గురువు పాదములను.

  ఆ.వె. శిష్యకోటి మతుల చీకట్లు తొలగించి

          దివ్య బోధనలను దీప్తు లిచ్చి

          ధిషణ జూపు గురువు దేవుని రూపురా

          వదలకయ్య గురువు పాదములను.

  ఆ.వె. బాల బాలికాళి బహువిధ శిలలౌను

           ఊహలెల్ల గురుల ఉలులు సుమ్ము .

           ఉన్నత గురు కృషియె  ఉత్తమ శిల్పాలు

           వదలకయ్య గురువు పాదములను.

   ఆ.వె. దైవ దర్శనంబు దయతోడ చేయించి

           ముక్తి త్రోవజూపు పుణ్యమూర్తి .

           గురువు పేర మనకు గోచరిన్చునుగాదె  

           వదలకయ్య గురువు పాదములను.

  ఆ.వె. ఎరుక కులజుడైన ఏకలవ్యుండు-తా

          గురుని దైవమట్లు  కూర్మి నమ్మి

           విశ్వమందు కరము విఖ్యాతి నార్జించె

          వదలకయ్య గురువు పాదములను.

  ఆ.వె. మైనమట్లు  కరగి మహి కాంతులీనెడు

           గురుని త్యాగ గుణము మరువరాదు .

           అనుసరించి వాని కానన్దమీయరా

           వదలకయ్య గురువు పాదములను. 

 ఆ.వె. తండ్రి పగిది నిన్ను దండించు నొకమారు

          తల్లివోలె ప్రేమ తనుపుచుండు

          విద్య నేర్పు గురుని వింత వేషాలురా

          వదలకయ్య గురువు పాదములను.


భాగ్యనగర వాణికి పట్టాభిషేకం

భాగ్యనగరంలోని కల్చరల్&అసోసియేషన్,రాఘవేంద్రకాలని,  సి,బ్లాక్, కొండాపూర్ వేదికగా, సంస్థ ప్రసిడెంట్ శ్రీ జూపల్లి శ్రీనివాస రావుగారు ది.30.10.2022(ఆదివారం)ఉ.గం.10.00లకు పతాకా విష్కరణ, సభాధ్యక్షత బాధ్యతలను నిర్వహించగా, కార్యదర్శి శ్రీ ఏ. సురేంద్రరెడ్డి గారి విజయోత్సవ తోడ్పాటుతో తడవర్తి బాపయ్య ఉన్నత పాఠశాల, ధూళిపూడి పూర్వవిద్యార్థులు  నూతి సాయి సోదరులు, తదితర ఆత్మీయ విద్యార్థినీ విద్యార్థుల బృంద సంపూర్ణ సహాయ సహకారములతో వారి విశ్రాంతాంధ్రోపాధ్యాయులైన శ్రీయుతులు జొన్నలగడ్డ జయరామ శర్మకు, పొన్నెకంటి సూర్యనారాయణ రావుకు, శ్రీమతి వెలగపూడి నాగమల్లి పుష్పలతకు, ధూళిపూడి 

పూర్వవిద్యార్థి, అష్టావధాని శ్రీయుతులు చింతలపాటి బుచ్చి వెంకటప్పేశ్వర శర్మకు దంపత సమేతముగా ఘన సన్మానములను దుశ్శాలువ, సరస్వతీ మూర్తి తో అనిదంపూర్వముగా నిర్వహించిరి. అచటికి వచ్చిన పూర్వ విద్యార్థుల గుండెలోతులు నిండిన ప్రేమానుభవాలు, సభక్తికముగా ఆనందాశ్రువులతో పొంగిపొర్లిన సంభాషణలు ఆకట్టుకొనినవి. వారి మధురానుభూతులు అనుభవైక వేద్యములే కాని బోధ్యములు కావు. ఈ సంతోష సమయమున ‘‘ జననీ జన్మభూమిశ్చ స్వర్గాదపి గరీయసీ ’’ అని పాఠశాల పూర్వ విద్యార్థులు వఝ గోపాల కృష్ణమూర్తి, కత్తుల వెంకటేశ్వరరావు ప్రభృతులు గ్రామముతోను పాఠశాలతోను ఉపాధ్యాయుల బ‌ృందముతోను గల స్వానుభవములను కవితాత్మకముగా వ్రాసి సభను పంచుకొన్నారు.

ఈ అపూర్వ సన్మానము ‘‘ వాణి పాద మంజీరములకు జరిగినట్లు భావించు చున్నామని సన్మాన గ్రహీతలు తమ ఆనందమును కృతజ్క్షతలను పద్యముల రూపమున వ్యక్తపరచిరి. ఈ రీతిగా మాతృభాషను, ఉపాధ్యాయులను జీవితాంతం మరచిపోకుండ గౌరవించుకొనే సంప్రదాయాన్ని పాటించిన ధూళిపూడి పూర్వ విద్యార్థులు ఎల్లవేళలా అభినందనీయులే, ఆదర్శప్రాయులే.

                శుభం భూయాత్!


ఆశీః పద్యసుమాలు.

ఇంతటి చోద్యంబు నెవ్వారు చేయంగ

           వినలేదు కనలేదు వేదికలను

 ఇంతటి ప్రేమయా? యీఛాత్రులకునెల్ల

           "అమ్మభాష" యనిన నాదరంబు

 ఇంతటి గారవ మింత పీయూషమ్ము

     "తెలుగు"నందని మీరు తెలిసివలచి,

 కొంతలో కొంతగ కొమ్మ పల్కులరాణి

              పాదారవిందాల పట్టుమమ్ము

  "భాగ్యనగరా"న మాకు సౌభాగ్యమలర

   పూర్వ విద్యార్థులెల్లరపూర్వముగ 

   సూత్ర బంధిత కుసుమాల శోభపగిది

   చేరి సత్కరించిరిట ఆశీస్సులివియె.1.

 ఎంత యెదిగిన నొదుగుటే యింగితమని

  ఇట్టి పరమార్ధ మెరుగుచు పట్టుదలను

  మూలములనెల్ల మరువని మూర్తులగుచు

  మీరలుండుట సంతసమిడును మాకు.2.

 మరువలేనట్టి ప్రేమను మాన్యతలను

  "శిష్యగణమె"ల్ల మోదాన చేరి యిచట

   పంచినారలు బుధులెల్ల పరవశింప

   నాయురారోగ్య భాగ్యాల నలరుడయ్య!3.

తల్లి పాలు ద్రావ తరియించు జన్మంబు

   మాతృ భాష పలుక మమతలొలుకు

   నన్న విషయమెరిగి ఆంధ్రభోజుడు నాడు

   తెలుగు లెస్స యనియె ధీరుడగుచు.4.

 వదలక మమతలు మీరలు

   పదిలముగా నుండుడయ్య పరమార్ధమదే

   సదమల భావ పూర్ణపు

   నెదలోపలె నీశుడుండు నెయ్యుడెయగుచున్.

   భాగ్యనగరం.            శుభాశీస్సులతో

    మల్కాజిగిరి      విశ్రాంతాంధ్రోపాధ్యాయుడు

    30.10.22.   పొన్నెకంటి సూర్యనారాయణ రావు.



పద్యపరీమళము. యశస్వినీ సాహితీ సమితి. 12.06.25

 1. రాజనరేంద్రు కాలమున రాజిలె పద్యము నన్నపార్యుచే     సాజము సుందరంబయిన సంస్కృతభారతి తెల్గువెల్గుగా     భాజనమంచు పండితులు భారతమున్ శిరసావహించ...