30, జనవరి 2018, మంగళవారం

సురుటువల్లి. 27.01.2018.

సూళ్లూరుపేట నుండి పుత్తూరు వెళ్ళే మార్గంలో గల "సురుటుపల్లి" లో  ఈ "పల్లికోటేశ్వర స్వామి" వేంచేసియున్నారు. ఇచటి అమ్మవారు " మరగతాంబ" (పార్వతీదేవి) . పాలసముద్ర మథనానంతరం ముందుగా హాలాహలం పుట్టింది. దాని వలన పదునాలుగు లోకాలకు ప్రాణ ప్రమాదమని దేవదానవులు భయపడుచుండ ప్రేమస్వరూపిణి,మాతృమూర్తి అయిన  "జగదంబ" ఈ గరళమును ఉండగాజేసి తినుడని పతిని కోరినది. భార్య ప్రేమతో కోరిన ఏ భర్త కాదనును? (అది ఎటువంటి కోరికైనను). పవిత్రప్రేమకు అంతటి మహత్తర శక్తి కలదు. ఈ స్థితికి దశరథ  శ్రీ రామాదులును లొంగినవారే. స్త్రీలు స్వార్థపరులై అడిగే కోరికలనే తీర్చగల భర్తలు లోక కల్యాణము కొరకు తీర్చకుందురా? భగవంతుడే అట్లయిన అల్పమానవుల సంగతి చెప్పనేల?  పరమశివుడు హాలాహలమును రేగుపండంత పరిమాణముజేసి కంఠమున దాచి (లోకరక్షణార్థం) "గరళకంఠుడు"గా ప్రసిద్థిగాంచెను. ఆ భుక్తాయాసముతో ఈ తావున  అమ్మవారి యొడిలో కొంతసమయము  విశ్రాంతి తీసికొని మహదానందము చెందినాడట." పరోపకారార్థమిదం శరీరం" అనుదానిని ప్రత్యక్షంగా చేసి చూపారు పరమాత్మ. ఈ సందర్భంలో నే "సహజకవి పోతన్నగారు" భాగవతంలో                " మ్రింగుమనె సర్వమంగళ , మంగళ సూత్రమ్మునెంత మది నమ్మినదో "అంటారు. ఆత్మ విశ్వాసం ఎంతగొప్పదో దీని ద్వారా తెలిపారు.
          ఇచటి శివుని దర్శించుటకు సురలోకమంత తరలి రావటం చేత "సురలపల్లి" గా ఉండి కాలక్రమేణ "సురుటుపల్లి" అయిందట. శ్రీరాముడు శివలింగాన్ని ప్రతిష్టించాడట. అచట ఆయనతో వచ్చిన లవకుశుల పాదముద్రికలు కానవస్తాయి. కాని ఆనాటికి వారి పాదాలు అంత చిన్నవి కావేమో అనిపిస్తుంది. వాల్మీకి మహర్షి కూడ అచట దర్శనమిస్తారు.

సురలనాదరించి శోభాయమానుడై, 
సురుటుపల్లిలోన సుందరుండు,
నగజ యొడిని నుండి నయనాలు ముకుళించి
ఆత్మతృప్తుడాయె అంబ మెచ్చ.

         మనం పురాణాలు పాతచింతకాయ, చాదస్తం అని భావించక సమ సమాజానికి అవసరమైన మేరకు ఉపయోగించుకోవాలి.    శుభంభూయాత్!

19, జనవరి 2018, శుక్రవారం

కోటప్పకొండ.

త్రికూటేశ్వరస్వామి దర్శనం.










గుంటూరు జిల్లా నరసరావుపేట కు 17కి.మీ.దూరములోనున్న కోటప్పకొండ అనబడే పుణ్య క్షేత్రం లోని త్రికూటేశ్వరస్వామి దర్శనం అమోఘజ్ఞానసాధనా మార్గం.ఈ పవిత్ర శైవక్షేత్రమే త్రికూటాచలం. అనగా మూడుకొండలసమాహారం. శివాలయం షుమారు 600అడుగుల ఎత్తు, కొండ షుమారు 1587అడుగుల ఎత్తు ఉంటాయట. స్థలపురాణము ననుసరించి దక్షయజ్ఞానంతరము పరమశివుడు పార్వతీసతీ వియోగతప్తుడై ఒక కొండమీద తపస్సుచేశాడట. ఇది గమనించిన బ్రహ్మాదిదేవతలు తమకును జ్ఞాన సంపదను ప్రసాదించమని కోరగా మీరెల్లరును ఇచటకేవచ్చి జ్ఞానం పొందుడని అన్నాడట. అదే ఆనందంగా భావించి బ్రహ్మ , విష్ణువు ఇతరదేవతలతోగూడి త్రికూటాచలం చేరి జ్ఞానం పొందారట. ఒక కొండపై విష్ణువు మరొక కొండపై శివుడు ఉండుటచే శిఖరములందు శివలింగములు వెలిశాయి. మూడవ కొండపై బ్రహ్మదేవుని ప్రార్థనపై శివలింగం వెలసినదట. గొల్లభామ అనే భక్తురాలి గుడి స్వామి వారి గుడికి కొద్దిదూరంలోనే ఉంది.
షుమారు 20 సంవత్సరాల క్రితం వరకు భక్తులు  చాలా గొప్పగా ప్రభలను తయారుచేసి  శివరాత్రికి  శివనామస్మరణ తో తయారుచేసిన ఆ ప్రభలను      4 లేక 6 జతల బహువిధాలంకృతమైన ఎడ్లచే ,కొన్ని ప్రభలకు కొంగ్రొత్త గిత్తలను, మరి కొన్నిటికి గొర్రెలను కట్టి   కొండచేరువకు చేరి "చేదుకో కోటయ్య మమ్మాదుకో కోటయ్య" అంటు అలవోకగా   300మెట్లెక్కి దైవదర్శనం చేసుకొనేవారు. ఆనాటి ప్రభలలో "పూసకూర్పు ప్రభ"(పూసలతోఅలంకరణ చేసినది) ప్రసిద్ధిచెందినది. కాలక్రమేణ ప్రతి గ్రామానికి కరెంట్ వచ్చిన కారణంగా పెద్దప్రభలకు ఆటంకం ఏర్పడి ప్రభలు మాత్రమే చిన్నవైనాయి కాని భక్తి స్థాయి పెద్దగానే  ఉంది. మరల మాట్లాడితే రెండింతలు పెరిగిందనే అనాలి.
నా చిన్ననాటి మరపురాని మధురానుభవాలు.
దాదాపు 1960 వ సం.నుండి 1964 సం.వరకు మా నాన్నగారు నన్ను కోటప్పకొండకు తీసికొని వచ్చేవారు. స్వామికి గుడిలో కొబ్బరికాయ కొట్టి దండంపెట్టడం ఒక సవాల్ అయ్యేది. బలవంతులు (భక్తిలోకాదు) మాత్రమే కొట్టగలిగేవారు. ఆనాడాపనిని చేసి చాలా గొప్పగా భావించేవాడిని. నాన్నగారు సున్నితమైన,పండిన, ఆథ్యాత్మిక శైలిలో "వద్దులేవయ్యా ఆ శివుడు లోపలే కాదు బయట గోడలో కూడ ఉన్నాడు. అక్కడ కొట్టు" అన్నారు. నన్ను మానాన్నగారెప్పుడు "ఏరా" అని సంబోధించగా నేను వినలేదు. ఆ నాటికి నాలో భక్తి కన్నా శక్తే ఎక్కువగా ఉండేది. కనుక సవాలునెదుర్కొనటానికే సిద్ధపడేవాడిని. ఆ విషయం ఇప్పుడు అర్ధమైనది. 
తే.గీ.గర్భ గుడిలోన వెలుపల గాలి లోన,
నీటిలోపల రాతిలో నింగిలోన 
      చెట్టుచేమలు పలువిధ జీవులందు 
              గుట్టుగానుండు మహదేవగురువరుండు.
తే.గీ. ఉన్న భావన గల్గిన నుండునతడు 
                సున్న యనువానికాతడు శూన్యుడెపుడు
     కలడు లేడను వాదంబు కంఠశోష
       తనదు సద్గుణసంపదే దైవమగును.

చెప్పక పోవడమేలా ? శివరాత్రి కి జాతరలో తిరిగితిరిగి మరుసటిరోజు  బడి, ట్యూషను ఎగగొట్టేవాణ్ణి. ఇక తెలిసిన విషయమే. ఆనాలుగు అక్షతలు మాష్టార్ల వంతు, ఆతిట్లకు అశ్రునయనపూరిత మౌనం నావంతు. గురువులు శిష్యుల భావిజీవితాన్ని ఆలోచిస్తారు. లఘువులు గురువుల కాఠిన్యాన్ని ద్వేషిస్తారు అజ్ఞానాంధకారంలో.

ఈనాటికి ఆనాటికి ఎంతతేడానో దేవాలయ అభివృద్ధిలో మన మనసులలో... కోటప్పకొండను మంచి పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తరఫున మంచి కృషి జరుగుతున్నది.  సరోవరాలు, బోట్ షికార్లు, పిల్లలకు ఆహ్లాదకర విహారాలు తయారవుతున్నాయి. ముందుముందు మిక్కిలి సుప్రసిద్ధ పర్యాటక క్షేత్రస్థాయినందుకోగలదు.
శివరాత్రి పర్వదినాలలో తప్ప కొండపైన భోజన వసతి లేదని చెప్పారు. చక్కని రోడ్లు వేయటంవలన భక్తులకు మరింత సౌకర్యం పెరిగింది. కొండపైన కూడ నిరంతర అన్నదానం (కూర,చారు,మజ్జిగ) ఉంటే భోంచేసిన భక్తులు తిరిగి విరాళాలు ఇవ్వటం వలన వృద్ధిచెందుతుంది. ఏదో ఒక సారి ఆ ప్రాంతం వెళ్ళినపుడు తప్పనిసరిగ కోటయ్యను చూచివద్దాము. 
శుభంభూయాత్!



14, జనవరి 2018, ఆదివారం

సంక్రాంతి శోభ. అనుబంధాలు, కవితాభారతికి పద్యాలు.

గోదాకల్యాణ మహోత్సవము. గుంటూరులో మా తమ్ముని ఇంట్లో  కొడుకులు,కోడళ్ళు, మనుమలు ,మనుమరాళ్ళతో సంక్రాంతి సంబరాలకు శ్రీకారం. బంధుత్వాలు బలపడేటందుకు  ముఖ్య కారణం అనురాగం, ఆప్యాయతలు. కలసినప్పుడు చిరునవ్వు తో నోరారా పలుకరించుకోవడం. అవి పెరగటానికి ఒక్కసారైనా అందరు కలసి కష్టసుఖాలు పంచుకుంటు ఆత్మీయతలను పెంచుకుంటు పంచుకుంటేనే ఆనందం దక్కుతుంది. అందునా మనం తెలుగు వారం కనుక తెలుగు పండుగలను సంప్రదాయబద్ధంగా చేసుకుంటే భావితరాల మన పిల్లలకు మార్గదర్శకులమౌతాము. ప్రతి భారతీయ సంప్రదాయం వెనుక మన సంస్కృతి రహస్యం దాగిఉంది.
    భోగి....నువ్వులనూనెతో, నలుగుపిండితో స్నానం పాపహరం, ఆరోగ్యప్రదం. భోగిమంటలో పాతవస్తువులను కాల్చటం స్వచ్ఛ భారత్ అయితే పాత పాతకపు ఆలోచనలను కాల్చి నిర్మల ప్రేమమయ భావనా సంపదను ఉత్తరాయణ పుణ్యకాలంలో పంచుకోవడం పరమ వరముగా భావించవలసిన స్వచ్ఛభక్తి భారత్.
 ఈరోజు తో ధనుర్మాసం పూర్తి అయి 30పాసురములసేవతో మధుర భక్తి తో  శ్రీకృష్ణుని జేరిన ఆండాళ్ తల్లి పరమపూజ్యురాలు. అందు వలననే గోదాదేవి కల్యాణం చేస్తే మన జీవితాలు మంగళప్రదమౌతాయనే ఆ కల్యాణం చేస్తారు. ఆ కల్యాణం చేస్తు మా తమ్ముని కుటుంబం ధన్యమైనది.
  సూర్యడు మకరరాశిలో ప్రవేశం వలన ...మకరసంక్రాంతి.
      భూమినుండి సూర్యుడు దక్షిణం నుండి ఉత్తరానికి జరుగుతు పోతు ఉన్న కారణంగా సంక్రాంతి నుండి ఉత్తరాయణ పుణ్యకాలం. ఎంత పుణ్యకాలమంటే "ఉత్తరాయణం వచ్చింది ఉరిపెట్టుకొని చావండి" అనే నానుడి వచ్చింది. అంటే అర్థం అందరిని చావమనికాదు. అంతప్రశస్తమైనదని అర్థం చేసుకోవాలి. పూర్వీకుల చమత్కారాలు కూడ ఆథ్యాత్మిక పరంగా ఉండేవి.
   భూమాత కరుణ వలన రైతులకు చక్కని పంటలు ఇంటికి వచ్చి ఆ ఇల్లు, కళకళలాడుతూ ఉంటుంది. మన దేశంలో రైతుకి సిరిసంపదలు వస్తే అందరికి వచ్చినట్లే. అందుకే లాల్ బహదూర్ శాస్త్రి గారు "జై జవాన్ జై కిసాన్"అన్నారు.
ప్రతి తెలుగిల్లు కూతుళ్ళు అల్లుళ్ళతో, కొడుకు కోడళ్ళతో , మనమలు మనుమరాళ్ళతో ఆ ఇల్లు కిటకిటలాడుతు ఆనందం పొంగిపొరలుతుంది.
    బొమ్మలకొలువు ప్రత్యేకత సంతరించుకుని ముత్తైదువుల ఆశీస్సులతో  చిన్నపిల్లలు భోగిపండ్లు కొంచెంగోలచేస్తు పోయించుకుంటారు. దానితో వారిపైగల దృష్టి దోషం తొలగి సుఖ సంతోషాలతో ఉంటారు.
    మూడవరోజు కనుమ..  మనకు పంటలను ప్రసాదించే బసవన్నల దగ్గరనుండి ప్రతి జంతువు పక్షిజాతులు మనకు ఆరాధ్యాలే..అందువలననే ఆరోజు పశువులనలంకరించి ఆరాధిస్తారు. ఇందులో ప్రతి జీవరాశిలో పరమాత్మ ఉంటాడనే ఆథ్యాత్మికత దాగిఉంది.
             అందరికి శుభాకాంక్షలు. మన సంప్రదాయాలను కాపాడుకుందాం..
భోగిశుభాకాంక్షలు. 
  సూర్యుడు మకరరాశిలో ప్రవేశించడమే మకర సంక్రమణము.  సంక్రాంతి
  నుండే ఉత్తరాయణ పుణ్యకాలం. ఇది 3రోజుల పండుగ. మొదటిరోజు భోగి,రెండవ రోజు మకరసంక్రాంతి,మూడవరోజు కనుము. భోగిపండుగ
ఎలాచేసుకుంటారు....ఉదయాన్నే లేచి భోగిమంటలు వేయడం, ముగ్గుల్లో గొబ్బెమ్మలం పెట్టడం, సాయంకాలం పిల్లలకు భోగిపళ్ళు పోయడం. భోగి కుండలు అమర్చుకోవడం. ఇలా ఎన్నో రకరకాలు చేసుకుంటాం. ఇవే విషయాలు చిన్న కవితలో చూద్దాం. 

     భోగిమంటలు వేసుకుందాం, భోగి పండగ చేసుకుందాం!

     పనికిరాని చెత్తనంతా, పాత మాస్కుల కుప్పనంతా
     పెరుగుతున్న క్రూరక్రిములను, పెచ్చరిల్లే వేరియంట్లను!!భోగిమంటలు!!
     మంగళ స్నానాల్ మంచిగ చేసి, క్రొత్త బట్టలు ధారణచేసి
     గుమ్మడిపూల  గొబ్బిదేవతల పూజలు చేస్తు ముందుకు పోదాం
     స్వాగతమిద్దాం సరదా భోగికి, సందడిచేద్దాం రారండోయ్ రారండోయ్!!భోగి!!
     రేగు పండ్లతో  దిష్టినితీస్తు తోయజాక్షులు
     దీవనలిత్తురు.!భోగిమంటలు
      పెద్దలు పిన్నలై దీవనలందిరి ఆనందంతో...
     భోగి కుండల మోహనకాంతులు పూర్ణకుంభపు పుణ్యరాసులై
     జీవన విధిలో సుఖములీనగా...భోగిమంటలు!!

                        మకర సంక్రాంతి.

  ఈరోజే సూర్యుడు మకరరాశిలో ప్రవేశించిన మకర సంక్రాంతి. 
   విశేషాలు కవితలో

   రైతు ఆశల పంట ఫలములు, ఇంట నిండుగ నిండగా
   గుండె నిండిన సంబరాలె, గుర్తులై చిరునవ్వులు చిందగా
   వచ్చిన మార్పే వరాల పండగ, సంబరాల సంక్రాంతి
   గోమయపు ముద్దలే గోపికలై విరియగా, కన్నెలు పూజించు 
                                          క్రాంతి సంక్రాంతి.
   క్రొత్త అల్లుళ్ళు,నవ వధువులేకమై,ఇంటింట చేసెడు ఆనందహేల
   సూర్యున కిష్టమౌ క్రొత్తబియ్యపు పొంగళ్ళు, అమృతమధురిమలలీల
   బంధుగణముల బహుముఖపాండిత్య,చమత్కారాల గోల
   హరిదాసు గానాల ఆనంద భక్తితో పరవశమమందుచు
    ధాన్యాల దానాల ధర్మంపు భావాలు.
    బొమ్మల కొలువున అమ్మల ఆశలు,పిల్లలకెంతో ప్రేమదీవనలు
    భోగిపళ్ళతో లోగిళ్ళన్నీ, ముద్దుగుమ్మల సంబరాలతో
    ఆనందాలే హరివిల్లై నిండుగ నిండే పండగ సంక్రాంతి.

     మరి కనుమ నాడో!!

     పశువుల పూజకు ప్రాధాన్యంగా, త్యాగజీవులకు నిస్స్వార్ధంగా
     మనస్ఫూర్తిగా గౌరవమిచ్చే, సంప్రదాయపు పండుగ కనుమ
     గంగిరెద్దుల ఘన విన్యాసాలు, తెలుపును మనకు క్రమశిక్షణను
     దారము ఆధారంగా నింగికి యెగసే పతంగులన్నీ
     తెలుపును మనకు లక్ష్యసాధనను
     కోడిపందెముల సంప్రదాయములు,తెలుపును మనదౌ పౌరుషాగ్నిని
     కనుమా!కనుమను క్రాంతి దాతగా, మనుమా భావి సుఖప్రదాతగా!!

సంక్రాంతి కవితాభారతి. 28.12.22.
సీ:  గృహముల ముంగిళ్ళ కేరింతసందళ్ళ
            మోహనాంగులు దీర్చు మ్రుగ్గులలర
      కపిల గోదుగ్ధముల్ కమ్మగ ద్రావుచు
            లీల గెంతులిడెడు లేగలలర
      పాడిపంటలునిండి పరవశంబందిన
             కర్షకునేత్రాల కాంతులలర
       హరిదాసు బృందాల " హారిలోహారం"చు
             భక్తి మీరినహోరు  రక్తిదనర
  తే.గీ: కోడిపందాల పౌరుషాల్ , కోడెగిత్త
          బండ లాగుళ్ళ సంబరాల్ పండుగనగ
          వచ్చె సంక్రాంతి మాలక్ష్మి వైభవాన
          భారతీయత పండిన పడతివోలె
          పిన్నపెద్దల డెందాల ప్రేమ నింప.

    భోగి శుభాకాంక్షలు.

  సీ:  పాడైన వస్తువుల్ పనికిమాలిన చెత్త
                    లోగిళ్ళ దహియింప భోగియనిరి
          కన్యకామణులెల్ల ఘనరంగవల్లుల
                     లోగిళ్ళ రచియింప భోగియనిరి
          పరుష సంభాషణల్ పాపచింతలెదల
                     లోగిళ్ళ గాల్చుట భోగియనిరి
          కుంకుళ్ళరసముతో కూర్మికేశాఘముల్
                      పోగొట్ట ఘనమైన భోగియనిరి
          గోమయపరికల్ప గొబ్బిళ్ళ సొబగులే
                       భూమినిండినవేళ భోగియనిరి
   తే.గీ:ఇట్టి భోగాల నందు మహేంద్రరూపి
          భారతీయుడొకండె సూ వేరులేడు
          సంప్రదాయంపు సంపదల్ సవ్యరీతి
          భద్రపరచిన మనకీర్తి భద్రమగును.

    సీ: ఉత్తరాయణమందు నుత్తమ కార్యాలు
                    పుణ్యమిచ్చుననిరి మునులునాడు
           మంచిగుమ్మడిపండు మహదాన మిచ్చిన
                    సత్ఫలంబులనిరి సకలమునులు
           పోయిన నరులకు  పుత్రతర్పణమున
                     నరకముండదనిరి నైష్ఠికాళి
           మకరసంక్రమణంబు మహనీయ కాలమై
                      పుణ్యప్రదమనిరి మునులునాడు
     ఆ.వె: మకరరాశియందు మాన్యుండు రవిజేర
              ఉత్తరాయణమయి చిత్తమలరు
              జీవనంబు మిగుల జేగీయమానమై
              శుభములందు నరుడు శోభనముగ.
     ఆ.వె. రేగి పండ్లు బోయ రేగిన జుత్తుతో 
              పాపలెల్ల విరియు పర్వ మిదియె 
              పాప దృష్టి తొలగి పదివేల కాలాలు 
              బ్రతుక గోరు క్రాంతి పధము లివియె.

                           కనుము.శుభాకాంక్షలు.
                             
            సీ:  భారతదేశాన పాడిపంటలసిరుల్
                     బసవదేవుని కృపను వరలుచుండు
            భారతీయుల జాతిపౌరుషంబును దెల్ప
                      కుక్కుటంబులబెంచు కూర్మిదెల్పు
             సర్వపాపవిదారి చల్లని గోమాతృ
                        సేవయె దెల్పును శ్రీపథమ్ము
              సకలజీవులప్రేమ సౌభాగ్యదమ్మని 
                         కరుణజూపుటె మన కనుము కనుమ
     తే.గీ: ప్రకృతి సర్వంబు ప్రేమైక భావనమున
              పరిఢవిల్లిన తోడగు పరమశివుడు
              విజయపథమిచ్చి కాచును నిజముగాను
              భారతీయత లోనున్న పారమిదియె.
                     




5, డిసెంబర్ 2017, మంగళవారం

నిర్మల్ విహారయాత్రానుభవాలు. జలపాతాల దృశ్యానుభూతులు.

నిర్మల్ విహారయాత్రానుభవాలు. జలపాతాల దృశ్యానుభూతులు.

 నిరంతరం శ్రమపడే మానవ  మేథస్సునకు ప్రకృతి సందర్శనాన్ని మించిన ఆనందం ఉత్తేజం ఏముంటుంది చెప్పండి. అందుకే  నిర్మల్ లోని హస్త కళా సౌందర్యాలు, సమీపంలోని జలపాతాల పరవళ్ళు, అందాలు ఆస్వాదించే కోరికతో ది.2.12.2017.న ఉ.7గం.లకు హైదరాబాద్ లో  మా బావగారైన శ్రీ పులిజాల సత్యనారాయణ(రిటైర్డ్ ఆర్కియాలజీ సూపరింటెండెంట్) గారి ఆధ్వర్యంలో  నేను( పొన్నెకంటి సూర్యనారాయణ రావు) నా శ్రీమతి ఇందిరాదేవి, పెద్దచెల్లి అరుణ, చిన్నచెల్లి పద్మ జారాణి, మేనకోడలు సంథ్యారాణి, పిల్లలు ఆదిత్య,లలిత, మిత్రుడు గోవింద్ తలిదండ్రులు బయలుదేరి(NH44) జాతీయ రహదారిలో  210 కి.మీ. దూరాన ఉన్న నిర్మల్ కు మధ్యాహ్నం చేరి, అచట హోటల్ లో విశ్రాంతి , భోజనానంతరం నిర్మల్ కు 38 కి.మీ. దూరంలో గల పొచ్చెర జలపాత సందర్శనానికి వెళ్ళాము.

   ముందుగా నిర్మల్ బొమ్మలు..కళాకారుల.,తయారీ విషయాలు...

 అత్యంత మృదువుగా, తేలికగా ఉండే "పునికి" కర్రతో చేయబడే ఈ బొమ్మలకు 400సంవత్సరాల చరిత్ర ఉంది. కళాకారులు "నకాషీ" కులానికి చెందిన కళాకారులు. వీరు "మరట్వాడ" ప్రాంతీయులు. నిర్మల్ సంస్థానాధిపతి "నిమ్మనాయుడు" దేశం నలుమూలలనుండి కళాకారులను రప్పించి హస్త కళలను పోషించి వృద్ధిచేశాడు.
                                 తయారీ విధానం.
       ముందుగా చేయదలచుకొన్న బొమ్మకు దగిన ఆకారపు ముక్కలు తీసికొని, చింతగింజలు నానబెట్టి జిగురువచ్చువరకు రుబ్బి  పేస్ట్ చేసుకొని, దానిని కొయ్యపొడిలో కలిపి కావలసిన బొమ్మ చేసి దానిని ఎండబెట్టి నునుపు చేసి తగిన రంగులు వేస్తారు. ఆరంగుల తయారీలో చెట్ల ఆకురసాలు, పూల రసాలు వాడతారు. ఈ రంగులలో బంగారురంగు తయారీకి చాలా ఎక్కువసమయం శ్రమ పడుతుంది. ఈ రంగులు అత్యంత మనోహరంగా, మన్నికగా ఉంటాయి. బొమ్మలన్నీ సజీవకళతో ఉట్టిపడుతుంటాయి. ఈ బొమ్మల కళాకారుల సహకారసంఘం 1955 లో స్థాపించబడినది. ఈ నిర్మల్ పంచపాత్రలకును ప్రఖ్యాతి చెందినది.

     సువర్ణ పుష్పాభిషేకంతో  నిజాం నవాబు, అవాక్కు.

       ఒకసారి నిజాం నవాబు నిర్మల్ పట్టణానికి వచ్చిన సందర్భంగా
వారికి ఇచటి కళాకారుల చేత బంగారు(చెక్క)పూలు చేయించి వాటితో సువర్ణ పుష్పాభిషేకం చేశారు. కొద్ది సేపటికి నిజం తెలుసుకొని నవాబు గారు అవాక్కయ్యారట. ఇది నిజమైన భగవద్దత్తకళ. శిల్పకళవంటిదే దారుకళ. దారువు అంటే కర్ర.

   దారుకళాధురీణా!నిర్మలవాసా! దండంబులందుకోవయ్యా!
     
   1. కడుపునిండిన నిండక కలతపడక
       భరతజాతికి కీర్తికి బాటవేసి
       నలువ రూపంబు ధరియించి నవ్యరూపు
       సృష్టిచేసితివయ్యరో చెలువుమీర

   2. నిర్మల వాసివౌ సత్కళా నిర్మ లాత్మ!
       త్యాగపరిపూర్ణ సద్భావ యోగివర్య!
       వందనంబులు నీకెపుడు వందవేలు
       జాతి మరువదు నీదు విఖ్యాతి యెపుడు.

   3. "పునికి" కర్రకు నిపుణత పురుడుబోసి
        పూర్ణ రూపాలు సృష్టించు పుణ్యులార!
        రంగురంగుల యందాలు రహినినిలుపు
        మీకు శుభములుకలుగుత మిగులశోభ!

                          పొచ్చెర జలపాతం.

    ఎక్కడో పుట్టిన అప్సరసల వంటి నదీ కన్నెలు తమ చెలికత్తెల వంటి ఉపనదులతో గూడి చిలిపి వలపులతో రసికులనూరిస్తూ, చిత్రకారుల కుంచెలకు పనిచెబుతు, కవుల మస్తిష్కాల ఊహలకు ఉయ్యాలలూపుతు, సంగీతజ్ఞుల సరిగమలకు సాయంపడుతూ తమ ప్రత్యేకతలను చాటుకుంటు భూమాతపాదకమలాలను స్పృశించాలని తపనపడేవే జలపాతాలు. మన పౌరాణిక ఆధారాన్ని అనుసరించి భగీరథుని దయ వలన భువికి దిగినదే గంగారూపి జలపాతం. ఇలా ఎన్నో నదులు ఎన్నో దేశాలలో జలపాతాలై మధుర మనోజ్ఞ దరహాస చంద్రికలను, రమణీయ కర్ణపేయ సంగీత నాదాలను వినిపిస్తు ప్రకృతి ప్రియులను అలరిస్తున్నాయి.
       పొచ్చర జలపాతం నిర్మల్ కు 38 కి.మీ. దూరంలో ఉంది.
ఎన్నో ఓషథీ గుణాలను సంతరించుకొని అతి స్వచ్ఛమైన పరవళ్ళు త్రొక్కే నీటితో తన దరిజేరిన వారికి అమితానందాన్నిస్తుంది.
మేము ఆ ఆనందాన్ని ఎంత సేపు అనుభవించామో! రకరకాలుగా ఛాయాచిత్రాలు తీసుకొని పదిలపరచుకున్నాము. ఇచటికి మా బావగారు కూడ రాగలుగుతారనే ఉద్దేశంతో నే ముందుగా దీనికి వచ్చాము. ఇచటి అందాలను వృత్తిపరమైన ఛాయాగ్రాహకులైతే ఎంత ఒడుపుగా బంధిస్తారో! నాకు మదిలో అత్యుత్తమ ఛాయాగ్రాహకుడైన నా బావ మరది కీ.శే. గంగరాజు వాసుదేవమూర్తి మెదిలాడు.

     పొచ్చెర జలపాతంబది
     యచ్చెరువగుగాదె మనకు హ్లాదినియగుచున్
     చెచ్చెరదూకగముందుకు
     చిచ్చరపిడుగయ్యెమనకు సిరులనుగూర్చన్.

      జలపాత దర్శనానంతరం నిర్మల్ బొమ్మల తయారీ, పూర్తిగా తయారయి అమ్మకానికి సిద్ధంగా ఉన్నవి , ఆయిల్ పెయింటింగ్స్ చూచాము. అవి సజీవ దారు శిల్పాలు. మన భారతీయుల కీర్తి కిరీటాలు. స్వచ్ఛ విజృంభమాణసృజనలు. అభివృద్ధి వారి కళాకౌశలాలలో కనపడుతున్నదే కాని వారి జీవితాలలో కాదని ఆ కళాకారులను చూచినపుడు అవగతమౌతుంది. దానికి మనం స్పందించాల్సిన విధానం ఒక్కటే. వారి వస్తువులను మనం కొని ప్రోత్సహించటం. అందుకే మేము కొన్ని బొమ్మలను కొన్నాము.

         ది.3.12.2017. న.   కుంతాల జలపాతం.

 ఈ జలపాతం ఆదిలాబాద్ జిల్లా, నేరడిగొండ మండలం "కుంటాల"గ్రామంలో ఉంది. దీని ఎత్తు 147అడుగులు. హైదరాబాద్ నుండి 237కి.మీ. నిర్మల్ నుండి షుమారు35 కి.మీ. వెళ్ళి నేరడిగొండ నుండి కుడివైపునకు తిరిగి 13కి.మీ వెళితే "కుంటాల" జలపాతం వస్తుంది. దుష్యంతుని భార్య శకుంతల ఇచటికి వచ్చి స్నానంచేసి వెళ్ళేదట. ఆమె పేరు మీద ఈ జలపాతానికి "కుంతల"జలపాతం అని పేరు వచ్చిందట. భూమట్టం నుండి క్రిందకు 408 మెట్లు ఉన్నాయి. కాని చాల విశాలంగా ఉండి ఎక్కువ శ్రమలేకుండ దిగి ఎక్కగలిగేలా ఉంటాయి. కొంత మధ్యలో విశ్రాంతి తీసుకుంటు వెళ్ళిరావటం శ్రేయస్కరం. అత్యంత మనోహరదృశ్యం. వర్ణనాతీతం. కాని నీరుపారే ప్రాంతమంతా పాచి ఉండి ప్రమాదానీకి హేతువౌతుంది. మిక్కిలి జాగ్రత్త అవసరం.
 
  కుంతల జలపాతంబిది
  ఎంతయు ఘనమైనలోతు ఏమామలుపుల్
  వింతకు వింతై తోచు,శ
  కుంతలపేరన్ బరగుచు కూర్మిన్ గూర్చున్.

                                  ముఖ్య విషయం.

   అచటికి వెళ్ళేముందే మనం దారిలో మనకోసం ఎంతో ప్రేమగా, ఆశగా ఎదురుచూచే వానరాల కొరకు కొన్ని ఫలాలను తీసికొని వెళ్ళటం మరచిపోరాదు. మనం తిన్నది మట్టిపాలు. పరులకు పెట్టేది పరమాత్మ పాలు. పరమాత్మ అనుగ్రహిస్తే వరాలు. ఆగ్రహిస్తే శాపాలు. మనం జీవకారుణ్యాన్ని పాటించుదాం, తోటివారికి సాయపడదాం.  కళాకారుల జీవితాలలో వెలుగులు నింపే ప్రయత్నం చేద్దాం.  ఇలాంటి కార్యక్రమాలు అక్రమార్జనాపరులు చేస్తే వారి పాపాలన్నీ పటాపంచలైపోతాయి. అందుకే వారిందులోకి రారేమో!  ప్రభుత్వాలు కూడ కుటీర పరిశ్రమలకు ఎక్కువ చేయూత నివ్వాలి. వారి జీవితాలలో కాంతులు నింపాలి.

              మేరా భారత్ మహాన్.  జై భారత్. జైజై భారత్.




 

 


     
     



5, అక్టోబర్ 2017, గురువారం

న్యూ నాగోల్ సన్మానము. 2.10.2017.

     న్యూ నాగోల్ సీనియర్ సిటిజన్స్ ఫోరం వారి సన్మానము. కృతజ్ఞతలు.

న్యూ నాగోల్ సీనియర్ సిటిజన్స్ ఫోరం కార్యవర్గం  మహాత్మాగాంధీ, లాల్ బహదూర్ శాస్త్రి గార్ల జయంతి సందర్భంగా చేసిన సన్మానము. దానికి కృతజ్ఞతతో వ్రాసిన పద్యాలు.

సీ. జాతికి పితయౌచు జాగృతి నేర్పిన , గాంధి మహాత్ముని ఘనజయంతి
    " జై జవానంచును" జగతికి దెలిపిన , శాస్త్రి జీ పుట్టిన స్వాదుదినము
     వృద్ధుల సన్మాన వేదికై వరలిన , సర్వసభ్యులకిల సంతసంబు
     అధికార వర్గాల కాదరంబు గలుగు, సంస్థ గౌరవమంద చాలునిదియ
 తే.గీ.  మంచిపనిజేయ సతతంబు మాన్యులగుచు
           యశము కోరకె యేతెంచు నవనియందు
          శ్రీనివాసుని కరుణను సిరులు విరియు
           క్రొత్త నాగోలు సంస్థకు కూర్మిదనర.

 సీ. నాగోలు బుధులెల్ల నాయందు జూపిన, ఆత్మీయతలకెల్ల అంజలింతు
      సభ్యులందరు గూడి సాధుజీవనులౌచు, వర్తించు తీరుకు ప్రణతులిడుదు
      సాంఘిక కార్యాల సంఘటితంబుగా, కృషిచేయు మీకెప్డు కేలుమోడ్తు
       జాతీయ పండుగల్ జాగృత తేజమున్, జరిపెడి మీకునే జైయనందు
 తే.గీ.మమత సమతల నందరు మధురరీతి
         పంచి పెంచెడి తీరుకు పరవశింతు
         సభ్యులందరు నూరేండ్లు చల్లగాను
         ఆయురారోగ్యములు గల్గ నభిలషింతు.
 సీ. వయసున మీరిన వందనీయులనెల్ల, గారవించెడు మీరు ఘనులనందు
      జ్ఞానుల సాహితీ జ్ఞానుల వృద్ధుల , గారవించెడు మీరు ఘనులనందు
      ఆటపాటలలోన అందెవేసిన వారి , ప్రోత్సాహమిచ్చెడు పుణ్యులందు
      సంగీత పాండిత్య సౌహృదులందరి , నక్కునజేర్చెడి యమరులందు
 తే.గీ. పెధ్ద మనసున్న నాగోలు వృద్ధులకును
          జ్ఞాన విజ్ఞాన సరస విజ్ఞులకును
          మాదు సన్మాన సమయాన మమతతోడ
          వందనాలను నర్పింతు వందవేలు.

 సీ.  అధికార గణముల అండదండలతోడ, అపురూప సౌధంబు నందుకొనిరి
       అధికార గణముల ఆత్మీయతలతోడ, సాంఘిక సేవల సల్పుకొనిరి
       అధికార గణముల ఆదరంబులనంది, ఆరోగ్య రక్షణ నందుకొనిరి
       అధికార గణముల అమృత వాక్కుల , సత్కార్యములనెల్ల సల్పుకొనిరి
 తే.గీ. సర్వ నాగోలు సభ్యులు సౌఖ్యమంద
          ఇందునున్నట్టి యధికార్లు హితమునంద
          సరళ సుగతి నీ సంస్థ స్థాయి నంద
          వేడుకొందును నీశుని వేడ్కతోడ.

 సీ. నాగోలు సంస్థకు నాకును బంధంబు , బిగిసెను మిత్రుల ప్రేమతోడ
      నాగోలు సంస్థకు నాకును బంధంబు ,  సాగెను సాహితీ సరసువలన
      నాగోలు సంస్థకు నాకును బంధంబు , మెండాయె క్రీడల మెరపు వలన
      నాగోలు సంస్థకు నాకును బంధంబు  , పెరిగెను సత్కళా ప్రియుల వలన
 తే.గీ. ఇన్ని బంధాల నిండిన ఇష్టమైన
          సంస్థ సర్వతోముఖముగ సాగిసాగి
          సభ్యులెల్లరు నారోగ్య సౌఖ్యమంది
          భావి జీవిత కాలాన వరలుగాక!

వృద్ధాప్యం వరమా?శాపమా?

వృద్ధాప్యం వరమా?శాపమా?

బాల్యం,యౌవనం,కౌమారం,వృద్ధాప్యం అనేవి అన్ని జీవరాసులకున్నా, ముఖ్యంగా మనం ఎక్కువగా గమనించగలిగేది మానవజన్మలోనే. విచిత్రం ఏమిటంటే మొదటి మూడు దశలలో కష్టాలున్నా  ఎవరో ఒకరు వాటిని వెనుక ఉండి బయట పడేస్తారు. బాల్యం అంతా అజ్ఞాన మిళిత ఆనందం. ఈ ఆనందం బాలుడికి ఏమీ తెలియకుండానే గడచిపోతుంది. అంటే తలిదండ్రులు వారి ఆనందం, హోదా చాటుట కొరకు వారి బాలబాలికల నలంకరించుకొంటారు. ఇక యౌవనంలో కొంతకొంత శారీరక మార్పులకు ప్రాతిపదికలు వేసుకుంటు, భిన్నరుచులు, అభిప్రాయాలకు పునాది ఔతుంది. ఈ వయసుకి కొంత సహకారం ఉంటుంది. కౌమారమంటే ముదిరిన యౌవనం.
ఎక్కువ భాగం మగవారిలో నూనూగుమీసాల స్థాయి దాటి  నాయకత్వ లక్షణాలు, పెద్దగా ఎవరిని లెక్కచేయకపోవటం,ఆడ పిల్లలలో వివేచన,విచక్షణా పూరిత సిగ్గు దొంతరలతోగూడిన ఆడతనం నాట్యం చేస్తుంది. మగవారికన్న రెట్టింపు జ్ఞానం కలిగి ఉంటారు.   ఈవయసే ఉద్యోగం, సంసార, సామాజిక బాధ్యత లను మోస్తుంది. తనంటే ఏమిటో ఋజువుచేసికొని పై మూడు రంగాలలో అద్వితీయ ప్రతిభను చాటుతుంది. అందరికీ ఆదర్శమై, హిమాలయసదృశంగా ఉంటుంది. తాను పదవీ విరమణ చేసేంతవరకు భార్యా సమేతమైన , భర్తృసహితమైన  జీవితం వరమని భావిద్దాం.
       పదవీవిరమణ చేసిన తరువాత ఎక్కువ మంది వారి ప్రతిభా వ్యుత్పత్తులను, వృత్తి నైపుణ్యాలను,వారు చేసిన సేవలను ప్రశంసించి ఇకపై భక్తి శ్రద్ధలతో, ఆధ్యాత్మిక భావాలతో ఆరోగ్యానికి ప్రాధాన్యమిచ్చి భావిజీవితాన్ని గడపమని పెద్దవారు దీవనలు, చిన్నవారు ఆకాంక్షలను  ఇస్తారు. కాని చాలా మంది  మగవారు నిరాశానిస్పృహలతో ఏదో సమస్తం కోల్పోయినట్లు భావించి  పడక కుర్చీకి అంకితమై, సాధారణ వ్యాయామం కూడ చేయక మానసిక, శారీరక వ్యాధిగ్రస్తులై వైద్యుల చుట్టు తిరుగుతుంటారు. బహుశః ఇక్కడి నుండే శాపం ప్రారంభమౌతుందేమో.
       ఎందుకంటే మొదట వివాహితులుగానున్నప్పుడు వారు జంటగా ఒంటరితనమే కోరుకుంటారు. ప్రకృతి సహజమే. ఆనాడది వరమౌతుంది. ఇరువురిలో శారీరక, మానసిక బలాలు ఉంటవి కనుక. అరవై సంవత్సరాల వయసులో , ఆపై వయసులో, రోగాలపాలై  అలా ఇరువురే ఉండి కనీసం వచ్చి చూచే వారుకూడ లేకుంటే....అది శాపం కాక ఏమౌతుంది? వారు సంతానమున్న నిస్సహాయులు.
    ఇక్కడొక సున్నితమైన అంశం ప్రస్తావించాలి.
           కొడుకులు, కూతుళ్ళు ఉంటారు. వారు ఈరోజుల్లో ఎవరి ఉద్యోగాలు, బాధ్యతలు , అభివృద్ధి కార్యక్రమాలు మానుకొని "మాతృదేవోభవ పితృదేవోభవ"అంటు వచ్చి కూర్చోరు. అలా ఈ వృద్ధులు కోరుకొన్నా వారి బిడ్డల అభ్యున్నతికి గొడ్డలి పెట్టు అయినట్లే. ఈస్థితి వరమో శాపమో ఆ పెరుమాళ్ళకెరుక. కొందరికి కొడుకులు గాని, కూతుళ్ళు గాని " రండి నాన్నా మనం కలసి ఉందాం కలిగింది తిందాం, ఈ వయసులో మీకు మేము ఆసరాగా ఉంటాం, అది మా బాధ్యత" అని నోరారా అనగలగటం తలిదండ్రులకు వరమే.
వారు  ప్రేమాభిమానాలతో  మనసార తమ దగ్గరే ఉండమనకపోవటం గాని, అలా వారు అన్నా  ఉండలేకపోవటం గాని, శాపమే. ఈ శాపగ్రస్తులు వారి దగ్గరకు వెళ్ళలేక, వారి పనులు వారు చేసుకోలేక ఒంటరి బ్రతుకులు ఈడుస్తుంటారు విధి వ్రాతకు ఏడుస్తుంటారు.
         ఇంత నావింత సోదికి ఒక 94 సంవత్సరాల చీకు వృద్ధుని దయనీయ గాధే మూలం.
          ఆయనకు కొడుకులు, కూతుళ్ళు, మనుమలు, మనుమరాళ్ళు ఉన్నారు. ( కొందరు దగ్గరలోనే ఉన్నారు )  నిజాయితీ కలిగిన ప్రభుత్వోద్యోగిగా మన్ననలు పొంది విశ్రాంత జీవితం గడుపుతున్నారు. దురదృష్టవశాత్తు భార్యా హీనుడు. ఒక సీనియర్ సిటిజన్ సంస్థలో సన్మానము పొందబోతు " నాకిపుడు సన్మానము జరుగబోతున్నది. అందరికి ఎవరో ఒకరు వచ్చారు. నాకు కూడ మీరెవరైనా వస్తే సంతోషంగా ఉంటుంది. దయచేసి రండి" అని దీనంగా ప్రార్థించటం , ఏ ఒక్కరము రామని చెప్పటం నా మనసుని  కలచివేసింది. ఇపుడు చెప్పండి ఆయనకది వరమా? శాపమా?  మన చిన్నతనంలో మన బుడిబుడి అడుగులకు ఆనందపడుతునే, వాడెక్కడ క్రింద పడతాడో అని ఒళ్ళంతా కళ్ళు చేసుకుని చూచే వృద్ధ తలిదండ్రులకిచ్చే ఆసరా ఇదేనా?
      ఏదియేమైనా సంతానం పొందటం ఆనందదాయకమే. వారిని సంతోషపెట్టే సత్సంతానమైతే వరమే. దానికి భిన్నమైతే శాపమే కదా. తలిదండ్రుల గుండెల్లో తన్ని మనం ఎదిగామని గుర్తుంచుకొని, వారికి గుండె కోత తెప్పించరాదు. నా వ్యక్తిగత అభిప్రాయం మాత్రమే సుమా!  

16, జులై 2017, ఆదివారం

అమర్నాథ్ యాత్ర...నా అనుభూతి.



  **గోల్డెన్ టెంపుల్ గూర్చి.**

      శిక్కులదేవాలయమది
      అక్కజమౌస్వర్ణమయము హ్లాదముగూర్చెన్.
      మిక్కుటమౌఆజ్యమిళిత
      చక్కని పసదనముదొరికెసంతసమొప్పన్.

   శిక్కులపవిత్ర గ్రంథము
   నిక్కపుభక్తిన్జదువుగ నేనటుగంటిన్భఘృ
   అక్కడి సద్గురువర్యుల
   అక్కరుణామూర్తులకివె అంజలులార్యా!

          ధైర్య సాహసాలు తమసొంతమనురీతి
         చిన్నపెద్ధవృద్ధ చేతులందు
         ఛురికలుండెమనకు చోద్యమలర.
         భరతమాత పుత్ర భవ్యచరిత!

** కురుక్షేత్రం గురించి.**
  గీతాచార్యుని నిలయము
  ప్రాతః స్మరణీయమైన ప్రాంతమునంతా
  చూతము రారండిబుధులు
  చేతమ్మున భక్తినింపి క్షేత్రమ్మునకున్.

   ** వైష్ణవీదేవిని గూర్చి.**

   దర్శన భాగ్యమిచ్చెనిట తాత్త్వికరూపిణి వైష్ణవీసతే
   దర్శితనేత్రముల్ మిగుల ధన్యతనందె పవిత్రమై పున
   ర్దర్శనమెప్పుడో యనెడు ధార్మికజీవుల మస్తకంబులన్
   స్పర్శను జేయుచున్ కరము సంతసమిచ్చె కృపాంతరంగయై.

        అమ్మనుజూడగాదలచి ఆర్తుడనై విలపించుచుండ,రా
        రమ్మని సద్దయన్ బిలచి రమ్యకపర్దిని వైష్ణవమ్మయే
        తెమ్మనె నాదుబృందమును తెల్విగకొండకు ప్రాణనాధునిన్
        అమ్మకుమాటయిచ్చిజవనాశ్వమురూపముదాల్చె శంభుడే.

    రాజు నామానబరగెడు రమ్య హయపు
    శిక్షకుడుహమీదనువాడు చెలిమితోడ
    చతుర భాషణాచణుడౌచు సాగివచ్చి
    అమ్మ పాదాలజేర్చెను హ్లాదమొప్ప.

          తాతపేరున బెరిగిన జాతకుండ
          సూర్యనారాయణాఖ్యుండ ‌సూరిబ్రువుడ
          వారినామంపుఫలమేమొ తేరిచూడ
          అశ్వమెక్కెడి యదృష్టమవనికలిగె.

 భైరవరాక్షసుండు నను భర్తగచేకొనుమంచుకాళికన్
 ఘోరతరంబుగాగ కడు కూళత నీచత వెంబడింపగా
 ధీరత రౌద్రరూపమున దిక్కులు సర్వము పిక్కటిల్లగా
 పోరునుసల్పి వానినటు ముచ్చటజేర్చెను కాలుచెంతకున్.

       తప్పు క్షమియింపగల్గిన తరుణిజూచి
       అమ్మ !నాకిటప్రాముఖ్యమమరునట్లు
       వరము నీయుమ కరుణను వాంఛదీర
       యనుచు గోరగ భైరవుననుమతించె.  

  నిన్ను గాంచిన పిదపనే నిశ్చయముగ
  ముక్తి నందును భక్తాళి మోదమలర
  అనుచు వరమిచ్చె ప్రేమతో వైష్ణవమ్మ
  అమ్మతనమును రూపించె నాదిశక్తి.

            **వైష్ణవోదేవి పాట**

  వైష్ణవిమాత వైభవచరిత వరములనీవమ్మా!
  నీపద సన్నిధి జేరినవారిని నెమ్మదిజూడమ్మా!

  మూడు మూర్తుల మోహనరూపివి లక్ష్మీ వాణీ కాళికవు.
  ముల్లోకంబుల భక్తుల బ్రోచెడు కరుణరసాంచిత పాలితవు.॥వై॥
  అష్టలక్ష్మిగా నమ్మినవారిని అందలమిచ్చి కాచెదవు
  నలువరాణిగా కొలిచినవారికి నాలుకపై నడయాడెదవు.   ॥వై ॥
  నామభేదముల నానారీతుల నెలకొనియున్న ఏకరూపివి
  ఎక్కడక్కడచూపుము నాకని పలుకువారికి నిశ్శబ్ద శక్తివి.   ॥వై॥
   బహువిధ మణుల రత్నరాసులను భారీపూజలు చేసినగాని
  శుద్ధభక్తికే పట్టముగట్టెడి సుందరమూర్తివి నీవమ్మా             ॥వై॥

                  **అమరనాధుని అందాలు**
  శ్రీ అమరనాథుని అందమునంతా చూతమురారండి
  గుహలో వెలసిన మంచులింగమును తలచుచురారండి

      కనులకు శిరమది కనబడకుండును
              హిమసౌందర్యంబున దాగియుండును
      కనులకు గంగయు కనబడకుండును
               ప్రవాహరూపిగ పారుచుండును.           ॥అమర॥

     ఉమకై వెదుకగ నుండదచ్చట
                 ఉన్నది శంభుని కూతమిచ్చుచు
     అగ్నినేత్రము కానరాదులే                
                 ఆరెను ఎప్పడొ ఆచలికి                     ॥అమర॥

     నాగాభరణము నామమాత్రమై        
                 మంచుకణములో మాయమైనది
     శూలము,ఢక్కా సృక్కిపోవుచు
                  సుందర హిమమున కరగిపోయెను ॥అమర॥

    మంజీరంబది మౌనముద్రతో
                 మంచునపొంచెను మరిమరిమ్రోగక
    బసవడు సైతము పరవసించుచు
                  కోటికష్టముల గోటద్రుంచుచు
                రారమ్మంచును రంకెవేసెను.             ॥అమర॥


అమరనాథుని యాత్రలో హ్లాదమొప్ప
  పాలుపంచుక నిరతంబు పారమార్థి
  కంబు నెయ్యంపు సమ్మతిన్ కలసినట్టి
  మాన్యసోదరసోదరీమణులనుతింతు.

       పెద్దల గారవించుచును ప్రేమవినిర్మిత మాతృభావనన్
       ముద్దులుమూటగట్టి కడు మోదముగూర్చెడు పల్కుజిల్కుచున్
       హద్దులుదాటనీని చిరు హాస్యము హాసము పంచుచున్సదా
       నిద్దురదూరమున్సలుపు నిర్మలమూర్తుల కంజలింతునే.

        అమరనాథుని యాత్రలో నాతో ప్రయాణం చేసిన వారి గురించి పాట.

ఓ....సోదర,సాదర భక్తశిఖామణులారా!
సరస సహృదయ సోదరీమణులారా!
   వినరండీ యాత్రాఫలం, కనరండీ జ్ఞాన బలం.

       అమరనాధుని అనుగ్రహముతో అంతా సుఖకరమైనది
       అమ్మపార్వతి అనురాగం తో అంతా సుముఖమయైనది.

  తీర్థయాత్రలో తీయని కష్టం త్రినేత్రుడిచ్చే వరమేలే
  సార్థకంబులై జీవితంబులే సంపదాళితో వరలునులే

    హిమాలయంబులు నదీనదంబులు
    పచ్చని చెట్టు పశుపక్ష్యాదులును
         శంభునిరూపం  శాంభవి తేజం.

  మానవజీవన గమ్యం మమతాసమతల రమ్యం
  మానవత్వమే మాధవు సేవకు సోపానం

       అమరనాధుని యాత్రకువెళ్ళే అన్నార్తులకిల అండగనుంటు
       పంచభక్ష్యముల పంచేవారిని పరమాత్మే దయజూచునులే.

                       జై జవాన్!!!

   మంచుకొండలలోన నించుక వెరువక
                    కావలికాయునా ఘనుడెవండు
   తనవారినందరి త్యాగంబు జేయుచు
                      కొండగుహలలోన నుండునెవడు
   శత్రువులకెప్పుడు శరభమై కనిపించి
                      నిద్దుర రానీని నెయ్యమెవడు
  భరతమాతకునెప్డు బంగరు బిడ్డ గా
                        విఖ్యాతిగన్నట్టి వీరుడెవడు
ఎవడు ఎవడని ఇతరత్ర వెదుకవలదు
జైజవానని సత్కీర్తి శాస్త్రి వలన
పొంది యున్నట్టి యరుదైన ముద్దు బిడ్డ
భారతీయులపాలిటి ప్రాణదాత!!

              అమరనాథుని దర్శనం... నా అనుభూతి.

 అమరనాథునిగంటి ఆత్మీయ భక్తుల
             మీనంపునేత్రాల మెరపులందు
 అమరనాథునివింటి నద్భుతస్వరములన్
             భంభంభోలెయనడు భజనలందు
 అమరనాథుని దరహాసచంద్రికలను
              నింపుకొంటినిహృది నిండుదనుక
  శ్రీహిమాలయమున చిత్తంబు భవుపాద
              పద్మాలకర్పించి ప్రణతులిడితి
     ఎన్ని జన్మల పుణ్యమో ఎరుగలేము
     శివుని ఆజ్ఞగ భావించి చేరవచ్చి
     పారమార్థక చింతనన్ పరవశించి
     ఈశునాశీస్సులందితి నిశ్చయముగ.
     
       


దుర్గ దంపతుల పెళ్లి రోజు శుభాకాంక్షలు.12.05.26.

 ఆ.వె: చందమామ రేల డెందాలుమురిపించు రేయి బవలు వెల్గు రేడు నీదు మేనమామ; మనసు మెచ్చిన చెలికాడు జీవన పయనాన నావయతడు.1  సీ : ఒకచోట దుర్గమ్మ ఒకచోట ...