10, సెప్టెంబర్ 2016, శనివారం

నాగోలు పద్యాలు.

    1.    సీ. సీనియర్ సిటిజన్సు శ్రేయంబు కాంక్షించి
                          నాగోలు ప్రాంతాన జ్ఞానులంత
             ఒకరికినొకరౌచు నొద్దిక మీరంగ
                           సాయంబునందించు సరసులగుచు
             సంగీత సాహిత్య సమ్మేళనంబులన్
                            సత్కళల్ జొనిపించి చక్కబరచి
             ప్రాచీన యోగంబు పరమౌషధమ్మని
                           యమలుజరుపునట్టి యార్యులున్న
            ఇట్టి సంస్థ యెదిగె ఈశుని సత్కృపన్
             ఆరు వత్సరాల యవధిదాటె
             స్వాగ తాంజలులివె సజ్జన వరులార!
             సంస్థ జయముగోరు సౌమ్యులార!

     2.     ఆటల పాటలంగలసి యందరు సభ్యులు బాలబాలురై
              నేటికి షష్టిపూర్తియయి నిశ్చల నిర్భయ దేహకాంతితో
              ధాటిని జూపగోరెదరు ధార్మిక పూర్ణులు సత్యవర్తనుల్
              మేటిగుణాఢ్యులౌ సరస మిత్రులు పల్కెడు స్వాగతంబిదే.

     3.     కొమరు రాజు వారి కూర్మి సాయమునంది
              పరిఢవిల్లె సంస్థ ప్రాభవంబు
              శిరమువంచి వారి శ్రేయంబుగోరుచు
              పలుక వలెను శుభము ప్రాంజలించి.
   
     4.   భారముకాదులే వయసు భక్తిని నింపిన డెందమంతయున్,
           భారముకాదులే మనసు పర్వతమంతటి ఆత్మశక్తితోన్ ,
           భారముకాదులే తనువు బంధిత స్నేహసమావృతంబునన్
           చేరుడి సభ్యులౌచుమన చేరువనున్నవి శాలసంస్థలోన్.

     5.  నాగోలుసభ్యులెల్లరు
          భూగోళపుటెల్లలెల్ల పుష్కల రీతిన్
          క్రీగంటజూడ నేర్చిరి
          వేగంబుగజేరియిచట విజ్ఞులుగారే.
         
           
           
           
     

మడిపల్లి వారి.లక్ష్మీ నృసింహ శతకం

మాన్యులు ,శ్రీ మడిపల్లి భద్రయ్యగారి లక్ష్మీ నృసింహ శతకము గ్రంథావిష్కరణ సందర్భంగా అభినందన పద్యాలు. 30.06.2016.

1.సీ. హస్తినాపురమున నవధానక్షేత్రాన
                       సాహితీ స్నేహంబు సాగెమాకు
         పద్యరచన ఘన పారవశ్యంబున
                       జేయుచునుండగ జెలిమిగలిగె      
         కంఠమెత్తి కవిత గానంబుజేయగా
                       నిండుమనసుతోడ నెయ్యమబ్బె
        నవరస భావాలు నవ్వల జల్లులు
                        పూవులై పూయించ మోదమయ్యె
  తే.గీ.  వారలెవ్వరో కాదు మా భద్రనామ
            యశులు మడిపల్లి ధీరులత్యంత ఘనులు
            నారసింహుని సత్కృపన్ ధారగల్గి
            కావ్యమందించుచున్న సంభావ్య వరులు.

2.సీ. గొంతెత్తి పాడెనా కోకిలమరపించు
                    నవరసంబులజూపి నవ్యఫణితి
         పద్యంబు రచియింప హృద్యంబెయౌనుగా
                     సత్కవుల్ పొగడంగ సభలయందు
         సాహిత్య సంగీత సమ్మేళనంబుల
                       కాలుమోపినజాలు ఘల్లుమనును
          నాటకరంగాన నాణెంపు నటనతో
                        పాత్రలో లీనమై పరవశించు
  తే.గీ. అట్టి మడిపల్లి భద్రయ్య హస్తినపుర
           మందు నాకు మిత్రుడగుట మరువలేను
           నారసింహుడు సతతంబు వారికెపుడు
           కోరుకొనినట్టి వరముల గూర్చుగాత!
   

మనస్సు




                                   మనస్సు....

                                          మనస్సు...

                ( మానవ మానస నవరత్న మాలిక   )
    రచన. పొన్నెకంటి సూర్యనారాయణ రావు.
                      భాషా ప్రవీణ. యం.ఏ, తెలుగు.
                              ది.22.04.2016.

    సీ.ఎచ్చోట వెదకిన నెంత కష్టించినా
                  కనరాదు యేరికి ఖండితముగ
        ప్రాణికోటి సలుపు పాపపుణ్యాలకు
                  సాక్షిగ నిల్చు నీ  సమ్ముఖమున
        పూర్వజన్మంపు టపూర్వ ఫలితమన
                   సంచరించును నిస్సందియముగ
        కీర్త్యప కీర్తులన్ కేళిగా రావించి
                   నింగిని నేలపై నిల్పుచుండు
            చంచలంబైన చిత్రంపు లంచగొండి
            మరులు గొల్పెడు మధురంపు మాయదారి
            దారి తప్పగ యత్నించు తపన గలది
           "మనసు "గాకున్న నేముండు మాన్యులార!         1.

     సీ.సన్యాస ముంగొని సర్వంబు త్యజియించి
                    అదిమిపట్టగలేని యద్భుతంబు
        ఘోరతర తపము తోరపు నిష్టతో
                    అమలు పరచలేని యద్భుతంబు
        చిన్న పెద్దలలోన చిందులు ద్రొక్కుచు
                     హనుమ రీతి దిరుగు నద్భుతంబు
        పుష్పబాణునిచేతి పూవింటి పగిదిని
                     నమరిన యపురూప మద్భుతంబు
               ఏది యేదని యేదంచు నిహము పరము
               వెదకి జూచిన దొరకునా వింతయైన
             " మనసు" పేరున నొప్పెడు మాన్యమగుచు
               బ్రహ్మకైనను బుట్టించు రిమ్మ తెగులు.           2.
             
       సీ. రావణబ్రహ్మయే రమణి సీతను బట్ట
                                 దోహదపడినట్టి దుర్మనస్సు
            రాజ్యమోహాంధుడౌ రారాజు కప్పుడు
                                 దోహదపడినట్టి దుర్మనస్సు
            భస్మాసురునిచేయి భర్గుని శిరముంచ
                                దోహదపడినట్టి దుర్మనస్సు
            కంసుని ప్రేరేచి కన్నయ్య దునుమాడ
                                దోహదపడినట్టి దుర్మనస్సు
                ఇన్ని ఘోరాలు సలుపుచు నేహ్యమైన
                పాపములకొడిగట్టె నీ పాడు "మనసు"
                జన్మ జన్మాల వీడక జగతి దెచ్చి
                నీడ వోలెను చరియించు నివురుగప్పి.          3.

       సీ. రాముని సైతము రాజ్యంబు బోనాడి
                           మాటనిల్పుమనిన మంచిమనసు
            శిబిచక్రవర్తినే చిఱు పావురమునకై
                            మాంసంబు నిడుమన్న మంచిమనసు
            రామనామము తప్ప రహివేరు లేదని
                           మార్గమ్ము సూచించు మంచిమనసు
            పేద ధనికులన్న భేదాలు లేవని
                           మమతను సూచించు మంచిమనసు
              జగతి పుణ్యాల నెలవుగా జంతుతతికి
              కలుగజేయుచు వేవేల కాంతులీని
              జన్మ ధన్యత గూర్చంగ చక్కగాను
              కారణంబౌను సన్మతి క్రమముగాను.            4.

       సీ. నాప్రభావాననె నాశంబగునుగాదె
                         వంశవృక్షంబెల్ల వరలకుండ
            నాప్రభావాననె నవ్యంపు రీతిలో
                          నవ్యాంకురంబెల్ల నందగించు
            నాప్రభావాననె నవరసాలొలికించు
                           కావ్యాలు ప్రభవించు ఘనముగాను
            నాప్రభావాననె నాట్యావధానముల్
                           మైమరచి సభల మరులుగొల్పు
                నేనె "మనసును" మెదడును నింటనుండి
                కర్తనై , కర్మ బంధాలు కదలుచుండ
                సర్వమున్నరసి జగతి సాగరమును
                నీదుచుంటిని జన్మల నింతదనుక.             5.

        సీ. అదుపులో బెట్టిన నందలమెక్కించి
                           రారాజుగాజేయు రాజు నేను
             ప్రక్కకు దిరుగంగ గ్రక్కునదండింప
                            చక్కనై వర్తించు సాధు నేను
             పగవారి జంపగ పన్నాగమదియేల
                             వారిలో నున్నట్టి పోరు నేను
             జగతిని శాంతిని జరిపింప గోరిన
                            శ్వేతవర్ణంపు కపోతమేను
                   నేను నేనన నేనేను నేనునేను
                   మేన నున్నట్టి సుకుమార మీనునేను
                   ఎట్టి యవతారమైనను మెట్టగలను
                  "మనసు" పేరిట బరగుచు మాన్యనైతి.        6.

        సీ. కానరాకుండుటన్ లేనని యందురా?
                           విష్ణ్వంశ నాయందు విపులతరము
            చలనంబు లేదని ఛాందసముండెనా?
                            వాయువేగముమీరి వాలగలను.
            కరుణ లేదని మీరు కన్నెఱ్ఱ జేతురా?
                            కష్టజీవుల జూచి కరగిపోదు.
            మంచిచెడ్డలు నాకు మరిలేవనందురా?
                            మంచికి మంచిగా మసలుకొందు
                    ఇంత సద్గుణ శోభిత వింతజీవి

                    "మనసు" నాబడు నేగాక మరొకటున్నె?
                    సత్య శోధన జేసిన సర్వమందు
                    ఇదియె నిక్కంబని పరమేశుడనును.         7.

         సీ. శస్త్ర ధారులునను చాకున బాకున
                                 కండలుగాజీల్చ కానరాను.
              బహువిధ మంత్రాలు పఠియించినంగాని
                                 బయటపడగలేను భస్త్రినుండి
              భక్తుల హృదయాన పరమాత్మ రూపాన
                                 దాగియుందును నేను తప్పకుండ
              ధ్యాన యోగములందు ధ్యాసను నిల్పిన
                                 నిశ్చలత్వముగల్గి నిలచియుందు.
                      "మనస"నే నేను సతతంబు మారుచున్న
                       మంచిచెడ్డలు పరికించి మానవులకు
                       సాయమొనరింతు సంసారసాగరాన
                       మన్నన నాకిండు కోరకే మాన్యులార!.        8.

          సీ. ఖడ్గధారలకు నే గాయంబునొందను
                                కఠినంపు మాటకే గాయపడుదు
              విజ్ఞులేమన్నను విలువజేతునుగాని
                                 అజ్ఞాని నిందింప నహముకలుగు
              గురుదేవు నేవేళ కోరిమ్రొక్కుచునుందు
                                  శిష్యుల బ్రియమార  చేరబిలుతు
              ప్రేమతో నెవరేని ప్రియరాగముంజూప
                                   అక్కున కెప్పుడు హత్తుకొందు
                   విశ్వమందలి పరమాత్మ విలువదెలిసి
                  "మనసు" కలిగిన మానవా! మసలుకొనుము
                   మానవాళికి శ్రేయంబు మహిత యశము
                   నన్ను  కాపాడుకొన్నను నాకమబ్బు.              9.

     ఉ. అమ్మల గన్నయమ్మ ముగురమ్మల మూలపుటమ్మనాదు చే
           తమ్మున ప్రేమమై నవసుధారస ధారల గ్రుమ్మరింప- నే
           కిమ్మనకుండ వ్రాసితిని కేలదియాపక "మానసంబు"పై
           నెమ్మది మీ విమర్శలను నే మదిగోరుదు చిత్తగింపుడీ. 1౦.
               

         




         

       









       



               
       





   
‌‌‌‌


               
       





   
‌‌‌‌

వందే గణనాయకమ్.2

   వందే గణనాయకమ్.

1. ప్రథమ తాంబూలమర్పించి ప్రాంజలింతు
    విఘ్నరాజుగ స్తుతియించి వేడుకొందు
    కార్యమేదేని తలపెట్టి ఘనతజెంద
    దొడ్డగణపయ్య ననుగావు దురితహరణ!

2. అమ్మ పార్వతి మలచిన బొమ్మవీవు
    అయ్య కరుణరేఖల వెనకయ్యవీవు
    పందెమందున తమ్ముని ప్రక్కనిడిన ...దొడ్డ.....

3. నిన్ను పరిహాసమాడిన నేరమునకు
    శాపమందెను నిర్దయ చంద్రుడపుడు
    ఘనత మీరగ సతతంబు గారవింతు...దొడ్డ.....

4. మాతపితలను సేవించు మార్గమొకటె
    సకలసౌఖ్యాల గనియంచు చాటినట్టి
    జ్ఞానివీవయ్య  వెనకయ్య!మానితుండ!...దొడ్డ.....

5. ఇర్వదొక్కటి పత్రాల నింపుగాను
    పూజలందుచు భక్తుల మోదమలర
    మోక్షమందించు పరమాత్మ! పుణ్యపురుష!...దొడ్డ...

6. గరికపూజకె ముదమంది దురితములను
    పారద్రోలెడు పరమాత్మ! భవ్యచరిత!
    కార్యసిద్ధిని గూర్చెడు ఘనుడవీవు...దొడ్డ...

7. మోదకంబుల నర్పింప మోదమంది
    వెనుకముందులుజూడక మనుజులకును
    సర్వవిజయాలు గూర్తువు సాధువదన!..దొడ్డ...

8. గర్వపడినట్టి తమ్ముని గర్వమణచి
    వినయశీలంబె సర్వత్ర విజయమంచు
    చాటిచెప్పిన ఘనుడవు మేటివయ్య!..దొడ్డ...

9. సర్వగణములధిపతిగ సాధనాన
    నీవు జూపిన ప్రజ్ఞకు నీరజాక్ష!
    మిగుల నాశ్చర్యమొందెను మిన్ను మన్ను..దొడ్డ...

10.పంటలన్నియు సతతంబు పాడుసేయు
     ఎలుక మీదను నీవుండి యెఱుకగూర్చి
     జ్ఞాననేత్రంబునిచ్చిన జ్ఞానివీవు.
     దొడ్డ గణపయ్య ననుగావు దురిత హరణ!



 

29, జూన్ 2016, బుధవారం

పాఠశాల పూర్వ విద్యార్థుల సన్మానాలు. . 25.06.2016.సన్మానము. పూర్వవిద్యార్థులు,30.12.22..


            ధూళిపూడి పాఠశాల శతవసంతం

 1. ఉల్లముపల్లవించును మహోజ్జ్వల కీర్తికి మారురూపుగా
       చెల్లిన ధూళిపూడి దరిజేరగ వచ్చుచు నుంటినన్న యా
       సల్లలితానుభూతి ఘన  శారద దివ్యమనోజ్ఞ దీవనల్
       వెల్లువ కావలెన్నచట వేడిన నే పసివానికేనియున్.
            2. తపన దీర్చి దిద్ది తనయంత వానిగా
                శిష్య తతిని సతము చెలిమితోడ
                తనను మించిపోవ తన్మయత్వముజెంది
                పరవశించువాడె పరమ గురువు.
3.  తలచు కొనిరి నాటి తమతమ గురువులన్
      శిష్యకోటి యమల చిత్తములను
      అట్టి వారి జూచి యానందమొందితి
      మృదుల ప్రేమ విరియ హృదయమంత.
          4.  పాట పాడి రచట పరవశమందుచు
               కవితలల్లినారు ఘనత జూపి
               మాటలాడినారు మాన్యతదీపింప
               శిష్య గణము నాడు చేతులెత్తి.
5.  దూరము గల్గియుండినను దుష్కర కర్మలు చుట్టుముట్టినన్
       తీరము జేరుకోరికను తీరికజేసుక ధూళిపూడికిన్
       నారిని చేతగొంచు ఘన నవ్యవిలాస  వికాసులై మనో
       హారిత నేగుదెంచిన మహా దృఢ చిత్తుల సంస్తుతింతునే.
          6.  బాపయార్యు ఘనత బాగుగ బొగడుచు
               ప్రణతులిడిరి వారి ఋణముదీర
               కీర్తి శేషుడైన మూర్తియాతడనుచు
               సంస్తుతించిరంత సౌమ్యులగుచు.
 7.  మొదలి,పొక్కునూరి,ముచ్చట పోపూరి
      దూపుగుంట వారి ప్రాపకంబు
      ఎదురు లేని సుకవి ఎక్కటి వారలన్
      స్మరణజేసిరచట సాధుగరిమ.
           8.  మానెపల్లివారి మహిత ప్రబోధనల్
                తెలుగు వెలుగుజూపు ధిషణమణిని
                తలచినారలచట తనువెల్లపొంగంగ
                శిష్యులెల్ల జేరి చివరివరకు.
9.  నాడు వేసిన  ఘనుల పునాదిరాళ్లె
     నేడు మాకవి అద్దాల మేడలయ్యె
     నాటి వారల దీవనల్ మేటి సిరుల
     భోగభాగ్యాల నలరించి పుష్టిగూర్చె.

ప్రియమైన పూర్వ విద్యార్థులకు  
      ఆశీః పద్యసుమాలు.

    "హాయిగా నవ్వటం భోగం, నవ్వించటం యోగం, నవ్వలేక పోవటం రోగం"
     కనుక తాను నవ్వుతు నవ్వులపాలుగాక,ఎవరిని కానీయక, జీవితలక్ష్యాన్ని
     ఎలా శోధించి సాధించాలో మాకు నేర్పిన మార్గదర్శకులైన గురువర్యులకు
     శతధా సహస్రధా మనఃపూర్వక ప్రణామములు.. ఇదివారి బానర్. 

      సీ:  ఇంతటి చోద్యంబు నెవ్వారు చేయంగ
                            వినలేదు కనలేదు వేదికలను
             ఇంతటి ప్రేమయా? యీఛాత్రులకునెల్ల
                        "అమ్మభాష" యనిన నాదరంబు
             ఇంతటి గారవ మింత పీయూషమ్ము
                   "తెలుగు"నందని మీరు తెలిసివలచి,
             కొంతలో కొంతగ కొమ్మ పల్కులరాణి
                            పాదారవిందాల పట్టుమమ్ము
  తే.గీ: "భాగ్యనగరా"న మాకు సౌభాగ్యమలర
           పూర్వ విద్యార్థులెల్లరపూర్వముగ 
           సూత్ర బంధిత కుసుమాల శోభపగిది
           చేరి సత్కరించిరిట ఆశీస్సులివియె.1.

  తే.గీ: ఎంత యెదిగిన నొదుగుటే యింగితమని
          ఇట్టి పరమార్ధ మెరుగుచు పట్టుదలను
          మూలములనెల్ల మరువని మూర్తులగుచు
          మీరలుండుట సంతసమిడును మాకు.2.

   తే.గీ: మరువలేనట్టి ప్రేమను మాన్యతలను
           "శిష్యగణమె"ల్ల మోదాన చేరి యిచట
           పంచినారలు బుధులెల్ల పరవశింప
            నాయురారోగ్య భాగ్యాల నలరుడయ్య!3.

   ఆ.వె: తల్లి పాలు ద్రావ తరియించు జన్మంబు
            మాతృ భాష పలుక మమతలొలుకు
            నన్న విషయమెరిగి ఆంధ్రభోజుడు నాడు
            తెలుగు లెస్స యనియె ధీరుడగుచు.4.

      కం: వదలక మమతలు మీరలు
            పదిలముగా నుండుడయ్య పరమార్ధమదే
            సదమల భావ పూర్ణపు
            నెదలోపలె నీశుడుండు నెయ్యుడెయగుచున్.

    భాగ్యనగరం.            శుభాశీస్సులతో
    మల్కాజిగిరి      విశ్రాంతాంధ్రోపాధ్యాయుడు
    30.10.22.   పొన్నెకంటి సూర్యనారాయణ రావు.

1975-బాచ్ పూర్వ విద్యార్థుల సన్మానం.

గురుర్బ్రహ్మ గురుర్విష్ణుః గురుదేవో మహేశ్వరః1గురుస్సాక్షాత్ పరంబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః11.గురువు అను పదమే సంతత సన్మానార్షమైనది. అటువంటి గురుదీవనలను కోరుకొనుట సచ్ఛిష్యులందరకు సహజమే. ఆ కోరిక బలవత్తరమైననాడు తానే పరదేశములో నున్నా స్వదేశములోనున్నా మధువునుగ్రోలు మధుపము పద్మములను ఆశ్రయించు విధముగా, శిష్యమధుపములు గురు పాదపద్మముల నాశ్రయించుట ప్రకృతి సహజమే. అటువంటి మధురఘట్టమే నగరం మండల పరిధిలోని తడవర్తి బాపయ్య ఉన్నత పాఠశాలలో 1975-76సంవత్సరాలలో 10వ తరగతి చదువుకొనిన విద్యార్థినీ విద్యార్థులకు తమ గురువులను సన్మానించుకోవాలను సంకల్పము కలిగినది. 
         ధూళిపూడి గ్రామమనగనే అందరి హృదయాలలో మెదిలేది గ్రామదేవత తాళ్ళమ్మ తల్లి, శతవసంత శోభలు సంతరించుకొన్న మహాలక్ష్మమ్మ తల్లి, మహామహోపాథ్యాయుల పాదస్పర్శతో గళ మాధుర్యంతో విజ్ఞాన దీప్తులతో నిరంతర వాణీచరణ కింకిణీనాదములతో సుశోభితమైన తడవర్తి బాపయార్యుని పాఠశాల. అందువలన ముందుగా పూర్వవిద్యార్థులు ప్రశస్తమైన తాళ్ళమ్మ తల్లికి కొబ్బరికాయలు హారతి సమర్పించి  డప్పు వాద్యాలతో తమ ఉపాధ్యాయులను పాఠశాల వరకు ఊరేగింపుగా తీసికొనివెళ్ళి, తాళ్ళమ్మ తల్లికి ప్రదక్షిణలు గావించుట ఒక ప్రత్యేకత గా చేశారు. తదుపరి వారి రెండవ ప్రత్యేకత గజమాలలతో సత్కరించుట. సన్మానితుల బరువు షుమారు 50 కిలోలైతే గజమాల బరువు 150 కిలోలు ఉంటుంది. పూర్వవిద్యార్థులు మా శక్తి నెరిగిన పరేంగితావగాహులు కనుక మాపై అధిక భారము మోపకుండ వారు 90%మోసి మమ్ములను ఆనందపరిచారు. గజమాలను చూచి గజగజ వణకిన మాకు వారు భుజంకాయటం వలన సన్మానంచేయించుకొనే ధైర్యం కొండంత కలిగింది. పూర్వవిద్యార్థులకు మాకు వయసులో  భేదం షుమారు 15,16సంవత్సరాలే. మాకాశ్చర్యం కలిగించిన అంశం ఏమిటంటే "మాష్టారు మీరు మాకంటే ఎంగ్ గా కనబడుతున్నారు. మీ రహస్యం ఏమిటండి?"అని అడగటం.  దానికి మాసమాధానం "ఏమీలేదోయ్!మీ అందరి శక్తి మాలో విద్యుత్తులాగా ప్రవహిస్తున్నది."అని సమాధానం. అందరిలో నవ్వులపువ్వులు. తరువాత యథావిధిగా సన్మాన కార్యక్రమాలు, అందరి వ్యక్తిగత పరిచయాలు, భోజనానంతరం మా పద్యగద్య ఆశీస్సులు సాగాయి. కార్యక్రమం విజయవంతం అయినది. పుత్రాదిచ్ఛేత్ పరాజయం. అలాగే శిష్యాదిచ్ఛేత్ పరాజయం. మా పిల్లలు మాకన్న ఉన్నతస్థాయి పొందారు. వారందరి మాటలు వింటున్న మా ఆనందానికి అవధులు లేవు. ఇలాంటి గౌరవాలు మాకు శ్రీవాణీ పదపద్మరజోలేశము వలననే దక్కినవి. అమ్మకు జేజే,చదువులమ్మకు జేజే. మాకు ససన్మానం చేసిన మా పూర్వవిద్యార్థులందరికి (వచ్చినవారికి రానివారికి), పాఠశాల లో కార్యక్రమాలు జరుపుకొనుటకు సహకరించిన ప్రతి ఒక్కరికి  ధన్యవాదాలు, ఆశీశ్శతములు. శుభంభూయాత్!...
బాపయార్యుని సంకల్ప బలము వలన
త్యాగధనులైన విజ్ఞుల ధర్మమహిమ
వాణి యిచ్చోట కొలువుండ వరమునిచ్చె
అక్షరజ్ఞాన యజ్ఞంబు నమలుజరుప. 1.

ప్రియశిష్యులారా! మీ గురించి నాయూహ.

బెంచిపై సంచితో బేజారు మోముతో
                 నున్నట్టి మీరూపె యూహగాని
గడ్డాలు మీసాలు ఘన దేహ మార్పులన్
                   గుర్తుపట్టగ గల్గు స్ఫూర్తి లేదు
సూక్తులు సత్కథల్ శ్లోకాలభావాలు
                   తలలూచి విన్నట్టి తలపెగాని
సంఘ శ్రేయస్సుకై సాంద్ర మనస్కులై
             యుండిరో తొలగిరో యూసులేదు
  కలసికొంటిమి మనమంత గర్వపడగ
  వెలువరింపుడు మీదైన వివరములను
  జ్ఞానవిజ్ఞాన పర్వాల కలలపంట
  సత్కుటుంబ సద్విజయ సంచారములను.2. 

మీ సంస్కారం.....

సంకల్ప సిద్ధితో సన్మానమనుచును 
             గురువులగాంచుట గొప్పవరము
అక్షరజ్ఞానంబు నందినచోటనే 
     అందరు కుదురుట యమితముదము
ధనసంపదాళితో ధన్యత్వమెంచక
               గురుదీవనల్ కోర కోటి ఫలము
ప్రేమైక జీవులై ప్రియగురు పాదాల 
        అంజలించుట యది అమరఫలము
  ఎన్ని జన్మల పున్నెమో యేమొగాని
  మాకు దక్కిరి యిటువంటి మాన్య శిష్య
  కోటి ధూళిపూడి న మేము కోరకుండ
  బాపయార్యుని దీవనల్ పరిఢవిల్ల. 3. 

మేము నాటిన విత్తనాలీనాడు వటవృక్షములైనవి.

కొందఱు వైద్యులై మరియు కొందఱు వెజ్జులు శాస్త్రవేత్తలై 
కొందఱు సాఫ్టువేరు యుగ కోవిదులై యజమానులైరహో!
కొందఱు రాజకీయమును కోరిరి ధౌతపురీ నివాసులై. 
అందఱు అందఱే మరియు నందఱు అందఱు అందరందఱే.4. 

ఇలాగే అందరం కలసి....

మధురమధురమైన మహనీయ క్షణముల
తనివిదీర గడపి తన్మయముగ
భావి జీవితంబు బంగారుమయముగా
చేసికొందమయ్య స్థిరముగాను.5. 
     13.03.2023.

1989 బాచ్..కి ఆశీః పద్యాలు. 30.04.23.

గురుదర్శన సద్భాగ్యము
పరమాత్మను గాంచురీతి భద్రంబిడదే?
గురువాక్యశ్రవణంబది
నిరతము శిరసా వహింప నిఖిలము జయమౌ.

గురువును జూడగోరుటదె గొప్పగు భాగ్యము శిష్యకోటికిన్
నిరతము జ్ఞాన సంపదను నేర్పుగ పొంది సులక్షణాత్ములౌ
వర నిజ శిష్యులంగనుటవాంఛిత మోదము మాకు నెప్పుడున్
తరగని ప్రేమభావనల ధన్యత జెందుడు వాణి సత్కృపన్.

ధాన్య సంపత్తి తిండిచే శూన్యమగును
స్వర్ణ సంపత్తి కాలాన చౌకయగును
శిష్య సంపత్తి సత్కీర్తి శిఖరమగును
అట్టి సంపదె మాకు మహార్ణవంబు.

జ్ఞాన వృద్ధితోడ కర్తవ్యదీక్షను
చేసి మీరు మేరు శిఖరము వలె
కీర్తిగాంచుడయ్య కృష్ణయ్య కరుణచే
భుక్తి ముక్తి తోడ భోగమబ్బు.

మేము నాటిన బీజాలు మేలిమగుట
పసిడి పంటలు పండెను బాగుగాను
భావి జీవిత మంతయు తావులొలుకు
జ్ఞాన వృద్ధుల దీవనన్ సాగుడయ్య.









           
           
           

28, ఏప్రిల్ 2016, గురువారం

థూళిపూడి పద్యాలు. శతవసంతోత్సవము .

              తడవర్తి బాపయ్య ఉన్నత పాఠశాల శత వసంత
               మహోత్సవము సందర్భముగా వ్రాసిన పద్యాలు.

    1. సీ. ఎచ్చోట జదివిన నింజనీర్లై వెల్గి
                   దేశదేశాలకు థిషణ పంచు
             ఎచ్చోట దిరిగిన నింతింత యెదుగుచు
                    పదిమంది కాదర్శప్రాయులగును
             ఎచ్చోట నాడిన నీశ్వరు సైతము
                    గిర్రున ద్రిప్పుచు గెల్వ గలరు
             ఎచ్చోట నేర్చిన నే భాషలోనైన
                     పరదేశ వాసుల మురియజేయు
             ఎచ్చోట మెలగిన నెంతటి కష్టంబు
                     సహనంబుతోడను సరకుగొనడు
             ఎచ్చోట నెరిగిన ప్రేమానురాగముల్
                     విశ్వవ్యాప్తంబయి వినుతిగాంచు
            ఎచ్చోట సంగీత శిక్షణల్ పొందిన
                     విఖ్యాతిగన్నట్టివిబుథుడగును
    తే.గీ.  అట్టి ఘనతకు కాణాచి యవనియందు
             "థౌతపురి పాఠశాల"యే ద్యోతమగును
             సందియంబేల! మదినింక సరసహృదయ!
             సత్యమియ్యది యెందైన చాటగలను.
     2.సీ. శ్రీలకు నిలయమై చిరునవ్వు పంచుచు
                      ధర్మార్థములబెంచు "ధౌతపురిని"
              గాంథిజి యాత్రలో కాంచన రాసులన్
                       దానమ్ముజేసిన "థౌతపురిని"
              సాంఘిక కార్యాలు శతవిథమ్ములుగాగ
                        దారిజూపిన ఘన "థౌతపురిని"
              రాజకీయములందు రాటుదేలినయట్టి
                        ధన్యమూర్తులగన్న "థౌతపురిని"
       తే.గీ.కల్పవృక్ష సదృశమన నల్పమెయగు
               నంతకన్నను మిక్కిలి యనగదగును
               వాణి ,శర్వాణి ,లక్ష్ముల పాదస్పర్శ
               అణువునణువున నచ్చోట నందగింప.
     3.సీ. "బాపయ్య శ్రేష్ఠిదౌ "భవ్యసంకల్పాన
                      వాణి వేవేల నాల్కలన్ వరలెనచట
             "బాపయ్య శ్రేష్ఠిదౌ "భావనాబలమున
                       కోదండరాముని కోవెలమరె
              "బాపయార్యుని "ధర్మపావన గుణాన
                       అన్నసత్రమచట నవతరించె
              "బాపయ్య"యోచనన్ భాసురమైనట్టి
                        వాసంతశోభిత వనము వెలసె
       తే.గీ. "బాపయార్యుడు" తద్ధర్మ పత్ని సుగుణ
 .              విలసిత మతులైన కతన కలసి మెలసి
                ధర్మకామ్యార్థసిద్ధులై ధరణిబరగి
                నింగికేగిరి విమల వినీతులగుచు
   4.ఆ.వె. "ముళ్లపూడివారి "మోదంపు చట్టునై
                ఒనర "థౌతపురిని "నొజ్జనైతి
                ఎన్ని జన్మలెత్తి యేరీతిగురువుల
                ఋణముదీర్చుకొందు క్షణముక్షణము
   5.ఉ.పొందితి బాలబాలికల పూర్ణమనోజ్ఞ విశాలప్రేమలం
          బొందితి యాజమాన్యపు ప్రమోదము, నా క్రమశిక్షణమ్మునన్
          బొందితి గారవంబులిల పోరులుసల్పుచు కావ్యచర్చలన్
          పొందితి సర్వసౌఖ్యము లపూర్వముగాగ కవీంద్రుకైవడిన్
       
  6.ఆ.వె. "థూళిపూడి "చరిత ద్యుమణి వెల్గుల నింపి
                రచనజేసి తదియ రసమయముగ.
              " తాళమ"దయజూప ధన్యుడనయి
                శతకమల్లుకొంటి శాశ్వతముగ.
  7.తే.గీ.   తల్లికరుణన దనరారి ధన్యుడనయి
                ప్రగతిబాటను జేపట్టి ప్రజ్జ్వలించి
                ఎల్లజనులకు నుల్లంబు పల్లవింప
               "థౌతపురి "యందు ప్రేమను తనిసినాను.
  8.ఆ.వె.  "మొదలి"వంటివారి మోహనాస్త్రంబులన్
                "వేంకటేశ"వరుల విజ్ఞత లను
                 పరమనియమమూర్తి "బ్రహ్మయ్య"భాషలన్
                 నేర్చుకొంటి నేను నేర్పుమీర.
  9.తే.గీ.   "క్రొత్తమాష్టరనగ "కూర్చుంటి నిచ్చోట
                 వివిధ భాషలందు విజ్ఞులుండ
                 వారి ప్రేమగొనుచు వర్థిల్లి వర్థిల్లి
                ఇంతవాడనైతి వింతగాదె?
  10.ఆ.వె. సానబట్టి నన్ను చక్కని యొజ్జగా
                 చెక్కినట్టి గురుల చిత్తమందు
                 మరువబోనుగాక మరుజన్మనైనను
                 పాదమంటి ప్రతిన బల్కుచుంటి.








           
        

3, అక్టోబర్ 2015, శనివారం

కవి సమ్మేళనము అంతర్వేది.17.10.15, 18.10.15

పండిత పరిచయం. 3.10.2015  కవి సమ్మేళనము   అంతర్వేది 17.10.15, 18.10.15

  ఈ రోజు చిత్ర కవితా విశారదుడైన చింతా రామ  క్రిష్ణారావు  గారిని కలిశాను.ఆయన  సరళ స్వభావి. మాడుగుల నాగఫణి శర్మగారి దిల్లి అవధానంలొ కలిశాము. చక్కనిసాహిత్యసుధను పంచుకొన్నాము.మరలఈ రోజు దానిని నెమరువేసుకొన్నాము. అలాగే పోచిరాజుసుబ్బారావు గారు కూడా  పిలవగానే వచ్హారు. ముగ్గురము కలసి అంతర్వేది లో జరిగే కవి సమ్మేళనానికి కవితలు వ్రాసి పంపుతున్నాము. కలసి వెళ్ళి వద్దామని అనుకుంటున్నాము.  ఏ ఆటంకము లేకుండా జరిగితే మహదానందము.  ఈ కవితలు ప్రపంచ సాహితీ పుటల్లో ఉండిపోతాయి.


               

దుర్గ దంపతుల పెళ్లి రోజు శుభాకాంక్షలు.12.05.26.

 ఆ.వె: చందమామ రేల డెందాలుమురిపించు రేయి బవలు వెల్గు రేడు నీదు మేనమామ; మనసు మెచ్చిన చెలికాడు జీవన పయనాన నావయతడు.1  సీ : ఒకచోట దుర్గమ్మ ఒకచోట ...